జగన్ ను, గాంధీ కుటుంబాన్ని బ్యాలన్స్ చేస్తున్నారుగా?

జగన్ పార్టీలో జగన్నామస్మరణ అయినా చేయాలి, లేకపోతే వైఎస్సార్ ని అయినా ప్రస్తుతించాలి. ఇప్పటిదాకా ఆ పార్టీలో నేతలందరూ చేస్తున్న పని అదే. అయితే విశాఖ జిల్లాకు [more]

Update: 2020-04-17 06:30 GMT

జగన్ పార్టీలో జగన్నామస్మరణ అయినా చేయాలి, లేకపోతే వైఎస్సార్ ని అయినా ప్రస్తుతించాలి. ఇప్పటిదాకా ఆ పార్టీలో నేతలందరూ చేస్తున్న పని అదే. అయితే విశాఖ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత మాత్రం ఇంకా గాంధీ కుటుంబానికి వీర భక్తుడుగానే ఉన్నారు. ఆయన ఇంట్లో వారి నిలువెత్తు ఫోటోలే కనిపిస్తాయి. ఆయన ఎన్నికల ముందు వరకూ పక్కా కాంగ్రెస్. ఆయన్ని తీసుకొచ్చి కండువా కప్పి మరీ విశాఖ సౌత్ నుంచి వైసీపీ తరఫున నిలబెట్టారు. తక్కువ మెజారిటీతో ఓడిపోయినా ఆ తరువాత క్యాబినెట్ ర్యాంక్ పదవిగా విశాఖ మెట్రో రీజియన్ అధారిటీ చైర్మన్ గా చేసి జగన్ గౌరవించారు. ఆయనే ద్రోణంరాజు శ్రీనివాస్.

వీర విధేయత….

కాంగ్రెస్ పార్టీతో ద్రోణం రాజు కుటుంబానిది అయిదు దశాబ్దాల అనుబంధం. దివంగత నేత ద్రోణం రాజు సత్యనారాయణ 1970 దశకంలోనే కాంగ్రెస్ లో చేరి ఎంపీ, ఎమ్మెల్యే, జెడీ చైర్మన్, ఉడా చైర్మన్, ఆ తరువాత రెండు మార్లు రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు. ఇందిరాగాంధీ ప్రోత్సాహంతోనే ద్రోణంరాజు రాజకీయాల్లో ఇంత ఎత్తుకు ఎదిగారు. ఆమె చేతుల మీదనే తొలిసారి విశాఖ ఎంపీ టికెట్ పొంది నాటి మేటి నాయకుడు తెన్నేటి విశ్వనాధాన్ని ఓడించారు ద్రోణంరాజు. ఆ విధంగా ఇందిరాగాంధీ కుటుంబానికి ద్రోణంరాజు ఫ్యామిలీ వీర విధేయత చూపిస్తుంది.

అదే బాటలో….

రాజకీయాల్లో విధేయతలు, విశ్వసనీయతలు కనుమరుగు అవుతున్న రోజులు ఇవి. అయినా సరే దశాబ్దాల నాటి అభిమానాన్ని దృష్టిలోపెట్టుకునే ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా ఇప్పటివరకూ కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఆయన ఇంట్లో నిలువెత్తు ఇందిరాగాంధీ చిత్ర పటం ఇప్పటికీ కనిపిస్తుంది. ఎవరైనా ఆయన్ని కలవాలని వెళ్ళగానే ఇందిరాగాంధీ చిత్రపటాన్నే ముందు చూడాల్సిందే. ఇక ద్రోణంరాజు శ్రీనివాస్ ఆమె ఫోటోకు దండం పెట్టి కానీ ఏ పని మొదలెట్టరు కూడా.

ఇది వింతే మరి ….

వైఎస్సార్ వరకూ చూసుకుంటే కాంగ్రెస్ తో విశేషమైన అనుబంధం ఉంది. జగన్ మాత్రం అదే కుటుంబాన్ని ఎదిరించి పార్టీ పెట్టారు. కాంగ్రెస్ పొడ అంటే అసలు గిట్టన్ జగన్ పార్టీలో ఉన్న ద్రోణంరాజు శ్రీనివాస్ అదే కాంగ్రెస్ పార్టీ పెద్దలను పూజిచడం, వారి నిలువెత్తు చిత్ర పటాలను ఇంట్లో కొలువుంచడం అంటే వింతగానే ఉంటుంది. కానీ ద్రోణంరాజు శ్రీనివాస్ ఇది తన వ్యక్తిగత భక్తి అని చెబుతున్నారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విధానాలకు బద్ధుడిని అని, అయితే ఇందిరాగాంధీ అంటే తమ కుటుంబానికి ఇలవేలుపు లాంటిదని ఆయన అంటున్నారు. ఎవరి సెంటిమెంట్లు వారివి అయినా రాజకీయాల్లో ఒక‌సారి ఇవే పెరిగి పెద్దవై కొంప ముంచుతూ ఉంటాయి. మరి ఇప్పటికైతే తన పూర్వపు భక్తిని, ప్రస్తుత పార్టీలో రాజకీయ వృత్తిని రెండింటినీ ద్రోణంరాజు బ్యాలన్స్ చేసుకుని వస్తున్నారు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News