గంటా వచ్చేది అప్పుడేనటగా ?

తెలుగుదేశం పార్టీకి విశాఖ మొత్తానికి నిఖార్సుగా మిగిలేది ఒకే ఒక్కడు వెలగపూడి రామకృష్ణ బాబు మాత్రమేనని అంటున్నారు. తొలి వికెట్ గా సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ [more]

Update: 2020-09-20 03:30 GMT

తెలుగుదేశం పార్టీకి విశాఖ మొత్తానికి నిఖార్సుగా మిగిలేది ఒకే ఒక్కడు వెలగపూడి రామకృష్ణ బాబు మాత్రమేనని అంటున్నారు. తొలి వికెట్ గా సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఫ్యాన్ నీడకు చేరారు. ఇక వచ్చే నెలలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ప్రియ శిష్యుడు, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబును తీసుకుని మరీ వైసీపీ కండువా కప్పుకుంటారని టాక్. నిజానికి వాసుపల్లి కూడా గంటా శ్రీనివాసరావు తో రావాల్సి ఉంది. అయితే గంటా రాక విషయంలో ఇంకా కొన్ని రకాల అభిప్రాయ భేదాలు వైసీపీలో ఉన్నాయి. దాంతో ఆయన వచ్చేది ఎపుడో తెలియడంలేదు. కచ్చితంగా వస్తారా అన్నది కూడా తేలడంలేదు. దాంతో వాసుపల్లి తనకు తానుగా విజయసాయిరెడ్డితో టచ్ లోకి వెళ్ళి మరీ ఫ్యాన్ నీడన సేదతీరాలనుకున్నారు.

అందుకే ఆయనలా…

ఇక విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ఒక్కరే గంటా శ్రీనివాసరావు ను అనుసరిస్తున్నారు. ఆయన కూడా ఎపుడో వైసీపీలోకి రావాల్సిఉంది. ఈ మేరకు వైసీపీ హై కమాండ్ ఆయనకు భారీ ఇన్విటేషన్ పంపించింది కూడా. ఘనమైన రాజకీయ వారసుడిగా ఉన్న గణబాబు రెండు దశాబ్దాలుగా విశాఖ రాజకీయాలో రాణిస్తున్నారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గతంలో గంటా శ్రీనివాసరావు తో కలసి ప్రజారాజ్యంలోకి కూడా వెళ్ళి వచ్చారు. ఇక చంద్రబాబు మీద టీడీపీ మీద ఆయన ఇప్పటికే చాలా గుస్సాగా ఉన్నారని టాక్. తన నియోజకవర్గంలో గ్యాస్ లీక్ అయి పదిహేను మంది చనిపోతే బాబు కానీ లోకేష్ కానీ రాకపోవడం పట్ల గణబాబు మండిపడుతున్నారు. ఆయన అపుడే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.

రాజధాని పేరిట…..

విశాఖకు రాజధాని కావాలని కోరుతూ గణబాబు అక్టోబర్ నెలలో జగన్ సమక్షలో వైసీపీకి మద్దతు ప్రకటిస్తారని అంటున్నారు. తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావు కూడా చేరితే ఇద్దరూ కలసి సైకిల్ దిగాలని స్కెచ్ వేస్తున్నారు. అయితే గంటా విషయంలో ఇప్పటికీ విజయసాయిరెడ్డి కోపంగానే ఉన్నారని టాక్. తనకూ జగన్ కి మధ్య చిచ్చు పెట్టేలా గంటా శ్రీనివాసరావు పొలిటికల్ ప్లాన్ వేశారన్నది సాయిరెడ్డి ఆగ్రహం. అందుకే ఆయన తెలివిగా గంటా వెనక ఉన్న వారిని ఒక్కొక్కరిగా వెంటబెట్టుకుని మరీ జగన్ చేత కండువాలు కప్పిస్తున్నారు. అలా గంటా శ్రీనివాసరావు బలం లాగేశారు. ఇపుడు గంటా వైసీపీలోకి వస్తే వీరంతా మళ్లీ ఆయన వెనక నిలబడతారు కాబట్టి ఆయన పార్టీలో స్ట్రాంగ్ అవుతారన్న ఉద్దేశ్యంతో సాయిరెడ్డి ఎప్పటికీ రానివ్వరు అంటున్నారు.

ఈయన వస్తారా ….?

ఇక గంటా శ్రీనివాసరావు కనుక వైసీపీలోకి వస్తే అది అతి పెద్ద న్యూస్ అవుతుంది. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు కాబట్టి అక్టోబర్ నెలలో గంటా వైసీపీలో చేరుతారు అన్న ప్రచారం ఒక్క లెక్కన సాగుతోంది. ఆ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని గంటా శ్రీనివాసరావు లెక్కలు వేసుకుంటున్నారని టాక్. అందుకే ఆయన ఈ నెలలో చేరకూడదు అని వెనక్కి తగ్గారని మరో రకమైన ప్రచారం వస్తోంది. మొత్తానికి విశాఖలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యేగా వెలగపూడి రామక్రిష్ణ బాబు మిగిలిపోతారా అన్న సందేహాలు వస్తున్నాయి. మరో వైపు ఆయన్ని కూడా రప్పించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది అంటున్నారు. ఆయనకు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇద్దరూ లిక్కర్ బిజినెస్ లో చక్రం తిప్పేవారు. దాంతో బొత్స కనుక జోక్యం చేసుకుంటే ఆయన వస్తారు అంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా సాగుతున్నాయట. అదే కనుక జరిగితే సున్నాకు సున్నాగా విశాఖలో టీడీపీ గ్రాఫ్ పడిపోవడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News