ఎట్టకేలకు గట్టి పదవి

రాజకీయాల్లో కొండంత ప్రజాభిమానం ఉన్నా రవ్వంత అదృష్టం ఉండాలంటారు. ద్రోణంరాజు శ్రీనివాస్ ఆ విధమైన లక్కును తొక్కారనే చెప్పాలి. వైఎస్ కుటుంబం కాలువతోనే ఆయనకు పదవులు దక్కడం [more]

Update: 2019-07-15 03:30 GMT

రాజకీయాల్లో కొండంత ప్రజాభిమానం ఉన్నా రవ్వంత అదృష్టం ఉండాలంటారు. ద్రోణంరాజు శ్రీనివాస్ ఆ విధమైన లక్కును తొక్కారనే చెప్పాలి. వైఎస్ కుటుంబం కాలువతోనే ఆయనకు పదవులు దక్కడం ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం. ద్రోణంరాజు శ్రీనివాస్ రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గింది వైఎస్సార్ జమానాలోనే కావడం విశేషమైతే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయంగా మరో అవకాశాన్ని ఇచ్చిన వైఎస్ జగన్ ఎన్నికల్లో ఓడినప్పటికీ ఇపుడు ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలెప్ మెంట్ అధారిటి చైర్మన్ పోస్ట్ ని కట్టబెట్టారు. అయిదు జిల్లాలకు విస్తరించిన ఈ పదవి మీద చాలా మంది కన్ను ఉంది. నిజానికి ఎమ్మెల్యే కంటే కూడా పవర్ ఫుల్ పదవిగా చెబుతారు. తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఈ పదవి కోసం ఎంతో మంది ఎదురు చూసి విసిగి వేసారిపోయారు. చిత్రమేమిటంటే అప్పటివరకు విశాఖ నగరాభివృద్ది సంస్థ (ఉడా) గా ఉన్న దాన్ని అయిదు జిల్లాలకు పెంచుతూ మెట్రో రీజియన్ గా చేసింది టిడిపినే. అయితే మొదట ఈ పదవిలో అప్పటి టిడిపి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిని నియమిస్తారని ప్రచారం జరిగింది, అ తరువాత ఉడా మాజీ చైర్మన్ , మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ ను నియమిస్తారనుకున్నారు. ఇంకా అనేకమంది పెద్ద నాయకులు ఈ పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేసారు. అయితే చివరికి టిడిపి ప్రభుత్వం తాత్సారం చేసి ఎవరికి ఇవ్వకుండానే కధ ముగించేసింది.

నాడు తండ్రి…నేడు తనయుడు…..

ఇక పొతే విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటి మొదటి చైర్మన్ గా ద్రోణంరాజు శ్రీనివాస్ రికార్డ్ సృష్టించారు. ఇంతటి కీలకమైన పదవిలో తొలిసారి నియమితులైన ద్రోణంరాజు శ్రీనివాస్ తనదైన మార్క్ చూపించాల్సి ఉంది. ఆయన తండ్రి దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ సైతం వుడా బోర్డ్ కి తొలి చైర్మన్ కావడం విశేషం. 1979 లో సత్యనారాయణ వుడా చైర్మన్ గా ఉంటూ విశాఖలో ఎంతో అభివృద్ది చేసి చూపించారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద కాలనీగా పేరు గాంచిన ఎంవిపి కాలని సృష్టి కర్త ఆయనే కావడం గమనార్హం. ఆ తండ్రి వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన ద్రోణంరాజు శ్రీనివాస్ రెండు మార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా పని చేసారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితం కలిగిన ఆయన సౌమ్యునిగా, సమర్దునిగా పేరు తెచ్చుకున్నారు. అయిదు జిల్లాలకు విస్తరించిన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటి చైర్మన్ గా ఆయన ఇపుడు తనదైన ముద్ర వేయగలగాలి. వేగంగా అభివృద్ది చెందుతున్న విశాఖకు కొత్త రూపం ఇవ్వాలి.

నిజాయతికి పట్టం…..

ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్ పదవులు ఇచ్చే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. సమర్ధత తో పాటు, నిజాయతి కూడా చూస్తున్నారు. అవినీతి రహిత పాలనా అంటూ నినదించిన జగన్ దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటి అంటేనే అవినీతికి నిలయం. రియల్ ఎస్టేట్ రంగం బాగా ఊపు మీద ఉన్న విశాఖలో ఈ సంస్థ చాలా కీలకం. అటువంటి సంస్థలో అవినీతి తిమింగలాలు చాలా ఉన్నాయి. నిజాయతిపరుడికి చైర్మన్ గిరీ కట్టబెట్టడం ద్వారా సంస్థను అభివృద్ది చేయాలని, అలాగే అవినీతిరహితంగా పాలనా జరిగేలా చూడాలని జగన్ అలోచన. విశాఖకు సంబంధించి జగన్ వద్ద ప్రణాళికలు ఎన్నో వున్నాయి. అవి సవ్యంగా సాగాలంటే సీనియర్ నాయకుడు, అవినీతి మచ్చ లేనివారు చైర్మన్ గా ఉండాలి. ఈ కీలకమైన పదవి కోసం ఎంతో మంది వేచి ఉన్నా కూడా జగన్ ఏరి కోరి ద్రోణంరాజు శ్రీనివాస్ కు కట్టబెట్టడం వెనక ఆయన నిజాయాతి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

Tags:    

Similar News