మాజీ మంత్రులూ జిలానీలేనా…టీడీపీ ఏంకాను ?

అధికారంలో ఉన్నపుడు ఒక్కలా పవర్ చలాయించారు. కనీసం నమ్ముకున్న క్యాడర్ కి న్యాయమైనా చేయకుండా ఎవరికి వారు ఇగోతో ఆధిపత్య పోరుతో అన్నీ అడ్డుకున్నారు. కార్యకర్తల నోట్లో [more]

Update: 2020-08-06 15:30 GMT

అధికారంలో ఉన్నపుడు ఒక్కలా పవర్ చలాయించారు. కనీసం నమ్ముకున్న క్యాడర్ కి న్యాయమైనా చేయకుండా ఎవరికి వారు ఇగోతో ఆధిపత్య పోరుతో అన్నీ అడ్డుకున్నారు. కార్యకర్తల నోట్లో మట్టి కొట్టారు. మొత్తానికి బ్రహ్మాండమైన మద్దతు కలిగిన విశాఖలో టీడీపీని ఏమీ కాకుండా చేశారు. అందులో సీనియర్ పెద్దాయన ఓడిపోతే ఆ తరువాతాయన అతి స్వల్ప ఓట్లతో ఒడ్డున పడ్డారు. ఆ ఇద్దరే అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, గంటా గెలిచి ఏడాది అయిపోయింది. విపక్ష ఎమ్మెల్యేగా ఉండడం ఉక్కబోతగా ఉందిట. బుగ్గకార్లకు అలవాటు పడిన ప్రాణం. దాంతో వైసీపీ వైపు ఆయన చూస్తున్నారు.

మందీ మార్బలంతో….

గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి మందీ మార్బలంలో వైసీపీలోకి జంప్ చేస్తున్నారని టాక్ ఒక్క లెక్కన పాకుతోంది. గంటా జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి ఆరు నెలల క్రితమే బాహాటంగా మద్దతు పలికారు. విశాఖకు రాజధాని అర్హత ఉందని కూడా వాదించారు. తాము చంద్రబాబుకు ఆనాడే చెప్పి చూశామని కూడా అధినేత మీద సెటైర్లు వేశారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు గంటా కోరుతున్నట్లుగా విశాఖ అభివ్రుధ్ధి కోసం రాజధాని వస్తోంది. దాంతో ఈ మాజీ మంత్రి గారు వైసీపీలోకి వెళ్ళేందుకు అతి పెద్ద సాకు దొరికినట్లేనని అంటున్నారు. విశాఖ అభివ్రుధ్ధి కోరుతూ అన్న ఒక్క మాట చాలు గంటా శ్రీనివాసరావు జంప్ చేయడానికి అందుకే ఆయన మంచి ముహూర్తం కూడా ముందే పెట్టుకున్నారని అంటున్నారు.

కమలానికి కన్ను …..

సరే గంటా శ్రీనివాసరావు వెళ్లడం మామూలే, ఆయన పార్టీలు మారతాడు అంటూ విమర్శలు చేసే అయ్యన్నపాత్రుడు కూడా పక్క చూపులు చూస్తున్నారా అన్న అనుమానాలు ఇపుడు కలుగుతున్నాయి. అయ్యన్న వైఖరిలో ఈ మార్పు రావడం అంటే టీడీపీ పని అయిపోయిందనుకోవాలేమో. టీడీపీ ఆవిర్భావం ఉన్న సీనియర్ మోస్ట్ నేత అయిన అయ్యన్న బీజేపీని, మోడీని మెచ్చుకుంటూ వీడియో విడుదల చేయడం చర్చగా ఉంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేయడం గొప్ప విషయమని అయ్యన్న కొనియాడుతున్నారు. భవ్యమైన రామందిరం నిర్మిస్తున్న బీజేపీకి అంతా సహకరించాలని కూడా ఆయన పిలుపు ఇస్తున్నారు.

మటాషేనా ..?

ఇద్దరు సీనియర్ నేతలు టీడీపీలో ఉంటూ పార్టీని నాశనం చేశారని చంద్రబాబు గ్రహించేలోపే విపక్షంలోకి వచ్చేశారు. ఇపుడు పార్టీ కష్టకాలంలో ఉంది. ఇప్పట్లో బయటపడే అవకాశం కూడా లేదు. పార్టీని బతికించాలన్నా మళ్లీ గత వైభవం తేవాలన్నా నిన్నటి దాకా అధికారం అనుభవించిన వారే ముందుండి చేయాలి. కానీ గంటా శ్రీనివాసరావు, అయ్యన్న తీరు అలా లేదని క్యాడర్ మండిపడుతోంది. పార్టీ పవర్ లో ఉన్నపుడు అన్ని ఫలాలూ పొందిన వారు ఇపుడు విపక్షంలోకి రాగానే సైడ్ అయ్యారని క్యాడర్ అంటోంది. అంతటితో ఆగకుండా గంటా శ్రీనివాసరావు వైసీపీ వైపు చూస్తూంటే అయ్యన్న బీజేపీ కీర్తనలు పాడుతున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. నిజానికి గంటా బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. ఇపుడు ఆయన వైసీపీలోకి వెళ్లాలనుకోవడంతో అయ్యన్న బీజేపీ అంటున్నారని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరూ జంప్ చేస్తే విశాఖలో టీడీపీ చాప చుట్టేసినట్లే.

Tags:    

Similar News