కొత్త ఏడాది కూడా తమ్ముళ్ళకు టీజర్ వదిలారుగా?

పాత పోయి కొత్త వస్తే మంచి జరుగుతుంది అంటారు. గతం చేదుని వదిలి తీపి కోసం ఎవరైనా అర్రులు చాస్తారు. కానీ రాజకీయాల్లో మాత్రం అలా కుదిరేది [more]

Update: 2021-01-16 03:30 GMT

పాత పోయి కొత్త వస్తే మంచి జరుగుతుంది అంటారు. గతం చేదుని వదిలి తీపి కోసం ఎవరైనా అర్రులు చాస్తారు. కానీ రాజకీయాల్లో మాత్రం అలా కుదిరేది కాదు, ఇపుడు ఏపీలో కూడా తమిళనాడు తరహా రాజకీయాలు అలవాటు అయ్యాక దినమొక గండంగానే ప్రతిపక్ష నేతలు గడపాల్సిందే. ప్రత్యేకించి నిన్నటి వరకూ రాజ్యం చేసిన టీడీపీకి ఇపుడు గడ్డు కాలమే నడుస్తోంది. అది చెప్పేందుకు ఏ జ్యోతీష్కుడు ప్రత్యేకంగా పంచాంగం పట్టాల్సిన అవసరం లేదు. ఏపీలో అధికార వైసీపీకి టీడీపీ కి మధ్యన అతి పెద్ద రాజకీయ యుధ్ధమే జరుగుతోంది. దొరికిన వాడు దోషే అవుతాడు అన్న రాజనీతిని అంతా అమలు చేస్తున్నారు.

అసలు వదిలేది లేదుట …..

విశాఖలో భూ ఆక్రమణలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని గత నాలుగేళ్ళుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇపుడు వైసీపీ సర్కార్ అధికారంలో ఉంది. వాటి తాలూకా పునాదుల నుంచి తవ్వి తీసే పనిలో యమ బిజీగా ఉంది. ఇప్పటికే టీడీపీ పెద్ద తలకాయలను టార్గెట్ చేస్తూ వచ్చిన వైసీపీ 2020 సెకండ్ హాఫ్ అంతా తమ్ముళ్ళతో ట్వంటీ ట్వంటీ మాచ్ ఆడుకుంది. కొత్త ఏడాది వచ్చినా సేమ్ టూ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖలో భూ కబ్జాలకు ప్రధాన కారణం తెలుగుదేశం నేతలేనని కూడా ఆయన క్లారిటీగా చెప్పేసారు. ఇకమీదట ఏ ఒక్కరినీ వదిలేది లేదంటూ గర్జిస్తున్నారు.

సిట్ నివేదికతో సహా….

వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక సిట్ ని నియమించి మరీ విశాఖలో అడుగడుగునా జరిగిన భూ ఆక్రమణలైన విచారణ జరిపించింది. సిట్ విచారణ పూర్తి అయింది. తుది నివేదిక కూడా తయారై సిధ్ధంగా ఉంది. కొత్త ఏడాది ఆ నివేదిక వైసీపీ సర్కార్ చేతిలో పడగానే అసలైన రాజకీయ సినిమా ఉంటుంది అంటున్నారు. విశాఖ అంతా టీడీపీ నేతలే ఎక్కువగా కబ్జాలకు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి అంటున్నారంటే సిట్ నివేదిక ఆధారంగానే అనుకోవాలి. దాంతో తమ్ముళ్లకు కొత్త ఏడాది ఆనందం ఏ కోశానా లేకుండా పోతోంది.

మరో ఎమ్మెల్యే టార్గెట్…

ఇప్పటిదాకా విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుని టార్గెట్ చేసిన వైసీపీ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గణబాబుని తాజాగా టార్గెట్ చేసింది. ప్రభుత్వ స్థలాన్ని ఎమ్మెల్యే ఆక్రమించి సినిమా హాలు కట్టేసారని విజయసాయిరెడ్డి చేసిన హాట్ కామెంట్స్ ఎమ్మెల్యే గణబాబు వర్గీయుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ఆగడాలు అసలు సహించమని కూడా సాయిరెడ్డి స్పష్టంగా చెప్పేస్తున్నారు. వరసపెట్టి దాడులు జరుగుతాయని, గజం స్థలం ప్రభుత్వానిది చెందినది ఉన్నా కూడా స్వాధీనం చేసుకుంటామని ఆయన అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఆ మీదట తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం కఠిన శిక్షలు కూడా ఉంటాయని అయన హెచ్చరిస్తున్నారు. దాంతో 2021లోనూ విశాఖలో టీడీపీ నాయకులకు మనశ్శాంతి కరవు అన్నది టీజర్ రిలీజ్ చేసి మరీ వైసీపీ పెద్దాయన చెప్పేశారన్న మాట.

Tags:    

Similar News