అంతా ఓకేనట

మహారాష్ట్రలో రాజకీయ చిక్కుముడి వీడినట్లే. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు మూడు పార్టీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. [more]

Update: 2019-11-22 18:29 GMT

మహారాష్ట్రలో రాజకీయ చిక్కుముడి వీడినట్లే. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు మూడు పార్టీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. శివసేన నుంచి ముఖ్యమంత్రి అవుతారని దాదాపుగా ఖరారయింది. ఉద్ధవ్ థాక్రే తొలుత తన కుమారుడు ఆదిత్య థాక్రేను ముఖ్యమంత్రిని చేయాలని భావించినా అందుకు కాంగ్రెస్, ఎన్సీపీలు అంగీకరించలేదు. దీంతో తానే ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించాలని ఉద్దవ్ ధాక్రే భావిస్తున్నారు.

మూడు పార్టీలూ కలసి….

శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నేతల మధ్య జరిగిన కీలక సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాంను ఖచ్చితంగా అమలు చేయాలని, పార్టీ అజెండాలను పక్కన పెట్టాలని నిర్ణయించారు. మంత్రివర్గంలోనూ స్థానం కల్పించడం ఆ యా పార్టీల అధినేతల నిర్ణయమని, ఎలాంటి అసంతృప్తులకు తావివ్వకుండా మంత్రుల పేర్ల జాబితాను రూపొందించుకోవాల్సి ఉంటుందని మూడు పార్టీలూ నిర్ణయించాయి.

అర్థరాత్రి చర్చలు….

నిన్న అర్థరాత్రే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను కలసి చర్చలు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటు, అనంతరం వ్యవహరించాల్సిన తీరుపై వీరు దాదాపు మూడుగంటలకు పైగా చర్చలు జరిపారు. ఉద్ధవ్ రాష్ట్ర అభివృద్ధి పట్ల రూపొందించిన రూట్ మ్యాప్ పై కూడా వీరిరువురూ చర్చలు జరిపినట్లు తెలిసింది. ఉద్ధవ్ ఠాక్రేనే ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాల్సిందిగా శరద్ పవార్ ఉద్ధవ్ ను కోరినట్లు తెలిసింది. దీనివల్ల శివసేన సభ్యులు కట్టుబాటులో ఉంటారని, బాల్ థాక్రే కోరిక కూడా తీరినట్లవుతుందని ఆయన అన్నట్లు చెబుతున్నారు.

కలసి నడవాలని…..

ప్రభుత్వం ఏర్పాటయ్యే దశలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా శివసేన ముందు జాగ్రత్తలు తీసుకుంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను రాజస్థాన్ కు తరలించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటు పై మూడు పార్టీలు కలసి ప్రకటన చేసే అవకాశముంది. నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి మద్దతు లేఖలను కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ కు 44 మంది సభ్యులున్నారు. మొత్తం 288 మంది సభ్యులున్న మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ 144 మాత్రమే. ఈ మూడు పార్టీలకు కలసి 154 మంది సభ్యులుండటంతో గవర్నర్ తమను ఆహ్వానిస్తారన్న నమ్మకంతో ఉన్నారు.

Tags:    

Similar News