పోలవరం భవిష్యత్ ప్రశ్నార్థకమేనా?

వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత పోలవరం భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ప్రధాన డ్యాం నిర్మాణం అంతంత మాత్రంగానే సాగినా., కుడి., ఎడమ కాల్వల లైనింగ్‌లతో సహా [more]

Update: 2020-11-02 06:30 GMT

వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత పోలవరం భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ప్రధాన డ్యాం నిర్మాణం అంతంత మాత్రంగానే సాగినా., కుడి., ఎడమ కాల్వల లైనింగ్‌లతో సహా 2009 ఎన్నికల నాటికే పూర్తయ్యాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భూ సేకరణ పూర్తికాక కాల్వల నిర్మాణం ఆగిపోయింది. 2010 నాటికి పోలవరం ప్రాజెక్టు అంచనాలకు మించడం., రాజకీయ వాతావరణం వేడెక్కడం., ఓ వైపు 2009 డిసెంబర్‌ 9 ప్రకటన మరోవైపు అధికార పీఠంపై అనిశ్చితి ఇలా గందరగోళంగా ఉండేది. కాంగ్రెస్ నాయకులు సీఎం కుర్చీ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారుండేవారు. అవకాశం వస్తే సీఎం కుర్చీ ఎక్కేద్దామనే ఆశతో ఢిల్లీ చుట్టూ వారి చక్కర్లు సాగేవి.

అప్పటి మంత్రి పొన్నాల….

2010 శీతకాలంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సాయంత్రం చీకటి పడ్డాక నార్త్ బ్లాక్‌కు వచ్చారు. ఆయన ఏదో పనిమీద అక్కడికి వచ్చారు. బయటకు వచ్చాక మీడియా కనిపించేసరికి ఏదొకటి చెప్పి తప్పించుకోవాలనుకున్నారు. పోలవరం పనిమీద వచ్చానని టాపిక్‌ డైవర్ట్ చేసే మాటల్లో చెప్పారు. పోలవరాన్ని కేసీఆర్‌ ఒప్పుకోవడం లేదు కదా.,పైగా మీ దగ్గర డబ్బులేవు ఏం చేస్తారు అంటే ఆ పనిమీదే వచ్చా అన్నారు. 11వ ఫైనాన్స్‌ కమిషన్‌‌లో డబ్బులిస్తాం అన్నారుగా అంటే దాని టైం అయిపోయింది., 12th ఫైనాన్స్‌ కమిషన్‌లో డబ్బులొస్తాయన్నారు. మొత్తం ఇస్తారా అంటే., మొత్తం ఇస్తామన్నారు. ఖచ్చితమైన హామీ వచ్చింది. వైఎస్ ఉండగా మొదలుపెడితే ఇప్పటికి పూర్తైంది అని., దాదాపు 16వేల కోట్లకు అమోదం వచ్చిందని., ఎవరు వార్త రాయొద్దు., గోల అయిపోతుంది…., మళ్లీ డబ్బులు ఆగిపోతాయని కారెక్కి వెళ్లిపోయారు.

కిరణ్ హయాంలోనూ…..

ఆ తర్వాత నాలుగేళ్లు రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారినా., తెలంగాణ ఆందోళనతో గడిచిపోయింది. పోలవరం నిధుల సంగతి మరుగున పడిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కి కాంట్రాక్టు ఇవ్వడం మినహా పనులు ముందుకు సాగలేదు. 2014లో రాష్ట్ర విభజన., ఆ తర్వాత రెండేళ్లకు 16వేల కోట్ల ప్రాజెక్టు కాస్త 56వేల కోట్లైంది. 2013భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం., పునరావాసం కల్పించాల్సి రావడంతో వ్యయం పెరిగిందన్నారు. దీనిని ప్రశ్నించిన వాళ్ళు లేరు.

అంచనాలు ఎందుకు పెరిగాయో?

2019 ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టు స్థలంలో బీజేపీ ఓ మీటింగ్‌ నిర్వహించింది. జోరువానను లెక్క చేయకుండా…, స్థానిక ప్రజలు ఈ సమావేశానికి వచ్చారు. బీజేపీ నేతలు పరిహారం విషయంలో తూర్పు., పశ్చిమ గోదావరి జిల్లాల రెవిన్యూ అధికారుల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇల్లు, వాకిలి, గొడ్డు, గోదాం లెక్కింపుల్లో మాయాజాలం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. కానీ అవి ఎక్కడా పత్రికల్లో రాలేదు. 2010లో 16వేల కోట్ల రుపాయల ప్రాజెక్టు ఆ తర్వాత ఐదారేళ్ళలో ఎందుకు భారీగా పెరిగిందనేది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. 2018 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి అవుతుందని ప్రతి సోమవారం ప్రకటన మాత్రం వచ్చేది.

-శరత్ చంద్ర, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News