పెద్దాయన ఆత్మ ఘోషిస్తుందట

నగరి నియోజకవర్గంలో ఫ్యామిలీ రివెంజ్ పొలిటికల్ హైడ్రామా నడుస్తుంది. తండ్రి వారసత్వాన్ని ఇద్దరూ అందిపుచ్చుకోలేక పోతున్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో పెద్దదిక్కుగా ఉన్న గాలి ముద్దు కృష్ణమ [more]

Update: 2019-12-21 03:30 GMT

నగరి నియోజకవర్గంలో ఫ్యామిలీ రివెంజ్ పొలిటికల్ హైడ్రామా నడుస్తుంది. తండ్రి వారసత్వాన్ని ఇద్దరూ అందిపుచ్చుకోలేక పోతున్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో పెద్దదిక్కుగా ఉన్న గాలి ముద్దు కృష్ణమ నాయుడు మరణంతో జిల్లాతో పాటు నగరి రాజకీయాల్లోనూ టీడీపీ దెబ్బతినిందనే చెప్పాలి. నగరి నియోజకవర్గాన్ని తీసుకుంటే 2019 ఎన్నికల తర్వాత గాలి ముద్దు కృష్ణమనాయుడి కుటుంబం రెండు ముక్కలయిందనే చెప్పాలి. ఇప్పుడు ఆ ఫ్యామిలో ఒకరిపై ఒకరు రాజకీయంగా కక్ష సాధించుకునేందుకు సిద్ధమయ్యారు.

గాలి జీవించి ఉన్నంత వరకూ….

నిజానికి గాలి ముద్దు కృష్ణమనాయుడు బతికున్నంత వరకూ ఆయనే నియోజకవర్గానికి పెద్దదిక్కు. ఓటమి పాలయినా కార్యకర్తల్లో ఆత్మస్థయిర్యం నింపుతూ ఆయన నిత్యం ప్రజల్లోనే ఉండేవారు. 2014 ఎన్నికల్లో గాలి ముద్దు కృష్ణమనాయుడు ఓటమి పాలయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచి గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనేంటో చూపించుకున్నారు. పుత్తూరు నియోజకవర్గం రద్దయ్యాక గాలి ముద్దు కృష‌్ణమనాయుడు నగరికి షిఫ్ట్ అయ్యారు. 2018లో గాలి ముద్దు కృష్ణమనాయుడు ఎమ్మెల్సీ గా ఉంటూ మృతి చెందారు.

వారసత్వ పోరుతో…..

ఇక అప్పటి నుంచి గాలి కుటుంబంలో రాజకీయ వారసత్వ పోరు మొదలయిన సంగతి తెలిసిందే. మద్యే మార్గంగా గాలి ముద్దుకృష్ణమనాయుడు సతీమణి సరస్వతమ్మకు ఎమ్మెల్సీ పదవి చంద్రబాబు ఇచ్చారు. ఇంతటితో రచ్చ ఆగుతుందనుకున్నారు. కానీ సరస్వతమ్మ తన చిన్న కుమారుడు జగదీష్ కు నగరి టీడీపీ టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ చంద్రబాబు ప్రజల్లో గుర్తింపు ఉన్న గాలి ముద్దు కృష్ణమ నాయుడు పెద్ద కుమారుడు గాలి భాను ప్రకాష్ కు ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో తల్లి సరస్వతమ్మ, సోదరుడు జగదీష్ లు భాను ప్రకాష్ విజయం కోసం కృషి చేయలేదు. ప్రచారానికి కూడా పెద్దగా రాలేదు.

ప్రతీకారంతో…..

ీదీంతో గాలి భానుప్రకాష్ తల్లి, సోదరులకు దూరంగా ఉంటున్నారు. సరస్వతమ్మ కూడా తన చిన్న కుమారుడు జగదీష్ కు టిక్కెట్ ఇవ్వకపోవడంపై నొచ్చుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నా సరస్వతమ్మ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చినా ఎమ్మెల్సీగా ఉన్న సరస్వతమ్మ సమీక్షలకు హాజరు కాలేదు. దీంతో గాలి కుటుంబం రెండుగా చీలిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ ఛార్జిని ఎవరిని నియమించాలన్న దానిపై చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. పాపం… పెద్దాయన ఆత్మ నగరిలో పార్టీ పరిస్థితిని చూసి ఘోషిస్తుందని టీడీపీ వర్గాలే బుగ్గలు నొక్కుకుంటున్నాయి.

Tags:    

Similar News