గంటా ఫుల్ రీచార్జి… దెబ్బ కొడతారంతే ?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ తన ఆట మొదలెట్టేశారు. ఏడాదిన్నర పాటు సైలెంట్ అయిన ఆయన ఇపుడు వైలెంట్ అంటే ఏటో చూపిస్తారు అని అనుచరులు [more]

Update: 2020-12-24 03:30 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ తన ఆట మొదలెట్టేశారు. ఏడాదిన్నర పాటు సైలెంట్ అయిన ఆయన ఇపుడు వైలెంట్ అంటే ఏటో చూపిస్తారు అని అనుచరులు అంటున్నారు. చంద్రబాబుకు చెడి జగన్ తో కుదరక పొలిటికల్ జంక్షన్ లో ఇన్నాళ్ళూ ఉన్న ఈ సీనియర్ నేత ఇపుడు ఫుల్ రీ ఛార్జి అయి రీ ఎంట్రీ ఇచ్చేశారు. తన పవర్ ఏంటో చూపించి మరీ ఎవరినైనా తన దారికి తెచ్చుకుంటానని శపధం చేస్తున్నారు. తాను ఏ పార్టీ అన్నది అనుచరులే మరచేలా ఇంతకాలం వ్యవహరించిన గంటా శ్రీనివాసరావు చాలాకాలానికి తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు రావడమే కాదు, క్యాడర్ కి కూడా దిశానిర్దేశం చేశారు.

ఉత్తరం ఊపేస్తుందా …

తాను గెలిచిన ఉత్తరం నియోజకవర్గం పరిధిలోని టీడీపీ కార్పోరేట్ అభ్యర్ధులతో సమావేశమైన గంటా శ్రీనివాసరావు ఎట్టి పరిస్థితుల్లోనూ జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలవాల్సిందేనంటూ గట్టిగానే సౌండ్ చేశారు. ఒక్క కార్పోరేటర్ కూడా ఓడిపోవడానికి వీలులేదని కూడా ఆదేశించారు. ఇకపైన తాను పూర్తిగా అందుబాటులో ఉంటానని, ఉత్తరంలో సైకిల్ జోరుకు ఏ పార్టీ అడ్డు వస్తుందో చూద్దామంటూ గర్జించారట. మొత్తానికి ఇదంతా చూసిన ఆయన అనుచరులు తమ నాయకుడు టీడీపీలోనే సెటిల్ అయిపోతారని అనుకుంటున్నారుట.

సత్తా చూపించి బేరాలా…?

గంటా శ్రీనివాసరావు అంటే ఓ సాధారణ నాయకుడు. ఏమీ చేయలేడు అని ఎవరైనా అనుకుంటే వారి భ్రమలు తొలగించడానికే ఆయన ఇలా మళ్ళీ దూకుడు మొదలెట్టారని అంటున్నారు. గంటాను ఈ మధ్య కాలంలో సొంత పార్టీ అధినేత చంద్రబాబు సైతం అసలు పట్టించుకోలేదు. జూనియర్లకు సైతం పెద్ద ఎత్తున పార్టీ పదవులు పంచిన బాబు గంటా అన్న పెద్ద మనిషి ఒకరు టీడీపీలో ఉన్నారన్న సంగతిని కావాలనే పూర్తిగా విస్మరించారు. ఇది కూడా గంటా శ్రీనివాసరావుకు గుర్తుంది అంటున్నారు. అందుకే స్వపక్షానికి కూడా తాను ఏంటన్నది రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఈ మాజీ మంత్రి భావిస్తున్నారుట. ఉత్తరంలో ఎవరి అండా లేకుండా తాను ఒక్కడిగా మొత్తానికి మొత్తం టీడీపీ కార్పోరేటర్లను గెలిపించాలని గంటా శ్రీనివాసరావు డిసైడ్ అయ్యారని అంటున్నారు.

అదేనా టార్గెట్ ….

ఇక విశాఖలో ఎటూ వైసీపీకి బలం తక్కువగా ఉంది. రేపటి రోజున జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ మేయర్ పీఠానికి సీట్లు తగ్గితే గంటా శ్రీనివాసరావు మార్క్ రాజకీయం మళ్ళీ మొదలవుతుంది అంటున్నారు. తాను గెలిపించుకున్న కార్పోరేటర్లతో ఆయన రాజకీయ చదరంగమే ఆడుతారు అని కూడా వినిపిస్తున్న మాట. అంగబలం, అర్ధబలం దండీగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఒక్క ఉత్తరం నియోజకవర్గం వరకే పరిమితం అవుతాను అని చెప్పడం టీడీపీకి కూడా హెచ్చరిక లాంటిదేనని అంటున్నారు. మొత్తానికి స్థానిక ఎన్నికల తరువాత గంటా మార్క్ రాజకీయం మొదలవుతుందని, ఆయన ఏ వైపు అడుగులు వేస్తారన్న దాని మీద పూర్తి క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి మాజీ మంత్రి గారి పవర్ ఫుల్ రాజకీయం ఏంటో.

Tags:    

Similar News