బెస్ట్ ప్లేస్ అదేనట

విశాఖ రాజధాని ఎక్కడ అన్నది అందరికీ పెద్ద ప్రశ్నగా ఉంది. ఇప్పటికైతే విశాఖ సిటీకి సమీపంలోని రుషికొండ వద్ద ఉన్న ఐటీ టవర్లలో సచివాలయం పెడుతున్నారు. అయితే [more]

Update: 2020-02-14 08:00 GMT

విశాఖ రాజధాని ఎక్కడ అన్నది అందరికీ పెద్ద ప్రశ్నగా ఉంది. ఇప్పటికైతే విశాఖ సిటీకి సమీపంలోని రుషికొండ వద్ద ఉన్న ఐటీ టవర్లలో సచివాలయం పెడుతున్నారు. అయితే శాశ్వతమైన భవనాలు మాత్రం కట్టేందుకు విశాలమైన స్థలాన్ని ఎంపిక చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అది విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు మధ్యలో ఉండేలా చూస్తున్నారు. అది భీమిలీ నియోకవర్గంలోని పద్మనాభం అవుతుందని అంటున్నారు. మరి ఇంతకీ ఈ పద్మనాభం విశిష్టత ఏంటి అన్నది కూడా ఇపుడు ఆసక్తిగా ఉంది. విశాఖ జిల్లాలో పద్మనాభం చాలా ప్రసిద్ధి చెందినది. చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పేరు ఈ ప్రాంతానికి ఉంది. తొలి స్వతంత్ర పొరాటంగా పద్మనాభ యుధ్ధాన్ని చెబుతారు ఇది 1794లో జరిగింది. విజయనగరం రాజు చిన విజయరామరాజు ఈ యుధ్ధంలో స్వాతంత్రం కోసం పోరాడి అసువులు బాసారు.

ఆధ్యాత్మిక భావనతో…

ఇక పద్మనాభంలో జరిగిన ఈ యుద్ధం ఈ ప్రాంతానికి ఎంతో విశిష్టతను చరిత్రలో మిగిల్చింది. అదే విధంగా కేరళలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయం మళ్ళీ ఇక్కడే కనిపిస్తుంది. ఈ ఆలయం కూడా ఎంతో చరిత్ర కలిగినది. పాండవులు కూడా ఇక్కడకి వచ్చారని పురాణాలు చెబుతాయి. ఇవన్నీ ఇలా ఉంటే పద్మనాభం స్వాతంత్రం వచ్చాక కూడా ఎంతో పేరు రాజకీయంగా సంపాదించుకుంది. ఇక్కడకు చెందిన రాజులు గతంలో మంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్ హయాంలో పద్మనాభరాజు మంత్రిగా చేస్తే తెలుగుదేశం హయాంలో ఆర్ఎస్ డీపీ నరసింహరాజు మంత్రి పదవిని చేపట్టారు. అన్ని విధాలుగా పేరు గడించిన పద్మనాభం ఇపుడు ఏపీలోనే అత్యంత కీలకంగా మారబోతోందా అన్న చర్చ సాగుతోంది. విశాఖలో పరిపాలనారాజధాని వస్తే శాశ్వత భవనాలు పద్మనాభంలోనే నిర్మిస్తారని అంటున్నారు

మంత్రి కామెంట్స్ వెనక….

ప్రస్తుతానికి రుషికొండలోని ఐటీ టవర్లలో సచివాలయం ఏర్పాటు చేసి పాలన మొదలుపెట్టినా సమీప భవిష్యత్తులో పూర్తి స్థాయి భవనాలు నిర్మించడానికి అనువుగా పద్మనాభాన్ని గుర్తించారని అంటున్నారు. దీనికి జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ కూడా ఇపుడు అంతా ప్రస్తావిస్తున్నారు. రాజధాని విశాఖ రాబోతోంది. అందువల్ల భూములు ఎవరూ అమ్ముకోకండి, మీకు మంచి రోజులు వస్తాయని పద్మనాభం రైతులకు మంత్రి అవంతి శ్రీనివాసరావు చేసిన హితబోధ కూడా చర్చకు వస్తోంది. అంటే భవిష్యత్తుల్లో ఇక్కడ ఉన్న విలువైన ప్రభుత్వ భూముల్లో రాజధాని ఏర్పాటు అయితే సమీపంలో ఉన్న రైతుల భూములు కూడా బంగారం అవుతాయని అంటున్నారు.

జీఎన్ రావు నివేదిక ప్రకారం…..

ఇక జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ తీసుకున్నా కూడా సముద్రానికి దూరంగా సచివాలయం నిర్మించుకోమని సూచించింది. ఆ విధంగా ఆలోచించుకుంటే పద్మనాభం బెస్ట్ ప్లేస్ గా కూడా చెబుతున్నారు. ఆ విధంగా అటు విశాఖ, ఇటు విజయనగరానికి, శ్రీకాకుళానికి దగ్గరగా కూడా పద్మనాభంలో రాజధాని ఉంటుందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా పద్మనాభం రాజధాని ప్రాంతం అయితే మళ్ళీ గత శతాబ్దాల నాటి కాంతులు సంతరించుకోవడం ఖాయమని అంతా అంటున్నారు. చూడాలి మరి ఈ విశిష్ట ప్రదేశం మరెంతగా ప్రకాశిస్తుందో

Tags:    

Similar News