గంటా లెక్కలు అవేనా ?

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, విశ్లేషకుడు కూడా. ఇక ఆయన రాజకీయం ఎటు నుంచి ఎలా పోతుందో [more]

Update: 2020-07-09 08:00 GMT

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, విశ్లేషకుడు కూడా. ఇక ఆయన రాజకీయం ఎటు నుంచి ఎలా పోతుందో కూడా ముందే ఊహించి దానికి తగినట్లుగా తన పొలిటికల్ కెరీర్ని డిజైన్ చేసుకోగల చతురుడు. ఇలా రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన ఎపుడు పాము బారిన పడకుండా నిచ్చెనలే ఎక్కుతూ రాజకీయ వైకుంఠపాళీలో వరసగా ఎత్తులు చూశారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఆయన గెలిచినా పార్టీ ఓడి పాము నోట్లో అడ్డంగా పడిపోయారు. ఇక్కడ కూడా ఆయన లెక్క, అంచనాలు తప్పలేదు. అయితే వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని తెలిసినా గోడ దూకడానికి వీలు లేని అనివార్య పరిస్థితులకు నాడు గంటా శ్రీనివాసరావు బాధితుడు అయిపోయారు.

వేచి చూస్తూ …..

ఇక ఆ విధంగా ఓడిన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేగా భారంగా ఏడాది గడిచిపోయింది. గంటా శ్రీనివాసరావు టీడీపీని వదిలి వెళ్ళడంలేదు. అలాగని ఇదే నా పార్టీ అంటూ ప్రతీ రోజు రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు పెద్ద ఎత్తున చేస్తూ చొక్కాలు చింపుకోవడంలేదు. ఆయన మౌనంగానే ఉంటున్నారు. ఆపత్కాలంలో మాత్రం బాబు చెప్పినట్లుగా పార్టీకే ఓటు చేస్తూ తాను ఉన్నాను అనిపించుకుంటున్నారు. అయితే ఇంతమాత్రానికే ఆయన పసుపు పార్టీలోనే కలకాలం ఉండిపోతానుకుంటే పొరపాటే అంటున్నారు. గంటా శ్రీనివాసరావు లెక్కలు చూస్తే ఆయన సరైన సమయం చూసి ఎపుడైనా జంప్ చేయగలరు అంటారు. ఆ ఆలోచన టీడీపీ అధినాయకత్వంలోనూ ఉంది. అయినా వారు చేసేది కూడా ఏమీ లేదు.

కష్టమేనా….?

ఇక గంటా శ్రీనివాసరావు వంటి తలపండిన నాయకుల లెక్కల ప్రకారం ఇపుడున్న పరిస్థితుల్లో టీడీపీ జగన్ ని ఓడించి గెలవడం కష్టమనే అంచనా ఉందట. చంద్రబాబు, లోకేష్ పార్టీని లాగలేరని, జగన్ దూకుడుని అడ్డుకోలేరని గంటా లాంటి సీనియర్లు గట్టిగా అభిప్రాయపడుతున్నారుట. అయితే ఇది రాజకీయం కాబట్టి అందునా అక్కడ ఉన్నది చంద్రబాబు కాబట్టి లాస్ట్ కార్డ్ బయటకు తీసి ఆట నాదే అనగల సమర్ధుడు కాబట్టి కొంత వరకూ నమ్మకం ఉందిట. అయినా సరే ఒంటరిగా టీడీపీ మళ్ళీ 2024లో పోటీ చేస్తే బాబు ఎంతటి గండరగండడు అయినా సరే ఓటమి ఖాయమనే గంటా శ్రీనివాసరావు లాంటి తమ్ముళ్ల ఆలోచనగా చెబుతున్నారు.

ఆ ఆశతోనే ……

ఇక గంటా శ్రీనివాసరావు వంటి సినియర్ నాయకులు ఇంకా టీడీపీలో ఎందుకు కొనసాగుతున్నారన్న డౌట్ ఎవరికైనా రావచ్చు. అయితే 2014 పొత్తులు రిపీట్ అవుతాయన్న ఆశతోనే వారు ఉంటున్నారని చెబుతున్నారు. అంటే జనసేన, బీజేపీ టీడీపీ అప్పటికి ఒక్కటిగా నిలిచి పోటీ చేయవచ్చునని అంటున్నారు. అదే కనుక జరిగితే జగన్ మీద గట్టిగానే పోరాడవచ్చునని, వీలైతే ఈ కూటమి గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదని గంటా శ్రీనివాసరావు బ్యాచ్ విశ్లేషణగా ఉందిట. అందువల్లనే ఇప్పటి నుంచే తొందరపడి వేరే పార్టీ గోడలు ఎక్కి చిన్నబుచ్చుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నారుట. ఎటువంటి పొత్తులు అయినా ఎన్నికలకు ఏడాది ముందు కుదురుతాయని, అప్పటికీ టీడీపీని వేరుగానే ఉంచి బీజేపీ, జనసేన కూటమి ముందుకు వస్తే మాత్రం ఆ కూటమిలోకి వెళ్ళడానికి కూడా గంటా వంటి నేతలు రెడీగా ఉంటారని వేరే చెప్పనవసరం లేదంటున్నారు. అంటే ఏ పొత్తులు లేక ఇదే రూపులో, తీరులో టీడీపీ వుంటే మాత్రం గంటా శ్రీనివాసరావుతో సహా సీనియర్లు ఎవరూ పార్టీలో వచ్చే ఎన్నికల నాటికి మిగలరని ప్రచారం జోరుగా సాగుతోంది.మరి బాబు తన కోసం కాదు, తమ్ముళ్ల కోసమైనా బీజేపీతో అర్జంటుగా చేతులు కలపాల్సిందేనన్నమాట.

Tags:    

Similar News