ఆ చొక్కా తొడుక్కోలేదే….?

నా కంటే మహా నటుడు నా అల్లుడు అన్నాడు దివంగత నేత నందమూరి తారక రామారావు. రాజకీయాల్లో నటన చాలా అవసరం. రీల్ లైఫ్ లో కెమెరా [more]

Update: 2019-08-02 12:30 GMT

నా కంటే మహా నటుడు నా అల్లుడు అన్నాడు దివంగత నేత నందమూరి తారక రామారావు. రాజకీయాల్లో నటన చాలా అవసరం. రీల్ లైఫ్ లో కెమెరా ముందు నాలుగు డైలాగులు చెప్పేస్తే సరిపోతుంది. అదే రియల్ లైఫ్ లో మాత్రం ప్రతి క్షణం యాక్ట్ చేస్తూనే ఉండాలి అంటారు తలపండిన సినిమా నటులు. ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ నుంచి దూరమవుతున్నారా అన్న ప్రశ్నకు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పే సమాధానం చాలా భావోద్వేగంతో కూడుకున్నదిగా ఉంటుంది. నేను రాజకీయాల్లోకి వచ్చిందే చంద్రబాబు చలువతో, దయతో. ఆయన పెంచిన మొక్కను నేను. నేను బాబుని వీడిపోవడమా అంటూ భారీ డైలాగులే గంటా వారు వల్లిస్తారు. ఇవన్నీ సరే ఇపుడు పార్టీ దారుణంగా ఓడిపోయింది. చంద్రబాబు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. ఓ సీనియర్ నేతగా, బాబు హయాంలో అయిదేళ్ల పాటు పనిచేసిన మాజీ మంత్రిగా గంటా శ్రీనివాసరావు టీడీపీకి బాబుకు ఏ రకంగా సహాయంగా ఉంటున్నట్లు. ఇదీ ఇపుడు తమ్ముళ్ళ మదిలే మెదిలే ప్రశ్న.

ఒక్కసారే మెరిసారు….

గంటా శ్రీనివాసరావు పార్టీ ఓటమి తరువాత పెద్దగా జనాల్లో కనిపించింది లేదు. ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఇక అసెంబ్లీ సెషన్ లో కూడా ఆయన ఎక్కడా నోరు విప్పకపోవడాన్ని అంతా చూశారు. బాబుని నేరుగా వైసీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేసినా కూడా గంటా శ్రీనివాసరావు పట్టనట్లుగానే ఉన్నారు. మరో వైపు గంటా శ్రీనివాసరావు తనకు క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగిన ప్రజా పద్దుల చైర్మన్ పదవి కోరుకున్నారు. చంద్రబాబు దాన్ని పయ్యావుల కేశవ్ కి ఇచ్చారు. ఈ పరిణామంతో గంటా శ్రీనివాసరావు మరింతగా కుంగిపోయి పూర్తిగా పార్టీ రాజకీయాలకే దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక గంటా శ్రీనివాసరావు గత రెండు నెలల వ్యవధిలో ఒకేసారి మెరిసారు. అది కూడా మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు విశాఖలో జరిగిన సన్మానానికి ఆయన హాజరయ్యారు. అక్కడ కూడా కొద్ది సేపు మాత్రమే కనిపించి వెళ్ళిపోయారు.

ప్రతిపక్షంలో ఉండలేరా….

అధికారంలో ఉండే కంటే ప్రతిపక్షంలోనే హాయిగా ఉంటుందని పార్టీ ఓడిన కొత్తలో గంటా శ్రీనివాసరావు మీడియాతో అన్నారు. తన వరకూ విపక్ష నేతగా ప్రజా సమస్యలు లేవనెత్తి వాటిని పరిష్కరించడంలోనే ఆనందం ఉంటుందని కూడా గంటా శ్రీనివాసరావు అన్నారు. మరి రెండు నెలలు పై దాటేసింది, గంటా శ్రీనివాసరావు మాత్రం ప్రతిపక్షం చొక్కా తొడుక్కోలేదు. పైగా ఆయన నోరు విప్పి ఒక్క కామెంట్ కూడా చేయడంలేదు. విశాఖలో తొందరలో జీవీఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీ పతిస్థితి చూస్తే పతనావస్థలో ఉంది. ఎక్కడా క్యాడర్లో ఉత్సాహం లేనే లేదు. వారికి గాడిలో పెట్టే నాయకుడు లేకుండా పోయారు. సరిగ్గా 12 ఏళ్ళ క్రితం 2007లో గంటా శ్రీనివాసరావు టీడీపీ ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నపుడే జీవీఎంసీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో టీడీపీ ఓటమికి అయ్యన్న, గంటాల వర్గ విభేదాలే కారణం. ఇపుడు ఈ ఇద్దరు నేతలూ అలాగే ఉన్నారు. ఒకే పార్టీలో ఉన్నారు. నాటితో పోలిస్తే ఇపుడు గంటాలో ఆ దూకుడు కూడా తగ్గిపోయిందని అంటున్నారు. మరి బాబు పెంచిన మొక్క పార్టీ కోసం కీలకమైన సమయంలో ఏం చేస్తుందన్నదే అసలైన ప్రశ్న.

Tags:    

Similar News