ముసలం గ్యారంటీయా? మున్ముందు తప్పదా?

బీహార్ లో అధికారంలో ఉన్న జనాదళ్ యు లో అసంతృప్తి తలెత్తుతోంది. తమ అసంతృప్తి సొంత పార్టీపైన కాదు. మిత్రపక్షమైన బీజేపీమీదనే. ఇది ప్రస్తుతం అంటుకుంది. రానున్న [more]

Update: 2021-01-18 17:30 GMT

బీహార్ లో అధికారంలో ఉన్న జనాదళ్ యు లో అసంతృప్తి తలెత్తుతోంది. తమ అసంతృప్తి సొంత పార్టీపైన కాదు. మిత్రపక్షమైన బీజేపీమీదనే. ఇది ప్రస్తుతం అంటుకుంది. రానున్న కాలంలో మరింత పెరుగుతుందన్నది వాస్తవం. ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కమార్ ఉన్నప్పటికీ బీజేపీపై విశ్వాసంతో లేరు. బీజేపీతో కలసి తాను పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగలేనని ఆయన ఒక నిర్ధారణకు వచ్చినట్లుంది.

బీజేపీ వల్లనే…..

దీంతో పాటు జేడీయూ ఈసారి ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలను సాధించింది. దీనికి ప్రధాన కారణం బీజేపీయే నంటున్నారు ఓటమి పాలయిన నేతలు. ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తమ అసంతృప్తిని బీజేపీపై ఓటమిపాలయిన నేతలు బహిరంగంగానే వ్యక్తం చేశారు. తమ ఓటమికి ప్రధాన కారణం బీజేపీయేనని వారు నిందలు వేయడం గమనార్హం. తమ ఓటమికి బీజేపీ సహకరించకపోవడమేనని వారు చెబుతున్నారు.

చిరాగ్ వల్ల…..

వాస్తవానికి చిరాగ్ పాశ్వాన్ ఆధ్వర్యంలోని లోక్ జనశక్తి పార్టీ వల్ల ఓటమి పాలయిందని తొలుత అందరూ భావించారు. ఎల్జేపీ కేవలం జేడీయూ పోటీ చేసిన స్థానాల్లోనే బరిలోకి దిగింది. దీంతో తమను ఓడించానికి ఎల్జేపీ ప్రయత్నిస్తుందని భావించిన జేడీయూ నేతలు ఆ ఓటు బ్యాంకుపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ బీజేపీ ఓటు బ్యాంకు కూడా తమకు టర్న్ కాలేదని ఎన్నికల అనంతరం జరిగిన విశ్లేషణలో తేల్చారు.

ఎన్నికలకు ముందు నుంచే….

అసలు ఎన్నికలకు ముందే జేడీయూ నేతలకు బీజేపీపై నమ్మకం లేదు. లోక్ జనశక్తి పార్టీ బయటకు వెళ్లి తమపై పోటీ చేస్తామని ప్రకటించడం, అదే సమయంలో మోదీని, బీజేపీని చిరాగ్ పాశ్వాన్ పొగడటం వంటి వాటిపై బీజేపీ నేతలు పెద్దగా స్పందించలేదంటున్నారు. చిరాగ్ వల్ల నష్టం జరగలేదని, బీజేపీ వల్లనే తమకు ఎక్కువ నష్టం జరిగిందని వారు చెబుతున్నారు. బీజేపీ ఓటు బ్యాంకును లోక్ జనశక్తి పార్టీకి వెళ్లడంతోనే తాము ఓటమిపాలయ్యామంటున్నారు. మొత్తం మీద బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్ లో అవి మరింత ముదిరే అవకాశముంది.

Tags:    

Similar News