వైసీపీపై మోజు ప‌డుతున్నారా?

ఆయ‌న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌కు వీర విధేయుడు.. అలాంటి ఆయ‌న తాజాగా ఒక్కసారిగా అంద‌రినీ షాక్‌లో ముంచెత్తారు. రాష్ట్ర అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా ఆయ‌న [more]

Update: 2020-01-26 14:30 GMT

ఆయ‌న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌కు వీర విధేయుడు.. అలాంటి ఆయ‌న తాజాగా ఒక్కసారిగా అంద‌రినీ షాక్‌లో ముంచెత్తారు. రాష్ట్ర అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి కేంద్రంలో మంత్రిగా ఉన్నా లేకున్నా.. కాంగ్రెస్‌కు అనుకూల వ్యక్తిగా ప‌ల్లంరాజు పేరు తెచ్చుకున్నారు. అయితే, రాష్ట్రంలో 2014లో కాంగ్రెస్ దెబ్బతిన‌డంతో అప్పట్లోనే ఆయ‌న‌ను వైసీపీ నాయ‌కులు పార్టీలోకి ఆహ్వానించినట్టు వార్తలు వ‌చ్చాయి. అయితే జ‌గన్‌పై విమ‌ర్శలు చేసిన ప‌ల్లంరాజు కాంగ్రెస్ ఉన్నంత వ‌ర‌కు తాను ఆ పార్టీలోనే ఉంటాన‌ని చెప్పారు. ఇక‌, అప్పటి నుంచి రాష్ట్ర రాజ‌కీయాల‌పై పెద్దగా ఫోక‌స్ చేయ‌డం లేదు.

రెండుసార్లు ఎంపీగా….

కాకినాడ నుంచి రెండు సార్లు ఎంపీగా విజ‌యం సాధించిన ముళ్లపూడి మంగ‌ప‌తి ప‌ల్లంరాజు కేంద్ర మంత్రిగా వ్యవ‌హ‌రించారు. అయితే, కాంగ్రెస్ రాష్ట్రంలో తుడిచి పెట్టుకుపోయిన త‌ర్వాత కూడా ఇత‌ర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఇంచార్జ్‌గా ఆయ‌న కొన‌సాగారు. అయితే, తాజాగా మాత్రం ఆయ‌న చేసిన వ్యాఖ్యల‌ను బ‌ట్టి రాజ‌కీయంగా ఆయ‌న త్వర‌లోనూ యూట‌ర్న్ తీసుకునేందుకు రెడీ అయ్యార‌నే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది.

మంచిదేనంటూ…..

తాజాగా తిరుమ‌ల‌లో శ్రీవారిని ద‌ర్శించుకున్న ప‌ల్లంరాజు వైసీపీకి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పుడు జ‌రుగుతున్న అత్యంత హాట్ టాపిక్ రాజ‌ధానిపై స్పందిస్తూ గ‌త సీఎం చంద్రబాబుపై విమ‌ర్శలు కుమ్మరించారు. రాష్ట్రం ఆర్థికంగా లోటులో ఉన్న విష‌యం తెలిసి కూడా చంద్రబాబు ఎలా అంత పెద్ద ప్రాజెక్టును భుజాల‌కు ఎత్తుకున్నార‌ని ప్రశ్నించారు. అయితే, ప్రస్తుతం జ‌గ‌న్ తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణయం త‌న‌కు వ్యక్తిగ‌తంగా మంచిదేన‌ని అభిప్రాయ ప‌డ్డారు. విశాఖ‌కు రాజ‌ధాని అయ్యే అర్హత‌లు అన్నీ ఉన్నాయ‌ని చెప్పారు.

తొలిసారి జగన్ ను…..

ఈ విష‌యంలో త‌న‌కు ఎలాంటి అభిప్రాయ భేదం లేద‌న్నారు. ఇక శాస‌న మండ‌లి ర‌ద్దుపైనా ప‌ల్లంరాజు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. మండ‌లి ర‌ద్దు విష‌యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏదైనా ఆమోద‌యోగ్యంగానే ఉంటుంద‌న్నారు. సో.. మొత్తంగా చూస్తే ప‌ల్లం రాజు నోటి నుంచి తొలిసారి వైసీపీ అనుకూల వ్యాఖ్యలు రావ‌డంతో ఆయ‌న ఇక‌, జ‌గ‌న్ చెంత‌కు చేరుకునేందుకు కార్పెట్ వేసుకుంటున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మ‌రోప‌క్క, వైసీపీ కూడా ఇలాంటి నాయ‌కుల అవ‌స‌రం కోసం ఎదురు చూస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News