ఆంధ్రుడికి మేలుకొలుపు

ఒక్క ఆంధ్రుడేనా, యావత్ ప్రపంచం మేల్కొవాల్సిందే. తప్పదు. ఇది చారిత్రిక అవసరం. లేకపోతే భవిష్యత్ తరాలు మనను క్షమించవు. దావోస్ లో మొత్తం సదస్సు ఎజెండా మార్చేశారు. [more]

Update: 2020-02-03 03:30 GMT

ఒక్క ఆంధ్రుడేనా, యావత్ ప్రపంచం మేల్కొవాల్సిందే. తప్పదు. ఇది చారిత్రిక అవసరం. లేకపోతే భవిష్యత్ తరాలు మనను క్షమించవు. దావోస్ లో మొత్తం సదస్సు ఎజెండా మార్చేశారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు అందరూ ఒక్కసారిగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ మార్పిడిపైన, విస్తృతస్థాయిలో చర్చలు చేశారు. సమావేశానికి హాజరైన తెలంగాణా మంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఎవరూ పట్టించుకున్నట్టు లేరు. ఒకవేళ ఎవరైనా ఆయనతో మాట్లాడినా ఏపీ ఎన్నికల ఫలితాలగురించే మాట్లాడారు.

యూరోపియన్ నుండి బ్రిటన్ వరకూ…

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బయటకు రావటానికి కూడా ఏపీలో ఎన్నికల ఫలితాలే కారణం. ఇరాన్ పై అమెరికా దాడికి కూడా ఇదే కారణం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి పోటీచేయాలా? వద్దా? అనే సంశయంలో డోనాల్డ్ ట్రంప్ ఉన్నారు.

సూర్యుడి ప్రతాపానికి….

ఓజోన్ పొరకు ఒక డజనుకు పైగా కంతలు పడ్డాయి. రానున్న రోజుల్లో సూర్యుడి ప్రతాపం భూమిపై ఎక్కువగా ఉండబోతోంది. రాత్రిపూట చంద్రుడు చాలా అరుదుగా కనిపించబోతున్నాడు. ఆకాశంలో మనకు కనిపించే చుక్కల సంఖ్య క్రమేణా తగ్గబోతోంది. కొన్ని లక్షల కోట్ల చుక్కలు రాలి భూమిపై పడి ఈ భూమండలాన్ని నాశనం చేయబోతున్నాయి.సూర్యోదయం క్రమేణా దక్షిణ దిశగా మారనుంది. ఇది ఇప్పటికిప్పుడే మనకు కనిపించకపోవచ్చు. కానీ క్రమేణా సూర్యోదయాన్ని మనం దక్షిణ దిశలో చూడబోతున్నాం.

కరోనా వైరస్ కు కూడా….

ఇప్పుడు చైనాలో వచ్చిన కరోనా వ్యాధికి కారణం ప్రకృతి ఆగ్రహించింది. అదికూడా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల పట్ల నిరసనగానే. ప్రకృతి కూడా తీవ్ర మనోవేదనకు గురవుతోంది. ఈ విషయాలేవీ ఆయా దేశ నేతలు బయటకు చెప్పరు. లోలోపల కుంగిపోతుంటారు.

ప్రశాంత్ కిపోర్ లోలోన…

ప్రశాంత్ కిషోర్ కూడా బయటకు చెప్పరు. లోలోపలే మదనపడుతున్నారు. ప్రకృతి కూడా నేరుగా మనలో ఎవరితోనూ మాట్లాడదు. లోలోపల మదనపడుతుంది. ప్రపంచ దేశాల నేతలైనా, ప్రకృతి అయినా, ప్రశాంత్ కిషోర్ అయినా లోలోపల మదనపడే విషయం మనకు ఎవరికీ తెలియదు. మనం పసిగట్టలేం కూడా. కానీ ఇలాంటి విషయాలు తెలిసిన, తెలుసుకోగల ఒకేఒక వ్యక్తి మనమధ్యన ఉండడం, అలాంటి వ్యక్తి మన తెలుగువాడై ఉండడం మనందరికీ గర్వకారణం. అవునూ …. “ఆంధ్రుడా మేలుకో” అని చెప్పడానికి ఆ “ఆశ్చర్యార్ధకం” ఎందుకో?మొత్తం చదివి ఆశ్చర్యపోండి అని అర్థమా? లేక మొత్తం రాశాక తానే ఆశ్చర్యపోయారా? లేక ఇది మొత్తం నమ్మశక్యంగా లేదని తనకే అనిపించి అలా ఆశ్చర్యార్ధకం పెట్టేశారా?

– దారా గోపి, సినియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News