వీరికి వారితో తంటాలు తప్పేట్లు లేవే?

బీహార్ ఎన్నికల ఫలితాలు అన్ని రాజకీయ పార్టీలకు పాఠాన్ని నేర్పాయి. కూటమిలో పార్టీలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీహార్ ఎన్నికలు తేల్చిచెప్పాయి. అక్కడ లోక్ [more]

Update: 2020-11-24 17:30 GMT

బీహార్ ఎన్నికల ఫలితాలు అన్ని రాజకీయ పార్టీలకు పాఠాన్ని నేర్పాయి. కూటమిలో పార్టీలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీహార్ ఎన్నికలు తేల్చిచెప్పాయి. అక్కడ లోక్ జనశక్తి పార్టీ విడిగా పోటీ చేయడం, మాంఝీ పార్టీ ఎన్నికలకు ముందు మహాకూటమి నుంచి ఎన్డీఏ కూటమిలో చేరడం వంటివి ఆసక్తికరంగా మారాయి. చిన్న పార్టీలని నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని బీహార్ ఎన్నికల ఫలితాలు చెప్పాయి. దీంతో తమిళనాడులోనూ చిన్న పార్టీలకు క్రేజ్ ఏర్పడింది.

బీహార్ ఫలితాల తర్వాత…..

బీహార్ ఎన్నికల్లో దాదాపు ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో వంద లోపు మెజారిటీతోనే ఆర్జేడీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. దీంతోనే ఆర్జేడీ అక్కడ అధికారంలోకి రాలేకపోయింది. తమిళనాడులోనూ బీహార్ తరహాలోనే ప్రాంతీయ పార్టీలదే హవా ఎక్కువ. ఇక్కడ లెక్కకు మించిన చిన్న పార్టీలున్నాయి. వాటిని గతంలో శాసించే పార్టీలు ఇప్పుడు ఆ సాహసం చేయలేకపోతున్నాయి. వారి డిమాండ్లు ఎక్కువగా ఉండటంతో ఇటు కాదనలేక, అటు ఔననలేక మధనపడుతున్నాయి.

చిన్న పార్టీలే కీలకం….

డీఎంకేలో చిన్న పార్టీలు అనేకం ఉన్నాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, డీపీఐ, ఎండీఎంకే, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ వంటి పార్టీలున్నాయి. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, డీఎండీకేలు ఉన్నాయి. ఈ చిన్న పార్టీలన్నీ తమిళనాడులో ఏదో ఒక వర్గాన్ని ప్రభావితం చేయనున్నాయి. వీటిని కలుపుకుని వెళితేనే బలం అదనంగా సమకూరుతుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఓట్లు చీలిపోయి గెలుపుపై పర్భావం చూపనుంది.

స్థానాల కోసం పట్టు….

అందుకే ఇప్పుడు చిన్న పార్టీలన్నీ తమకు అధిక స్థానాలను కేటాయించాలని వత్తిడి తెస్తున్నాయి. గతంలో కంటే ఎక్కువ స్థానాలను కావాలని పట్టుబడుతున్నాయి. ఈ పరిస్థితి ప్రతిపక్ష డీఎంకేలో ఎక్కువగా కన్పిస్తుంది. తమకు ఎక్కువ స్థానాలను కేటాయించకపోతే తాము ప్రత్నామ్నాయం ఆలోచించుకోవాల్సి ఉంటుందని అల్టిమేటం కూడా అవి జారీ చేస్తుండటం అధినేతను కలవరపరుస్తోంది. మొత్తం మీద బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో చిన్న పార్టీలకు డిమాండ్ పెరిగిందనే చెప్పాలి.

Tags:    

Similar News