ఏడోసారీ ఏడుపు మొహ‌ంతోనేనా?

అమెరికా అధ్యక్షుడికి ఒకింత అహం ఎక్కువే. వారి మాటల్లో చేతల్లో ఈ విషయం ప్రస్ఫుటంగా కనపడుతుంది. వారికి తమ వ్యాపార ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలే ముఖ్యం. పొరుగుదేశాలు [more]

Update: 2020-02-24 16:30 GMT

అమెరికా అధ్యక్షుడికి ఒకింత అహం ఎక్కువే. వారి మాటల్లో చేతల్లో ఈ విషయం ప్రస్ఫుటంగా కనపడుతుంది. వారికి తమ వ్యాపార ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలే ముఖ్యం. పొరుగుదేశాలు ఏమైనా పరవాలేదన్నది వారి సిద్ధాంతం. ఏ దేశాధినేతనూ వారు సంపూర్ణంగా విశ్వసించరు. మనస్ఫూర్తిగా వ్యవహరించరు. మనసు విప్పి మాట్లాడనే మాట్లాడరు. ఇందుకు భారత అధినేతలు మినహాయింపు కాదు. గతంలో సోవియట్ యూనియన్ చెలిమి కారణంగా భారత్ ను అనుమానంతో చూడటం వాషింగ్టన్ విధాన నిర్ణేతలకు కొత్తేమీ కాదు. 1991లో సోవియట్ యూనియన్ పతనం అనంతరం న్యూఢిల్లీ పట్ల వాషింగ్టన్ వైఖరి ఒకింత మారింది. భారత్ అతి పెద్ద మార్కెట్ కావడం, తనకు సవాల్ విసురుతున్న చైనాను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో అమెరికా అధినేతలు భారత్ వైపు చూస్తుంటారు. అదే సమయంలో భారత్ కు వ్యతిరేకంగా దాయాది దేశమైన పాకిస్తాన్ ను ముద్దు చేస్తుంటారు. కశ్మీర్ సమస్యపై కోరకుండానే మధ్యవర్తిత్వానికి సిద్దమవ్వడం ఇందుకు నిదర్శనం. అందువల్లే భారత్ కు వారు ఆశించిన మేరకు చేరువ కాలేక పోతున్నారన్న అభిప్రాయం దౌత్య వర్గాల్లో ఉంది.

పూర్తి స్థాయి స్నేహ సంబంధాలు…..

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య పూర్తి స్థాయి స్నేహ సంబంధాలు లేవు. అమెరికాకు అవసరార్థ స్నేహం కావడమే ఇందుకు కారణం. మోదీ – ట్రంప్ మధ్య ఇప్పటి వరకూ ఆరుసార్లు చర్చలు జరిగాయి. వివిధ సందర్భాల్లో వివిధ వేదికలపైన అధినేతలు ఇద్దరూ చర్చించుకున్నారు. భారత్ తమను విశ్వసించదన్న ట్రంప్ ఎత్తిపొడుపు మాటల వల్ల మనుషులు కలుస్తున్నారు తప్ప మనసులు కలవడం లేదు. ఇప్పుడు జరగబోయే సమావేశం ఏడోది. ఈసారైనా అపోహలు తొలిగి పోతాయన్న ఆశాభావం ఇరు దేశాల్లో వ్యక్తమవుతోంది. గత ఏడాది గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యేందుకు అంగీకరించని ట్రంప్ ఇప్పుడు ఎక్కడ లేని ఆసక్తిని కనపర్చడం వెనక తమ దేశ ప్రయోజనాలు, ముఖ్యంగా నవంబరు నెలలో జరిగే ఎన్నికల్లో దాదాపు 40 లక్షల మంది ప్రవాస భారతీయలు మద్దతు పొందడం ముఖ్యమైనవని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇప్పటికి ఆరుసార్లు…..

2016లో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి 2017 జూన్ నెలాఖరులో అమెరికాలో పర్యటించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే పర్యటన పరమోద్దేశ్యం. అప్పట్లో పోర్చుగల్, నెదర్లాండ్స్ తో పాటు మోదీ వాషింగ్టన్ ను సందర్శించారు. తొలిసారి జూన్ 26న ఆయన ట్రంప్ తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ పరిస్థితులను, ముఖ్యంగా ఆసియా పరిణామాలపై చర్చించారు. భారత్ – అమెరికా సంబంధాలు బలపడటం వల్ల కేవలం రెండు దేశాాలకే కాకుండా యావత్ అంతర్జాతీయ సమాజానికి ఉపయోగమని అప్పట్లో మోదీ వ్యాఖ్యానించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జూన్ 2, 26 తేదీల్లో మోదీ అమెరికా కంపెనీల సీఈఓలు, వాణిజ్య ప్రముఖలతో సమాలోచనలు జరిపారు. 2017 నవంబరు 12న ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో 15వ ఏసియాన్, 12వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ తో మోదీ సమావేశమయ్యారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ల్లో మారుతున్న పరిస్థితుల్లో భారత్ తో కలసి పనిచేయాలన్న అభిలాషను వ్యక్తం చేసిన నేపథ్యంలో ట్రంప్ తో జరిగిన సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో భారత్ కీలక పాత్ర పోషించాలని ట్రంప్ పేర్కొన్నారు. చైనా ను నిలువరించేందుకు ట్రంప్ ప్రతిపాదన వెనక గల అసలు లక్ష్యం. దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రాబల్యం పెరగడం వాషింగ్టన్ కు మింగుడుపడని పరిణామం.

మొహం మాడ్చుకుంటూనే…..?

ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో జీ-20 సదస్సు సందర్భంగా మూడోసారి ట్రంప్, మోడీల మధ్య మళ్లీ చర్చలు జరిగాయి. 2018 నవంబరు నెలాఖరులో జరగిన జీ-20 సదస్సులో మహిళ సాధికారికత, సుస్థిర అభివృద్ధి, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. 2019 జూన్ లో జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా “ఒసాకా” లో మళ్లీ ఇరు దేశాల అధినేతలు సమావేశమయ్యారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం, అనుసంధానం, అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తృతిపై అభిప్రాయాలను పంచుకున్నారు. గత ఏడాది ఆగస్టులో ఫ్రాన్స్ లో జరిగిన జీ- 7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోదీ, ట్రంప్ లు చర్చించుకున్నారు. కశ్మీర్ అంశం, భారత్-పాక్ ద్వైపాక్షిక సమస్య అని, అన్యుల జోక్యం ఎంత మాత్రం అవసరం లేదని తేల్చి చెప్పారు మోదీ. దీంతో ట్రంప్ మొహం మాడ్చుకున్నారు. గత ఏడాది సెప్టెంబరులో హ్యూస్టన్ లో జరిగిన “హౌడీ మోడీ” కార్యక్రమం విశేష ఆదరణ పొందింది. దీనికి ట్రంప్ హాజరయ్యారు. విశేష సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఇప్పటి భేటీ ఏడోది. దీనితో అద్భుతాలు ఏమీ జరగవు కానీ ఒకింత బంధాలు బలపడతాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News