చాదస్తం బాగా పెరిగిపోయినట్లుంది

ఫరూక్ అబ్దుల్లా… భారత రాజకీయాల్లో సుపరిచిత నేత. ఒక గొప్ప కుటుంబ వారసుడిగా, గతంలో ఒక రాష్ర్ట ముఖ్యమంత్రిగా, సుదీర్ఘ కాలం ఒక చిన్నపార్టీ అధినేతగా చక్రం [more]

Update: 2020-11-13 16:30 GMT

ఫరూక్ అబ్దుల్లా… భారత రాజకీయాల్లో సుపరిచిత నేత. ఒక గొప్ప కుటుంబ వారసుడిగా, గతంలో ఒక రాష్ర్ట ముఖ్యమంత్రిగా, సుదీర్ఘ కాలం ఒక చిన్నపార్టీ అధినేతగా చక్రం తిప్పుతున్న ఆయన రాజకీయాల్లో రాటుదేలిన నేత. మరో కోణంలో చూస్తే ఫరూక్ అంతర్జాతీయ నేతగా కూడా చెప్పుకోవచ్చు. సరిహద్దు రాష్ర్టమైన జమ్ము-కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఆయన అంతర్జాతీయ సమాజానికి కూడా సుపరిచితుడే. ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా ప్రస్తుతం తన తండ్రి స్థాపించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేతగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కశ్మీర్ రాజధాని నగరం శ్రీనగర్ పార్లమెంట్ సభ్యుడిగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా మిగిలిపోతున్నారు.

ఇవేం వ్యాఖ్యలు….

ఎనిమిది పదుల వయసులో ముదిమి మీద పడిన ఫరూక్ అబ్దుల్లా చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొల్పుతున్నాయి. ఆయన ఆలోచనతో, సీనియర్ నాయకుడిలా మాట్లాడుతున్నరా లేక అనాలోచితంగా సగటు రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా 370వ అధికరణం గురించి ఫరూక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చైనా సాయంతో అధికరణం 370ని పునరుద్ధరిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఓ టెలివిజన్ ఛానల్ తో మాట్లాడుతూ ఈ మాజీ ముఖ్యమంత్రి అనాలోచిత వ్యాఖ్యలు చేశారు. రాష్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే 370వ అధికరణను గత ఏడాది ఆగస్టులో కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వెనువెంటనే కేంద్రం ఫరూక్ ను గృహ నిర్బంధానికి తరలించింది. పరిస్థితులు సద్దుమణిగిన అనంతరం ఇటీవలనే విడుదల చేసింది.

నిర్భంధంలో నుంచి….

ఫరూక్ అబ్దుల్లా ప్రత్యర్థి పార్టీ అయిన పీడీపీ (పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ సైతం నిర్బంధం నుంచి కొద్ది రోజుల క్రితమే విడుదలయ్యారు. ఇప్పుడు ఇద్దరు నేతలూ కలసి 370 అధికరణ పునరుద్ధరణకు పోరాడతామని ప్రకటించారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, రాజకీయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో అభ్యంతర పెట్టాల్సింది ఏమీ లేదు. కశ్మీరీ నేతలుగా వారి డిమాండులో కూడా తప్పేమీ లేదు. వారి రాజకీయ మనుగడ కోసం ఇలాంటి పోరాటం చేయడం అనివార్యం. అయితే ప్రత్యర్థి అయిన చైనా సాయంతో 370వ అధికరణ పునరుద్ధరణకు పోరాడతామని సీనియర్ నాయకుడైన ఫరూక్ అబ్దుల్లా ప్రకటించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం, నిరసన వ్యక్తమవుతోంది. చైనాతో లద్దాఖ్ సరిహద్దుల్లో గత ఆరు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సగటు భారతీయుడు ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై మండిపడుతున్నాడు. శత్రుదేశమైన చైనా గతఅరవయ్యేళ్లుగా భారత్ కు కల్పిస్తున్న చికాకులు అన్నీ ఇన్నీ కావు. ఈ విషయాలన్నీ సీనియర్ నాయకుడైన ఫరూక్ అబ్దుల్లాకు తెలియనివి కావు. చైనాలో ఇలాంటి ప్రకటనలు చేస్తే ఎలాంటి తీవ్ర చర్యలు ఉంటాయో కూడా ఆయనకు తెలుసు.

చైనాలో ముస్లింలు…..

కమ్యునిస్టు దేశమైన డ్రాగన్ తమ దేశంలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ లో ‘వీగర్’ ముస్లిములను ఎలా వేధిస్తుందో, ఎలా అణచివేస్తుందో అంతర్జాతీయ సమాజానికి ఎరుకే. సాటి ‘వీగర్’ ముస్లిముల సమస్యలు, ఇబ్బందులపై మాట్లాడటానికి గొంతు పెగలని ఫరూక్ అబ్దుల్లా చైనా సాయంతో 370వ అధికరణను పునరుద్ధరిస్తామని ప్రకటించడం జాతి ద్రోహమే అవుతుంది. కశ్మీర్ మహారాజా కుటుంబ వారసుడైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ కరణ్ సింగ్, కశ్మీరీ పండిట్లు ఫరూక్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడంతో ఆయన మాట మార్చారు. తన ఉద్దేశం అది కాదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ఫరూక్ అబ్దుల్లా వివరణ ప్రజాగ్రహాన్ని చల్లబరచ లేదు. భారత్ లో ఉంటూ భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఏ భారతీయుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరన్నది ఫరూక్ అబ్దుల్లా కు ఎప్పడు అర్థమవుతుంది? తాను ముందు భారతీయుడినని తరవాతే కశ్మీరీనన్న వాస్తవాన్ని గ్రహించాలి. జాతి వ్యతిరేక వ్యాఖ్యల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని గ్రహించాలి. ఇప్పటికైనా వివరణతో సరిపుచ్చే బదులు తన వ్యాఖ్యలను కశ్మీరీ నేత వెనక్కు తీసుకుంటే మంచిది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News