యడ్డీపై గేమ్ మొదలయిందా?

కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేం. ఇక్కడ చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఎవరికైనా యడ్యూరప్ప సర్కార్ మనుగడపై సందేహం ఏర్పడక మానదు. [more]

Update: 2020-06-09 16:30 GMT

కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేం. ఇక్కడ చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఎవరికైనా యడ్యూరప్ప సర్కార్ మనుగడపై సందేహం ఏర్పడక మానదు. యడ్యూరప్ప సర్కార్ పై సొంత పార్టీలో అసంతృప్తి తలెత్తిందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇది ప్రచారం మాత్రమే కాదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే యడ్యూరప్ప నాయకత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.

పడగొట్టి… తొడగొట్టి…..

కర్ణాటకలో పథ్నాలుగు నెలల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కార్ ను కూలదోసి యడ్యూరప్ప అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో విజయం సాధించి యడ్యూరప్ప తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే మంత్రి పదవులు ఇవ్వడంతో సహజంగా సొంత పార్టీలో అసంతృప్తి తలెత్తుంది. కానీ యడ్యూరప్ప దానిని పార్టీ నాయకత్వానికే వదిలేసి తాను మాత్రం లైట్ తీసుకున్నారు.

సొంత పార్టీలోనే….

పాలనలో యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర జోక్యం కూడా పార్టీలో అసంతృప్తికి కారణమయిందంటున్నారు. ఈ నేపథ్యంలోనే సొంత పార్టీలో యడ్యూరప్ప కు వ్యతిరేకంగా కూటమి కట్టారంటూ వార్తలు వస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత బసన్న గౌడ్ పాటిల్ నాయకత్వంలో అసంతృప్త నేతలను ఏకం చేస్తున్నారు. యడ్యూరప్ప వ్యతిరేక వర్గమంతా ఒకచోట చేరి నిత్యం సంప్రదింపులు జరుపుతుుండటం పలు అనుమానాలకు తావిస్తుంది.

ముఖ్యమంత్రిని మార్చాలని….

దీంతో పాటు సిద్ధరామయ్య ప్రకటన కూడా ఇందుకు ఊతమిస్తుంది. బీజేపీ నేతలను తమను సంప్రదించారని, యడ్యూరప్ప ప్రభుత్వం కుప్ప కూలడం ఖాయమని సిద్ధరామయ్య ఇటీవల తెలిపారు. అయితే జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే యడ్యూరప్ప ను పదవి నుంచి తొలగించి కొత్తవారికి ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని ఆయన వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తున్నట్లు కనపడుతోంది. అయితే దీనికి పార్టీ అధినాయకత్వం అంగీకరిస్తుందా? లేదా? అసంతృప్తులను చల్లారుస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News