గంటా మాస్టార్ కొత్త లెక్కలు

విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ అంచనాలు చాలా కరెక్టుగా వేస్తారని పేరు. ఆయన 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ ఓడిపోతుందని, వైసీపీ [more]

Update: 2020-01-19 13:30 GMT

విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ అంచనాలు చాలా కరెక్టుగా వేస్తారని పేరు. ఆయన 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ ఓడిపోతుందని, వైసీపీ గెలుస్తుందని బాగానే అంచనా వేసుకున్నారుట. అయితే ఆయన వైసీపీలోకి జంప్ చేయడానికి చేసిన ప్రయత్నాలు మాత్రం వర్కౌట్ కాక సైకిల్ దిగలేకపోయారుట. సరే జరిగింది వేరు, ఇపుడు ఎనిమిది నెలల తరువాత ఏపీలో రాజకీయ సమీకరణల్లో కొత్త మార్పు వచ్చింది. జనసేన, బీజేపీ చేయి కలిపాయి. మరో వైపు పార్టీ మారుతారనుకున్న గంటా శ్రీనివాసరావు టీడీపీ మా గొప్ప పార్టీ అంటూ కీర్తిస్తున్నారు. దీని వెనక మతలబు ఏంటన్నది తమ్ముళ్ళకే అర్ధం కావడం లేదట. తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లా లేనట్లా అన్నట్లున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్న గారి వర్ధంతి వేళ ప్రత్యక్షమై ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ పటిష్టమైనదని చెప్పుకొచ్చారు. టీడీపీ సాటీ, పోటీ మరో పార్టీ లేనేలేదని కూడా తేల్చేశారు.

టీడీపీ గ్రేట్…..

ఏపీలో ఎన్నికలు చూస్తే సరిగ్గా నాలుగున్నరేళ్ళ దూరంలో ఉన్నాయి. ఇప్పటినుంచే పొత్తు పొడవనక్కరలేదు కానీ తొందరపడిన కమలం, జనసేన కోయిలలు ముందుగా కూసేశాయి. మరి సేఫ్ జోన్లో ఉందామనో లేక వైసీపీ తో ఢీ కొట్టేందుకు కొత్త బలం కోసమో బీజేపీతో జనసేనకు పొత్తు అయితే కుదిరింది. ఇక ఇపుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వంతుట. జనసేనతో బీజీపీ పొత్తు పెట్టుకుంటే టీడీపీ భయపడేది లేదని గంటా శ్రీనివాసరావు అంటున్నారు. టీడీపీని ఢీ కొట్టడం కష్టమని కూడా గంటా చెప్పడం విశేషం. క్షేత్ర స్థాయిలో పటిష్టమైన క్యాడర్ ఉందని, అదే టీడీపీకి శ్రీరామరక్ష అని కూడా గంటా చెప్పుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పిన గంటా శ్రీనివాసరావు తాను ఫక్త్ టీడీపీ నేతను, అన్న గారికి అసలైన తమ్ముణ్ణి అని గట్టిగానే చెప్పుకున్నారు.

మళ్ళీ మూడూనా….?

గంటా అంచనాల ప్రకారం చూసుకుంటే ముందుగా జనసేన బీజేపీ కలిశాయి. ఇక 2024 ఎన్నికల్లోగా టీడీపీ కూడా వాటితో జత చేరాలి, చేరుతుందని కూడా గంటా శ్రీనివాసరావు అంటున్నారంటే ఆయన వద్ద పక్కా క్లారిటీతో కూడిన సమాచారమే ఉండి ఉంటుంది. అందుకే ఈ మధ్య బయట ఎక్కడా పెద్దగా కనిపించని గంటా ఇపుడు టీడీపీ నేతలతో కలసి సందడి చేయడం, పొత్తుల ఎత్తుల గురించి మాట్లాడడం జరిగిందని అంటున్నారు. ఇక టీడీపీ సమయం, సందర్భం చూసి పొత్తులు పెట్టుకుంటుందని గంటా కాస్తా ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. అంటే మళ్ళీ ఈ మూడు పార్టీలు కలుస్తాయన్న సంకేతాలు ఆయన మాటల ద్వారా ఇచ్చారనుకోవాలి.

సైకిల్ తమ్ముడేనా…?

మరి గంటా శ్రీనివాసరావు వరకూ చూసుకుంటే లేటేస్ట్ కామెంట్స్ తో ఆయన సైకిల్ పార్టీలోనే కొనసాగుతారని భావించవచ్చా. అంటే అది మాత్రం చెప్పలేమని తమ్ముళ్ళే గుసగుసలాడుతున్నారు. ఎన్నికలు జరగాలంటే ఇంకా నాలుగున్నరేళ్ళ సమయం ఉంది. ఈలోగా ఎన్ని మార్పులైనా సంభవించవచ్చు. జగన్ రాజకీయ చదరంగంలో ఎన్ని పావులు కదుపుతారో కూడా చూడాలి. అదే సమయంలో ఇపుడున్నట్లుగా టీడీపీ ఉండకపోవచ్చు. పెరగావచ్చు, విరగావచ్చు. అందువల్ల గంటా శ్రీనివాసరావు మాటలకు ఎన్నో అర్ధాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా జనసేనతో బీజేపీ కలవడం మాత్రం టీడీపీకి కొంత నిబ్బరం ఇంచ్చిందని గంటా మాటల బట్టి తెలుస్తోంది అంటున్నారు. ఇక పోతే రేపటి రాజకీయాల్లో ఎపుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు.

Tags:    

Similar News