ఎమోషన్ .. ఎగదోసేందుకేనా..?

ఆంధ్రప్రదేశ్ లో మీడియా ముఖచిత్రం అందరికీ తెలిసిందే. అధికారపక్షానికి మద్దతునిచ్చే ప్రసార, ప్రచురణ మాధ్యమాలు ఒకవైపు. ప్రతిపక్షానికి మద్దతుగా నిలిచే మరికొన్ని ప్రసార, ప్రచురణ మాధ్యమాలు మరొక [more]

Update: 2021-03-30 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో మీడియా ముఖచిత్రం అందరికీ తెలిసిందే. అధికారపక్షానికి మద్దతునిచ్చే ప్రసార, ప్రచురణ మాధ్యమాలు ఒకవైపు. ప్రతిపక్షానికి మద్దతుగా నిలిచే మరికొన్ని ప్రసార, ప్రచురణ మాధ్యమాలు మరొక వైపు. స్పష్టమైన వి‘భజన’ రేఖతో నడుస్తున్నాయి. ఏ మీడియా వార్తలు ఏవిధంగా వస్తాయన్న సంగతి చదివే పాఠకులు, చూసే ప్రేక్షకులందరికీ తెలుసు. కనీసం వాటి మొఖం చూడని ఓటర్లు, ప్రజలకు కూడా పేరు చెప్పగానే ఫలానా పార్టీకి సపోర్టు అని చటుక్కున చెప్పేస్తారు. ఇక్కడ అస్పష్టతకు, సందేహానికి, అనుమానానికి తావు లేదు. ఇది ఒక రకంగా మంచిదే. ప్రజలు అనవసర భ్రమలు పెట్టుకోరు. నిజానిజాలతో నిమిత్తం లేకుండా ఈ పేపర్లో వార్త ఇలాగే వస్తుందని పాఠకులకు స్పష్టత వచ్చేసింది. అందువల్ల పాఠకులు మోసపోయే అవకాశం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పాత్రికేయ ప్రమాణాలు పడిపోతున్నాయా? అనేది వేరే చర్చ. తాజాగా తెలుగుదేశం పార్టీ నలభయ్యవ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంది. పార్టీ సాధించిన విజయాలు, భవిష్యత్ వంటి వాటి కంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే ముఖ్యమైనట్లు నేతలు ప్రసంగించారు. ఇప్పుడు ఏపీలో ఆ పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా సహజంగానే పాలిటిక్స్ డామినేట్ చేసేశాయి. టీడీపీకి మద్దతుగా భావించే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చంద్రబాబు నాయుడి ప్రసంగాన్ని కవరేజి చేసిన విధానం మాత్రం వైవిద్ధ్యాన్ని చాటి చెప్పింది. ప్రతి అక్షరంలోనూ అంతరార్థం ఉంటుంది. ప్రతిపదంలోనూ భావం, ఉద్దేశం దాగి ఉంటాయి. రాజకీయ వార్తల్లో తనదైన దూకుడు కనబరిచే ఆంధ్రజ్యోతి విషయం చెప్పడం కంటే భావోద్వేగం కలిగించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. మరోవైపు అంకెల ఆధారంగా అసలు విషయం చెప్పి చేతులు దులిపేసుకోవడానికి ఈనాడు పరిమితమైంది.

సెంటిమెంటు సెగ…

రాజకీయాల్లో మనిషి భావోద్వేగం చాలా బలంగా పని చేస్తుంది. పార్టీల జాతకాలను సెంటిమెంట్లు నిర్ణయిస్తుంటాయి. నేతల అదృష్టాన్ని తారుమారు చేస్తుంటాయి. తెలుగు జాతి ఆత్మాభిమానం అంటూ ఎన్టీయార్ టైమ్ లో టీడీపీ పవర్ లోకి వచ్చింది. స్వరాష్ట్రం సొంత పాలన అంటూ టీఆర్ ఎస్ గద్దెనెక్కింది. అదంతా సెంటిమెంటు చలవే. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గడచిన పదకొండు నెలల కాలంలో 70 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే, 79 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ చంద్రబాబు టీడీపీ వ్యవస్థాపక దినోత్సవంలో ధ్వజమెత్తారు. నిజానికి టీడీపీ వేడుకలో అది అసందర్భం. అయినా రాజకీయ నాయకులు ఏ వేదికనూ ఊరకే వదిలిపెట్టరు. ప్రత్యర్థిపై ఎక్కుపెడుతూనే ఉంటారు. అదే సమయంలో ఆంధప్రదేశ్ పై తన కలలను చిదిమేశారంటూ అన్యాపదేశంగా అమరావతిని ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల వెక్కిరింతలను భరించాల్సి వస్తోందంటూ కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. తెలంగాణలో ఒక ఎకరం పొలం అమ్మితే, ఆంధ్రాలో రెండు ఎకరాలు కొనుక్కోవచ్చన్న కేసీఆర్ కామెంట్ ఏపీకి అవమానం అన్న రీతిలో బాబు ప్రస్తావించారు. ఆదాయం కంటే అప్పు పెరిగిపోయిందన్న వ్యాఖ్య సూటిగా చేసిన రాజకీయ విమర్శ. ఈనాడు అదే అంశాన్ని శీర్షిక గా తీసుకుంది. కానీ ఆంద్రజ్యోతి సెంటిమెంటు సెగ పెట్టేందుకు పొరుగు రాష్ట్ర నేతల విమర్శను,వెక్కిరింతను హైలెట్ చేసేందుకు ప్రయత్నించింది. తద్వారా ఎక్కడో మారుమూలన ఉన్న సెంటిమెంటును ప్రేరేపించే యత్నమేననుకోవాలి.

పోస్టు ట్రూత్ మీడియా…

సంక్షేమ రాజ్యం కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ విమర్శలు పెద్దగా ప్రజలపై ప్రభావం చూపడం లేదు. అప్పులు, ఆదాయం, అవినీతి ఓటర్ల ను ప్రభావితం చేసే అంశాల జాబితానుంచి తొలగిపోయాయి. దీనిపై ఇటీవల ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆక్రోశం వెలిబుచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను పట్టించుకోకుండా ప్రజలు కూడా తమ వాటా కోసం అర్రులు చాస్తున్నారంటూ పరోక్షంగా నిందించారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలలో వైసీపీ ఘన విజయం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థ సమూలంగా ప్రక్షాళన జరగాలని ఆకాంక్షించారు. ఇదంతా రాధాకృష్ణ కున్న వ్యక్తిగత అభిప్రాయం. సీనియర్ జర్నలిస్టుగా తన పరిశీలన. నిజానిజాల సంగతెలా ఉన్నప్పటికీ ప్రజల్లో గూడుకట్టుకున్న పర్సెప్షన్ కు పెద్ద పీట వేయడమే పోస్టు ట్రూత్ పాలిటిక్స్. ఆంధ్రజ్యోతి చంద్రబాబు వ్యాఖ్యలను తీసుకున్న తీరు పక్కాగా దీనికి పట్టం గట్టింది. పాత సామెత ఒకటి దీనికి అతికినట్లు సరిపోతుంది. మొగుడు కొట్టినందుకు ఏడవడం లేదు. దానిని చూసిన తోడికోడలు దెప్పినందుకు ఏడుపు వస్తోందని వాపోయిందట ఒక ఇల్లాలు. ఇదే సూత్రాన్ని ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పాఠకులకు వర్తింపచేయాలనుకుంది. పదకొండు నెలల కాలంలో 79 వేల కోట్ల రూపాయల అప్పు చేయడం కంటే తెలంగాణ నాయకులు దెప్పి పొడవడమే ప్రధానమైపోయింది. అదే ఏపీ ప్రజలను బాధిస్తుందన్నట్లుగా వార్తను తీసుకున్నారు. మొత్తమ్మీద మీడియాలో పోస్టు ట్రూత్ శకం ప్రవేశించింది. ఏపీ ప్రజలకు, తెలంగాణకు మద్య ఇంకా సెంటిమెంటు పరంగా ఆవేశకావేషాలు ఉన్నాయి. హైదరాబాద్ ను కోల్పోయి నష్టపోయామనే భావన ఉంది. ఇప్పుడు తెలంగాణ నేతలు తమను చూసి ఎద్దేవా చేస్తున్నారంటే ఎక్కడో కాలుతుంది. దానిని తట్టి లేపడమే ఆంధ్రజ్యోతి కథన సారాంశంగా అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా? అన్న చంద్రబాబు నాయుడి అంతర్గత ఉద్దేశానికి పరోక్షంగా అద్దం పట్టింది ఆంధ్రజ్యోతి.

మీడియాకు పరీక్షే..

గతంలో ఎన్నడూ లేనంతగా మీడియా విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోంది. ఒకానొకప్పుడు వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఆ రెండు పత్రికలు అంటూ జ్యోతి, ఈనాడులను బోనులో నిలబెట్టారు. ప్రజా శల్యపరీక్షకు గురి చేశారు. తర్వాత సొంత మీడియా సాక్షి వచ్చిన తర్వాత మీడియాలో అంతవరకూ ఉన్న ముసుగులు తొలగిపోయాయి. స్పష్టమైన విభజన ఏర్పడింది. ప్రస్తుతం ఏ మీడియా చెప్పిన వార్తనైనా అంతసులభంగా ప్రజలు నమ్మడం లేదు. ప్రతి వార్తా కథనానికి పాఠకులే ఉద్దేశాలను ఆపాదించుకుని అనుమానంగా చూస్తున్నారు. తుపాను వచ్చినప్పుడు ముందు జాగ్రత్త తీసుకోకపోతే సర్కారీ నిర్లక్ష్యంతో ఇద్దరు యువకులు వరదలో కొట్టుకుపోతు న్నారనుకుందాం.. అబ్బే వాళ్లు కొట్టుకుపోవడం లేదు. ఆనందంగా నీళ్లలో ఈత కొడుతున్నారనే స్థాయిలో అధికార పార్టీ పత్రిక కథనం ప్రచురిస్తుంది. కేవలం ఇద్దరు మాత్రమే పొరపాటున కొట్టుకుపోతుంటే … ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయంటూ ప్రతిపక్షానికి మద్దతు ఇచ్చే పత్రికలు ప్రచురిస్తున్నాయి. ఈ రెండు వాదనల మధ్య ఉండే అంతరాన్ని , అవాస్తవాలను ఆసరాగా చేసుకుంటూ సోషల్ మీడియా చెలరేగిపోతోంది. ఇదే ధోరణి కొనసాగిస్తే భవిష్యత్తులో ప్రధాన స్రవంతిలోని మీడియాకు ప్రమాదమే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News