గేమ్ ఛేంజర్ ఎవరు…?

తమిళనాడులో వింత పరిస్థితి ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు కేవలం పార్లమెంటు [more]

Update: 2019-02-15 17:30 GMT

తమిళనాడులో వింత పరిస్థితి ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు కేవలం పార్లమెంటు ఎన్నికలను మాత్రమే కాకుండా ఉప ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తే రాష్ట్రంలో అధికార మార్పిడి కూడా ఉంటుందన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి. అందుకే అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలు పార్లమెంటు ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలపైనా ప్రధానంగా దృష్టిసారించాయి. అయితే రెండు పార్టీలకూ ఒంటరిగా వెళ్లే శక్తి, సామర్థ్యం లేకపోవడంతో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి.

21 శాసనసభ స్థానాలకు….

తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలతో పాటు 21 అసంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ 21 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను చేజిక్కిచుకుంటే రాష్ట్రంలో కూడా అధికారం చేపట్టవచ్చన్నది డీఎంకే వ్యూహంగా కన్పిస్తుంది. కరుణానిధి, ఎ.కె.బోస్ మరణాలతో ఏర్పడిన ఖాళీలతో పాటు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. శాసనసభ నియోజకవర్గాల్లో దాదాపు పదిశాతం స్థానాలు ఖాళీగా ఉండటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమమంటున్నారు. వీటికి లోక్ సభ ఎన్నికలతో పాటే ఎన్నిక నిర్వహించే అవకాశముంది.

బీజేపీతో పొత్తుతో….

దీంతో పార్లమెంటు ఎన్నికలను పక్కనపెడితే ఇప్పుడు అధికార అన్నాడీఎంకేకు ఉప ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఒకవైపు డీఎంకే దూసుకు పోతుండగా, మరోవైపు దినకరన్ పార్టీ సవాల్ విసురుతోంది. దీంతో అన్నాడీఎంకే ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకోని పరిస్థితి ఏర్పడింది. డీఎండీకే తో పొత్తు పెట్టుకోవాలని అన్నాడీఎంకే భావిస్తుంది. ఈ నెల 16న ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ కాంత్ అమెరికా నుంచి చెన్నైకి వస్తుండటంతో ఆయనతో నేరుగా చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే డీఎండీకే నేతలు బీజేపీతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీతో కలసి వెళ్లాలని అన్నాడీఎంకే దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. బీజీపీ, అన్నాడీఎంకే, డీఎండీకే,పీఎంకేలు కలసి కూటమి గా ఏర్పడే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అన్ని పార్టీలతో కలసి…..

ఇక డీఎంకే అధినేత స్టాలిన్ కూడా కూటమితో చర్చలను ముమ్మరం చేశారు. కూటమి పార్టీలతో చర్చల కోసం స్టాలిన్ మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ తో పాటు మరో పది పార్టీల వరకూ ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ కలసి పోటీ చేయాలన్నది డీఎంకే కూటమి లక్ష్యంగా కన్పిస్తోంది. సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహాలపై స్టాలిన్ ఎప్పటికప్పుడు సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు. అలాగే టీటీవీ దినకరన్ కూడా శశికళ సూచనల మేరకు నడచుకుంటామని, ఏ పార్టీతో పొత్తు ఉంటుందో చెప్పలేమన్నారు. అంతేకాదు ఉప ఎన్నికలు జరిగే అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. మొత్తం మీద తమిళనాడులో పార్లమెంటు ఎన్నికలతో పాటు 21 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని తెలియడంతో హీట్ పెరిగింది.

Tags:    

Similar News