డాక్టర్ సుధాకర్ చేసింది తప్పే….. అయినా?

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ గుర్తున్నాడుగా…. కరోనా రాగానే మాస్క్ లు కూడా లేవంటూ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, దానిని ప్రభుత్వ వ్యతిరేకత పెంచడంలో [more]

Update: 2020-05-17 03:30 GMT

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ గుర్తున్నాడుగా…. కరోనా రాగానే మాస్క్ లు కూడా లేవంటూ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, దానిని ప్రభుత్వ వ్యతిరేకత పెంచడంలో కింద మీద పడుతున్న ఛానల్ భుజాన వేసుకుని ఆయన సస్పెండ్ అయ్యేవరకు లైవ్ షో ల మీద షోలు నడిపి ఉద్యోగం పోయాక కళ్ళు చల్లబడి వేరే టాపిక్ వెదుక్కున్నాయి. ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన సమయంలో ఆయన మొదట మాజీ మంత్రి అయ్యన్న దగ్గరకు వెళ్లి టీడీపీ డైరెక్షన్ లో. విమర్శలు చేశారని ప్రభుత్వం ఆరోపించింది. ఈ పరస్పర విమర్శలు మెల్లగా సద్దుమణిగాక దాదాపు నెలన్నర తర్వాత ఆయన మళ్ళీ మీడియాలో ప్రత్యక్షం అయ్యాడు. కార్లో వస్తూ తాగి పడేసిన సిగరెట్ పీకలు జనం మీదకి విసిరి వాళ్ళతో కయ్యం పెట్టుకున్నాడు. అటుగా వచ్చిన పోలీసులతో వాగ్వాదం, దుర్భాషలు చివరకి పోలీసులు పెడ రెక్కలు విరిచి రోడ్డు మీద పడుకోబెట్టి నింపాదిగా ఆటో ఎక్కించుకుని తీసుకెళ్లారు.

రోడ్డు మీద హడావిడి చేసి….

ఈ మొత్తం ఘటనలో ప్రభుత్వ పెద్దల కక్ష సాధింపు ఉందా లేదా అన్నది పక్కన పెడితే, సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రభుత్వ వైద్యుడు ఒత్తిడిలోనో, మద్యం సేవించో, మానసిక సమతుల్యత దెబ్బతినో, ఉద్యోగానికి దూరమయ్యాననే ఆవేదనో ఏదొక కారణంతో రోడ్డున పడి ఉంటాడు. ఆయన స్థితిని అర్థం చేసుకోలేని సమాజం, పోలీస్ వ్యవస్థలో అంతర్లీనంగా కుల భావన మాత్రం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. డాక్టర్ సుధాకర్ ఎవరో విశాఖ ప్రజలకు ఖచ్చితంగా ఈ కరోనా సమయంలో తెలుసు. ప్రచార సాధనల్లో ఆయనకు అంత ప్రచారం లభించింది. ఆయన రోడ్డు మీద విచిత్రంగా ప్రవర్తిస్తూ కెమెరాలకు చిక్కేసరికి బలైపోయాడు. ఆయనను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులకు ఆయన సామాజిక హోదా ముందు ఆయన చదువు, ఉద్యోగం కనిపించలేదు. వీధిలో అల్లరి చేసే తాగుబోతు మాత్రమే కనిపించాడు. ఇదే అదనుగా నాలుగు తగిలించి సంతోష పడి ఉంటారు. ఆ తర్వాత మెరుపు వేగంతో ఆయన చేసిన హంగామా, దుర్భాషలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం అయ్యాయి. మొదట ఆయనను అదుపులోకి తీసుకున్న దృశ్యాలు వైరల్ అవ్వడంతో, పోలీసులు ప్రభుత్వం అప్రమత్తం అయ్యి ఆయన గొడవ పడే దృశ్యాలు బయటకు వదిలాయి. డాక్టర్ సుధాకర్ కి మద్దతుగా టీడీపీ అధినాయకుడు రంగంలోకి దిగితే, ఆయనకు వ్యతిరేకంగా అదే సామాజిక వర్గానికి చెందిన పాలక పార్టీ నేతలు రంగంలోకి దిగారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా…

ఈ మొత్తం వ్యవహారంలో మౌలిక ప్రశ్న ఏమిటంటే అభిప్రాయాలు డాక్టర్ సుధాకర్ కి అనుకూలంగా వ్యతిరేకంగా విడిపోవచ్చు. ఆయనను సమర్ధించే వారు, వ్యతిరేకించే వారు రెండు పక్షాలుగా మారిపోవచ్చు. కాకపోతే ఈ వ్యవహారంలో బాధితుడు లేదా నిందితుడు సామాజిక హోదా వల్ల, ఘటనపై ప్రజల మానసిక భావనలో పెద్దగా తేడా ఉండదు. ఆ వ్యక్తి చదువు, హోదా ఇవేమీ మిగిలిన అగ్రకుల వ్యక్తులకు మాదిరి అతనికి రక్షణ కల్పించవు. డాక్టర్ సుధాకర్ మొదటి తప్పు…. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఆయన వ్యక్తిగత రాజకీయ అభిప్రాయం కలిగి ఉండటం క్షమించరాని నేరం అయ్యింది. ఈ విషయలో మిగిలిన పాలక పక్షాలకు లభించే సహజ రక్షణ ఆయనకు లభించదు. ఇందుకు ఏ రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు సేవకులుగా ఉన్నంత వరకే వారికి రక్షణ లభిస్తుంది. కక్ష సాధింపు ఎదుర్కొని కష్టాలు పడటంలో దళితులే మొదటి బలి పశువులు అవుతారు. ఇలాంటి అవమానకర పరిస్థితి మిగిలిన కులాల వారికి ఎందుకు రాదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చర్యలను తప్పు పట్టడానికి మళ్ళీ అదే కులం వారిని ఉసిగొల్పుతుంటారు. గతంలో జూపూడి, వర్ల రామయ్య వంటి వాళ్ళు ఈ పాత్ర పోషిస్తే…, ఇప్పుడు మేరుగ నాగార్జున వంటి వారికి ఆ పాత్ర దక్కింది. ఇంకొంత మంది ఆర్టిస్ట్ లు నేటి నుంచి సుధాకర్ దుశ్చర్య మీద తీర్పు ఇవ్వడానికి గొంతు సవరించుకుంటు ఉంటారు. ఈ మొత్తం వ్యవహారంలో తక్కెట్లో పాత్రలు మాత్రమే మారతాయి తప్ప దళితుల తల రాతలు మారవన్నది అసలు సత్యం.

Tags:    

Similar News