కవిత కావడంతో….క్యాంప్ లు లేవ్…. కానుకల్లేవ్…

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబరు 9 న ఎన్నిక జరగనుంది. అయితే ఎన్నిక జరగనప్పటికీ ఫలితం మాత్రం ముందుగానే [more]

Update: 2020-10-03 09:30 GMT

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబరు 9 న ఎన్నిక జరగనుంది. అయితే ఎన్నిక జరగనప్పటికీ ఫలితం మాత్రం ముందుగానే చెప్పేయవచ్చు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తుండటంతోనే దీనికి ప్రాధాన్యత లభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఇదే స్థానం నుంచి 2016లో ఎన్నికైన భూపతి రెడ్డి కాంగ్రెస్ కు మద్దతు తెలపడంతో అనర్హత వేటు పడింది. దీంతో ఇక్కడ తిరిగి ఎన్నికను నిర్వహిస్తున్నారు.

క్యాంప్ రాజీకీయాలు లేవ్…..

అయితే స్థానిక సంస్థల ఎన్నికలంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది క్యాంప్ రాజకీయాలు. స్థానికసంస్థల ప్రతినిధులే ఓటర్లు కావడంతో వారందరినీ క్యాంపులకు తరలించి పోలింగ్ కు నేరుగా తీసుకవస్తారు. తమ పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా క్యాంప్ లను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయంటే స్థానికసంస్థల ప్రజాప్రతినిధులకు పంట పండినట్లే.

భారీ గిఫ్ట్ లతో…..

దాదాపు పదిహేను రోజుల పాటు సకల సౌభాగ్యాలు అనుభవిస్తారు. కోరిన కోర్కెలు నెరవేర్చుకుంటారు. ఖరీదైన బహుమతులు అందుతాయి. అయితే ఇక్కడ పోటీ చేసేది కేసీఆర్ కుమార్తె కావడంతో బహుమతులు కోరే అవకాశం లేకుండా పోయింది. మరో వైపు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో క్యాంప్ రాజకీయాలకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు తమను ఒక కంట కనిపెడుతుండటంతో ఈ ఎన్నికపై వారు అంత ఆసక్తి కనపర్చడం లేదు.

పూర్తి స్థాయి మెజారిటీ…..

దీనికి కూడా ఒక లెక్కుంది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 824 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో ఆరు వందల మంది టీఆర్ఎస్ కు చెందిన వారే కావడంతో కల్వకుంట్ల కవిత గెలుపు దాదాపు ఖాయమయింది. బీజేపీ, కాంగ్రెస్ లకు కలిపినా 200 ఓటర్లకు మించి లేవు. దీంతోనే ఇక్కడ క్యాంపు రాజకీయాలకు ఏ పార్టీ ఆసక్తి కనపర్చడం లేదు. వన్ సైడ్ ఎలక్షన్ కావడంతో ఏ అభ్యర్థి కూడా ఖర్చు పెట్టేందుకు సిద్ధపడటం లేదు. మొత్తం మీద నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు ఓటర్లకు మాత్రం నిరాశను కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News