అమరావతి.. పచ్చి అబద్దాలూ……?

నిజం చెబితే తల వేయి ముక్కలు అవుతుందని రాజకీయ నాయకులకు శాపమేమో. అందుకే ప్రతీ విషయాన్ని మభ్యపెడుతూ జనాలను చీకట్లో ఉంచడం రాజకీయ జీవులకు అలవాటు అయిపోయింది. [more]

Update: 2020-07-29 05:00 GMT

నిజం చెబితే తల వేయి ముక్కలు అవుతుందని రాజకీయ నాయకులకు శాపమేమో. అందుకే ప్రతీ విషయాన్ని మభ్యపెడుతూ జనాలను చీకట్లో ఉంచడం రాజకీయ జీవులకు అలవాటు అయిపోయింది. తాము ఆత్మవంచన చేసుకుంటూ వారిని కూడా వంచిస్తూ పబ్బం గడుపుకోవడం విధానం అయింది. నాడు ఉమ్మడి ఏపీ విభజనలో ఏం చేశారో ఇపుడు అమరావతి రాజధాని విషయంలో అవే చేస్తున్నారు. అవే అబద్దాలు ఆడుతూ అమాయక జనాన్ని వంచిస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లేకపోతే అమరావతి రాజధాని ఎక్కడికీ కదలదు, అక్కడే ఉంటుందని చెప్పడం కంటే అబద్దం ఉంటుందా అని రాజకీయం, రాజ్యాంగం అన్నీ తెలిసిన వారు అంటున్న మాట.

నాడు అలా …

రాజధాని కేంద్ర పరిధిలోని అంశమని సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పచ్చి అబద్దమే చెబుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కేంద్ర పరిధిలో రాజధాని ఉంటే అమరావతిని ఎవరు ఎంపిక చేశారో ఆయన చెప్పగలరా అని కూడా మేధావులు అడుగుతున్నారు. అమరావతి ఎంపిక పూర్తిగా చంద్రబాబు ఇష్టంతోనే జరిగింది. సీఆర్డీయే చట్టం ద్వారా రాజధాని కోసం 33 వేల ఎకరాలు తీసుకున్నారు. ఎక్కడ ఏమి కట్టాలో నవ నగరాల పేరిట డిజైన్లు రూపకల్పన దగ్గర నుంచి విదేశాల నుంచి అప్పులు తేవడం వరకూ అంతా కూడా నాడు చంద్రబాబు సర్కార్ చేసింది. ఆయన పక్కనే ఉంటూ అన్నింటా భాగం అయిన యనమల అపుడు ఒక్క విషయంలో కూడా కేంద్రం పాత్ర ఉందని చెప్పగలరా అంటున్నారు మేధావులు.

జగన్ కీ ఉందిగా…..

నాడు చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఏ హక్కుతో చేశారో అదే హక్కు ఇపుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కి కూడా ఉందిగా. ఈ చిన్న లాజిక్ ని తాను మరచి జనాలు కూడా మరవాలని యనమల వంటి వారు కోరుకోవడమే ఇక్కడ విడ్డూరం. పక్కన ఉన్న కర్నాటక రెండవ రాజధాని పేరిట జీవోలు ఇచ్చేస్తోంది. అదే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ కూడా రెండవ రాజధాని చేస్తూ అధికారిక ఉత్తర్వులు ఇచ్చేసింది. మరి ఎక్కడైనా రాజధాని అంశం రాష్ట్రాలదే అయినపుడు కేంద్ర జోక్యం, పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందాలి అంటూ డ్రామాలు ఆడడం ద్వారా టీడీపీ నేతలు జనాలను మోసం చేస్తున్నారని అంటున్నారు. అమరావతి అన్నది చంద్రబాబు కల, జగన్ కి మూడు రాజధానులు కావాలి. అంతే. ఇందులో కేంద్రానికి ఏ సంబంధమూ లేదన్నది అన్నీ తెలిసిన నిపుణులు అంటున్న మాట.

అయి తీరుతుంది …

ఇక రాష్ట్ర విభజన టైంలో కూడా లాస్ట్ పంచ్, చివరి బంతి అంటూ ఇదే రాజకీయ పార్టీలు, నాయకులూ ఎన్నో కబుర్లు చెప్పినా కూడా చివరికి బిల్లు పార్లమెంట్ లో పాస్ అయింది. రెండుగా ఏపీ విడిపోయింది. ఇపుడు రాజధాని విషయంలో కూడా రాజ్యాంగపరమైన అడ్డంకులు ఏవీ ఉండవని నిపుణులు అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుతో వచ్చిన ప్రభుత్వం తీసుకునే సాధారణ నిర్ణయాల మాదిరిగానే ఉంటుందని అంటున్నారు. రాజకీయ కారణల వల్ల ఏమైనా రాజధాని ఆగలేమో కానీ రాజ్యాంగపరంగా అడ్డంకులు అయితే లేనే లేవు అంటున్నారు. రాజకీయ కారణాలతో మాత్రమే బీజేపీ ఒక్కటే ఏ దశలోనైనా రాజధాని ఆపగలదని, కానీ ఏపీ రాజధాని భారాన్ని, బాధ్యతను తలకెత్తుకోవడం మొదటి నుంచి మోడీ సర్కార్ కి ఇష్టం లేదని అంటున్నారు. దాంతో సాఫీగానే మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందుతుందని కూడా చెబుతున్నారు. అయితే అన్నీ తెలిసినా కూడా విపక్ష తెలుగుదేశం లాంటి పార్టీలు అమరావతిలోని అమాయక రైతులను రెచ్చగొట్టడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News