నమ్మకం లేకనే కదా…?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అసలే కుదేలై పోయి ఉన్న కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో [more]

Update: 2019-08-01 17:30 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అసలే కుదేలై పోయి ఉన్న కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ మరితం బలపడే దిశగా అడుగులు వేస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు మాత్రం నాయకత్వంపై నమ్మకం లేక నేతలను కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాషాయం కండువా కప్పుకోవడం గమనార్హం.

ఎన్నికల సమయంలో…..

ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, శివసేన సీట్ల ఒప్పందంలో ఒక అవగాహనకు వచ్చాయి. లోక్ సభ ఎన్నికల సమయంలోనే బీజేపీ, శివసేనల మధ్య ఒప్పందం కుదిరింది. చెరి 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని రెండు పార్టీలూ ఒక అవగాహనకు వచ్చాయి. ఇప్పటి నుంచే రెండు పార్టీలూ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే పాదయాత్ర ప్రారంభించారు.

పక్కా ప్రణాళికతో….

మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గేందుకు పక్కా ప్రణాళికలో ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. మహారాష్ట్రలో మరోసారి జెండా ఎగురవేసేందుకు మోదీ, అమిత్ షాలు ఇలా వ్యూహాలు మీద వ్యూహాలు పన్నుతూ, మిత్రపక్షం శివసేనతో కలసి నడుస్తుంటే కాంగ్రెస్ పార్టీ అందుకు విరుద్థంగా వెళుతోందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

నాయకత్వం పైన…..

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ నలుగురు ఎమ్మెల్యేలు జంప్ చేయడం నాయకత్వంపై నమ్మకంలేకనేనని అంటున్నారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, శరద్ పవార్ వృద్ధాప్యంలో పడటం, ఆయనకు సరైన వారసత్వం లేకపోవడంతోనే ఆ పార్టీ నేతలు అధికార బీజేపీ వైపు చూస్తున్నారన్నది వాస్తవం. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు కూడా మరో కారణంగా చెప్పొచ్చు. ఎమ్మెల్యేలను బుజ్జగించే చర్యలు కూడా కాంగ్రెస్, ఎన్సీలు చేపట్టలేకపోయాయంటే ఎంత దైన్య స్థితిలో ఉన్నాయో అర్థమవుతుంది.

Tags:    

Similar News