ట్రంప్ కు ముందే తెలుసా? వంచించారా?

ఇప్పటికీ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ నకు ముందే తెలుసా, తెలిసే దాని తీవ్రతను తగ్గించి ప్రజలకు చెప్పారా, [more]

Update: 2020-09-24 16:30 GMT

ఇప్పటికీ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ నకు ముందే తెలుసా, తెలిసే దాని తీవ్రతను తగ్గించి ప్రజలకు చెప్పారా, ఈ అంశం ఎన్నికల్లో తనకు ప్రతికూలంగా మారుతుందని భయపడ్డారా, ఈ కారణంగానే ప్రజలు పెద్దయెత్తున ప్రాణాలు కోల్పోతున్నా ప్రేక్షకపాత్ర పోషించారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తుంది. అమెరికాలోని ప్రఖ్యాత దినపత్రికల్లో ఒకటైన ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం ఈ విషయాన్ని నిర్దిష్టంగా పేర్కొంటోంది. ప్రముఖ పాత్రికేయుడు రాబర్ట్ వుడ్ వార్ట్ కు ఫిబ్రవరి నెలలో ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్యూల్లో అధ్యక్షుడు ట్రంప్ కరోనా పై తన మనసులోని మాటను తేటతెల్లం చేశారు.

రాజకీయంగా ప్రకంపనలు….

ట్రంప్ ఇంటర్యూలతో కూడిన ‘రేజ్’అనే పుస్తకాన్ని రాబర్ట్ రచించారు. అది ఈనెల 15న విడుదలైంది. ఇందులోని ముఖ్యాంశాలను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. ఈ పత్రికా కథనం, ‘రేజ్’ పుస్తకంలోని విషయాలు వెలుగుచూసిన తరవాత అమెరికా సమాజంలో ఆందోళన, ఆవేశం, ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధినేత తమను వంచించారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు లక్షల మంది అమాయక ప్రజల మరణాలకు కారకుడయ్యారని , లక్షలాది మంది ప్రజలకు వైరస్ సోకడానికి కారకుడయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల పట్ల ఒక దేశాధినేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఈ అంశం రాజకీయంగా ప్రకంపనలు సష్టిస్తుంది. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని రిపబ్లికన్ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతుండగా, తమకు మేలు చేస్తుందని డెమొక్రటిక్ పార్టీ శ్రేణులు సంబర పడుతున్నాయి.

కరోనాను కట్టడి చేయడంలో….

రాజకీయాలను పక్కనపెడితే అమెరికా పేరు ప్రతిష్టలు అంతర్జాతీయంగా మంట కలిశాయి. అగ్రదేశమైనప్పటికీ వైరస్ ను అరికట్టడంలో విఫలమైందన్న విమర్శలు బలంగా వినిపించాయి. ప్రపంచాన్ని గడగడలాడించిన మహహ్మారిని అరికట్టి, అంతర్జాతీయంగా ఆదర్శంగా నిలబడాల్సిన అగ్రరాజ్యం ఇతర దేశాల మాదిరిగా బేలగా వ్యవహరించిందన్న అపఖ్యాతిని మూటగట్టుకుది. ఇది అమెరికాకే అవమానకరమన్న వ్యాఖ్యలు దేశం అంతటా వినపడుతున్నాయి. వైరస్ ను అరికట్టడంలో వైఫల్యంపై చైనా, రష్యా వంటి పెద్దదేశాలు లోలోన సంబరపడుతున్నాయి. రష్యా దీనికి సంబంధించిన వ్యాక్సిన్ ను తయారు చేసినప్పటికీ ఆ దిశగా తమ దేశం కనీసం ప్రయత్నించకపోవడంపై అమెరికా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.

చీకటి అధ్యాయానికి……

కరోనా గురించి ముందే తనకు తెలిసినప్పటికీ తన రాజకీయ ప్రయోజనాల కారణంగా ట్రంప్ దాని తీవ్రతను తగ్గించి చూపారు. వాస్తవాన్ని వివరిస్తే ఎన్నికల్లో తనకు ఎక్కడ దెబ్బ తగులుతుందోనన్న భయమే ఇందుకు కారణమని వెల్లడించారు. తన స్వార్థం కోసం వేలాది మంది ప్రజల మరణాలకు కారకుడయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి బాధ్యుడయ్యారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల ముందు దేశ ప్రయోజనాలు చిన్నవేనని చాటారు. ఒక సగటు రాజకీయ నాయకుడిగా వ్యవహరించి అగ్రరాజ్యం చరిత్రలో ఒక చీకటి అధ్యాయానికి కారకుడిగా నిలిచారు. చరిత్ర ఆయన తీరును ఎన్నటికీ క్షమించదు.రాబర్ట్ వుడ్ వార్ఢ్ చెప్పిన విషయాలు వింటుంటే కళ్లు తిరగక మానవు. ఒక నాయకుడు దేశ ప్రజల పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అన్న ప్రశ్న కలగక మానదు. కరోనా మహమ్మారి గురించి మార్చి 11నే ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా అంతర్జాతీయ సమాజానికి హెచ్చరించింది. అయితే అంతకు ముందే దీనిపై అధినేతకు రహస్య వర్గాలు సమాచారం ఇచ్చాయి. జనవరి 2న జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ సి.వొ. బ్రియాన్ విషయాన్ని వివరించారు.

తేలిగ్గా తీసుకోవడంతో…..

ఫిబ్రవరి 7న రాబర్ట్ వుడ్ వార్ట్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్ని ట్రంప్ అంగీకరించారు. అయినప్పటికీ ఆయన తేలిగ్గా తీసుకున్నారు. నియంత్రణ చర్యలు చేపట్టకుండా రాష్ట్రాలపై నెట్టేసి ఊరుకున్నారు. కనీసం లాక్ డౌన్ కూడా విధించలేదు. దీని వల్ల ఉత్పత్తి కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, ఇది ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని, అందుకే ప్రమాద తీవ్రతను తగ్గించి చూపానని ముఖాముఖిలో చెప్పారు. అంతేకాక చైనాపై, ప్రపంచ ఆరోగ్య సంస్థపై నెపం మోపారు. ఆయన అలసత్వం వల్ల దాదాపు రెండు లక్షల మంది విగత జీవులయ్యారు. సుమారు 70 లక్షల మందికి వైరస్ సోకింది. అగ్రరాజ్య చరిత్రలో ఇంతకన్నా విషాదఘటన మరొకటి ఉండదన్నది చేదునిజం. ఒక అధ్యక్షుడి అనాలోచిత చర్యకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News