ఓ.. పొలిటిక‌ల్ హిస్టరీ.. ఇక‌ చ‌దువుకోవడానికే?

డీఎల్ ర‌వీంద్రారెడ్డి. క‌డ‌ప జిల్లా మైదుకూరు నుంచి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ర‌వీంద్రారెడ్డి.. డాక్టర్ అయి.. త‌ర్వాత రాజ‌కీయంలోకి వ‌చ్చి త‌న‌నుతాను నిరూపించుకున్నారు. వివాద ర‌హితుడిగా, ఆలోచ‌నా [more]

Update: 2020-05-10 13:30 GMT

డీఎల్ ర‌వీంద్రారెడ్డి. క‌డ‌ప జిల్లా మైదుకూరు నుంచి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ర‌వీంద్రారెడ్డి.. డాక్టర్ అయి.. త‌ర్వాత రాజ‌కీయంలోకి వ‌చ్చి త‌న‌నుతాను నిరూపించుకున్నారు. వివాద ర‌హితుడిగా, ఆలోచ‌నా ప‌రుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. 1978 నుంచి రాజ‌కీయాల్లో ఉన్న ఆయ‌న ఇప్పుడు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ఆదిలో స్వతంత్ర అభ్యర్థిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన డీఎల్ ర‌వీంద్రారెడ్డి ఇండిపెండెంట్‌గానే మైదు కూరు నుంచి 1978లో విజ‌యం సాధించారు. త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. త‌ర్వాత కాంగ్రెస్‌లో ఉండ‌గా కూడా గెలుస్తూ వ‌చ్చారు.ప్రధానంగా నియోజ‌క‌వ‌ర్గంలో ఎంద‌రో పోటీకి వ‌చ్చినా డీఎల్ ర‌వీంద్రారెడ్డి ఏకంగా నాలుగు ద‌శాబ్దాలుగా తిరుగులేని రాజ‌కీయం చేశారు.

దశాబ్దకాలం నుంచి….

1989 నుంచి కూడా శెట్టిప‌ల్లి ర‌ఘురామిరెడ్డి వ‌ర్సెస్ డీఎల్ ర‌వీంద్రారెడ్డి అన్నట్టుగానే పోరు సాగింది. కాంగ్రెస్ త‌ర‌ఫున డీఎల్‌.. టీడీపీ త‌ర‌ఫున శెట్టిప‌ల్లి గతంలో పోటీ ప‌డి ఒక‌రిపై ఒక‌రు విజ‌యం సాధించారు. అయితే, టీడీపీలో ఉన్న శెట్టిప‌ల్లి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ, డీఎల్ ర‌వీంద్రారెడ్డి మాత్రం కాంగ్రెస్‌లో ఉండ‌గా ఓ వెలుగు వెలిగినా.. త‌ర్వాత మాత్రం ఆయ‌న హ‌వా కొడిగ‌ట్టింది. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనూ కిర‌ణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా డీఎల్ ర‌వీంద్రారెడ్డి వ్యవ‌హ‌రించారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్‌పై స‌వాల్ చేసి క‌డ‌ప ఉప ఎన్నిక‌ల్లో ఎప్పుడైతే ఓడిపోయారో అప్పటి నుంచే ఆయ‌న ప్రభ మ‌స‌క బారుతూ వ‌చ్చింది.

టీడీపీలో చేరాలనుకున్నా…

ఆ త‌ర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ గ‌ల్లంతైంది. దీంతో డీఎల్ ర‌వీంద్రారెడ్డి సైలెంట్ అయ్యారు. అయితే, త‌ర్వాత ఆయ‌న టీడీపీలో చేరేందుకు కొన్నాళ్లు ప్రయ‌త్నించారు. వైసీపీ నుంచి కూడా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే, ఆయ‌న ఎలాంటి నిర్ణయ‌మూ తీసుకోలేదు. వాస్తవానికి గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఆయ‌న పోటీ చేస్తార‌ని అనుకున్నారు. ఒకానొక ద‌శ‌లో చంద్రబాబు అప్పుడు టీటీడీ చైర్మన్‌గా ఉన్న పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు కాకుండా డీఎల్ ర‌వీంద్రారెడ్డికి టీడీపీ సీటు ఇవ్వాల‌ని కూడా అనుకున్నారు. అయితే అటు పుట్టా, య‌న‌మ‌ల నుంచి వ‌చ్చిన ఒత్తిడి నేప‌థ్యంలో బాబు పుట్టాకే సీటు ఇచ్చారు.

న్యూట్రల్ గానే ఉన్నా….

ఇక డీఎల్ ర‌వీంద్రారెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. కానీ, ప‌రోక్షంగా వైసీపీ అభ్యర్థి గెలుపున‌కు స‌హాయం చేశార‌నే వాద‌న ఉంది. ఇప్పుడు డీఎల్ ర‌వీంద్రారెడ్డి రాజ‌కీయంగా న్యూట్రల్‌గానే ఉన్నార‌ని అంటున్నారు. సుదీర్ఘమైన ఆయ‌న రాజ‌కీయ ప్రస్థానం లో మ‌ళ్లీ మెరుపులు క‌నిపిస్తాయా? అనేది మాత్రం ప్రశ్నార్థక‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ఓహిస్టరీగానే మిగిలిపోయార‌ని అంటున్నారు.

Tags:    

Similar News