ఓటమి అంచున ఉన్నట్లేనా?

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు అంత సులువు కాదని ఈటల రాజేందర్ కు అర్థమయింది. కేసీఆర్ ఈటలను ఓడించేందుకు అన్ని వైపుల నుంచి పక్కా వ్యూహాలను అమలుపరుస్తున్నారు. [more]

Update: 2021-09-18 14:30 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు అంత సులువు కాదని ఈటల రాజేందర్ కు అర్థమయింది. కేసీఆర్ ఈటలను ఓడించేందుకు అన్ని వైపుల నుంచి పక్కా వ్యూహాలను అమలుపరుస్తున్నారు. కేవలం ఈటల రాజేందర్ సానుభూతితో మాత్రమే గెలవాల్సి ఉంటుంది. అంతకు మించి ఆయనకు వేరే దారి కన్పించడం లేదు. ఈటల రాజేందర్ పాదయాత్ర, సభలకు కూడా గతంలో ఉన్న రెస్పాన్స్ లేకపోవడమే ఇందుకు ఉదాహరణ.

ప్రత్యర్థి సయితం…

హుజూరాబాద్ లో పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది. బీసీ సామాజికవర్గాన్ని తన సొంతం చేసుకుందామనుకున్న ఈటల రాజేందర్ కు అభ్యర్థి రూపంలో కేసీఆర్ కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు. ఇక్కడ గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటించడంతో బీసీ ఓట్లలో కూడా చీలిక వచ్చే అవకాశం స్పష్టంగా కన్పిస్తుంది. దీనికి తోడు ఈటల రాజేందర్ వెంట ఉన్న ముఖ్యనేతలందరూ తిరిగి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

దళిత బంధు పథకం…

దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ లో సుమారు 17 వేల మందికి ఇవ్వనున్నారు. సర్వే ద్వారా దళిత బంధు అర్హులను ప్రభుత్వం తేల్చింది. వారి ఖాతాల్లో పది లక్షలు పడితే దాదాపు ముప్ఫయి ఐదు వేల ఓట్లకు గండిపడినట్లేనని ఈటల రాజేందర్ భావిస్తున్నారు. పోనీ దళిత బంధు పథకం ద్వారా ఇతర సామాజికవర్గాలు తనవైపు తిరిగే అవకాశముందని ఈటల రాజేందర్ నిన్న మొన్నటి వరకూ భావించారు.

కులాల వారీగా…

కానీ ఆ చాన్స్ కూడా లేనట్లే కన్పిస్తుంది. సామాజికవర్గాల వారీగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఓట్ల కొనుగోళ్లను ప్రారంభించిందంటున్నారు. దీంతో పాటు ఈటల రాజేందర్ కు ఓటేసినా మరో రెండున్నరేళ్లు నియోజకవర్గం అభివృద్ధి ఏమీ జరగదన్న పాయింట్ ను కూడా టీఆర్ఎస్ నేతలు హైలెట్ చేస్తున్నారు. కులాల వారీగా ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుండటంతో ఈటల రాజేందర్ కు రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News