పేద రాష్ట్రంలో పెద్ద ప్రచారం… ఎవరు ముందున్నారంటే?

కరోనా… మూడక్షరాల ఈ మహమ్మారి ఇప్పటికీ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. నేటికీ సరైన మందు లేక సమాజం ఆందోళన చెందుతోంది. అయినప్పటికీ మాస్కుల ధారణ, శానిటైజర్ల వాడకం, [more]

Update: 2020-10-10 16:30 GMT

కరోనా… మూడక్షరాల ఈ మహమ్మారి ఇప్పటికీ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. నేటికీ సరైన మందు లేక సమాజం ఆందోళన చెందుతోంది. అయినప్పటికీ మాస్కుల ధారణ, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటింపు వంటి జాగ్రత్తలతో ప్రపంచం ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం పడని రంగం అంటూ ఏమీ లేదు. ఈ కారణంగా వివిధ దేశాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిది. దక్షిణ కొరియా, సింగపూర్, శ్రీలంక వంటి కొన్ని దేశాలు జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికలను నిర్వహించాయి. మన దేశంలో కూడా రాజ్యసభ, శాసనమండళ్ల ఎన్నికలు జరిగాయి.

తొలి రాష్ట్రంగా….

తాజాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు వచ్చింది. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్న విషయమై తొలుత తర్జనభర్జనలు జరిగినప్పటికీ అంతిమంగా ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికల నిర్వహణకే ఎన్నికల కమిషన్ ఓటేసింది. తద్వారా కరోనా సమయంలో ఎన్నికలకు వెళుతున్న తొలి రాష్ర్టంగా బిహార్ గుర్తింపు పొందింది. సాధారణంగా ఎన్నికలంటే సభలు, సమావేశాలు, ప్రచారాలు, ప్రదర్శనలు, ప్రసంగాలు, విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు గుర్తుకు వస్తాయి.కానీ కరోనా కారణంగా వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా నిషేధం విధించారు. కేవలం సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే ప్రచారానికి పరిమితం కావాలని సూచించారు. దీంతో 243 స్థానాలకు అక్టోబరు 28, అక్టోబరు 31, నవంబరు 7ల్లో మూడు దశల్లో జరిగే ఎన్నికలకు సంప్రదాయ ప్రచారం బదులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువ కావాలని పార్టీలు నిర్ణయించాయి. ఆన్ లైన్ ప్రసంగాలు, వర్చువల్ సమావేశాలు, వాట్సప్ సందేశాలు, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ల ద్వారా ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు పార్టీలు సమాయత్తమవుతున్నాయి.

బీజేపీ ముందుంది…..

సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లకు చేరువయ్యే విషయంలో సంకీర్ణ కూటమిలోని ప్రధాన భాగస్వామి భాజపా ముందంజలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున సుమారు 9,500 మంది సమాచార సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగారు. దాదాపు 72వేల వాట్సప్ గ్రూపులు పని చేస్తున్నాయి. పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, అభివద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇవి ఉపకరిస్తున్నాయి. పార్టీ అగ్రనేత అమిత్ షా జూన్ 7న వర్చువల్ ప్రసంగం ద్వారా పార్టీ శ్రేణులలో ఉత్సాహం కలిగించారు. పార్టీకి 14.3 మిలియన్ల మందికి చేరువైనట్లు అంచనా. కాంగ్రెస్ కు ఇందులో సగం మంది కూడా లేరు. ఆర్ జేడీకి 1.4 లక్షల వద్దే ఆగిపోయింది. అధికార జనతాదళ్ (యు) పరిస్థితి కూడా అంతగొప్పగా ఏమీలేదు. గత ఏడాది లోక్ సభ ఎన్నికలకు రాష్ట్ంలో ఆన్ లైన్ ప్రచారానికి బీజేపీ సుమారు రూ.27 కోట్లు ఖర్చు చేసింది. హస్తం పార్టీ రూ.5.6 కోట్లు వ్యయం చేసింది. వనరుల లభ్యత, కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం, సమాచార సాంకేతిక నిపుణులు ఉండటం ఆ పార్టీకి కలిసివచ్చే అంశాలు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్ జేడీ) వెనకబడి ఉన్నాయి.

27 శాతం మందికే….

నిధుల కొరత, నిపుణుల కొరత, సరైన యంత్రాంగం లేకపోవడం ఇందుకు కారణాలు. దేశంలోని పేద రాష్రాల్లో బిహార్ ఒకటి. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు చాలా తక్కువ. మెజారిటీ ప్రజలకు నిత్య జీవనం గగనమే. అటువంటి వారికి అధునాతన ఆండ్రాయిడ్ ఫోన్లను సమకూర్చుకునే శక్తి ఉండదు. ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారటీ ఆఫ్ ఇండియా) అంచనాల ప్రకారం రాష్ర్టంలో 32 శాతం మందికే అంతర్జాల సౌకర్యం ఉంది. 27 శాతం మందికే ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల ద్వారా చేసే ప్రచారం ఎంతవరకు ప్రజల్లోకి వెళుతుందన్న ఆందోళన పార్టీల్లో నెలకొంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News