దినకరన్ కు ఇక దినదినగండమే

తమిళనాడులో దినకరన్ నాయకత్వంపై నమ్మకం లేకుండా పోయింది. వరసగా పార్టీ నుంచి నేతలు వీడుతుండటంతో దినకరన్ నష్ట నివారణ చర్యలకు దిగారు. జిల్లాల బాట పట్టారు. నేతలందరితో [more]

Update: 2019-09-06 18:29 GMT

తమిళనాడులో దినకరన్ నాయకత్వంపై నమ్మకం లేకుండా పోయింది. వరసగా పార్టీ నుంచి నేతలు వీడుతుండటంతో దినకరన్ నష్ట నివారణ చర్యలకు దిగారు. జిల్లాల బాట పట్టారు. నేతలందరితో సమావేశాలు జరుపుతూ శశికళ వచ్చిన తర్వాత అన్నాడీఎంకే తిరిగి తమ చేతుల్లోకి వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరన్ ను బహిష్కరించిన తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా ఆర్కే నగర్ ఉప ఎన్నికలో విజయం సాధించారు. జయలలిత పోటీచేసిన నియోజకవర్గం కావడం, అక్కడి నుంచి గెలవడంతో పార్టీ నేతలను తనను విశ్వసిస్తారని దినకరన్ భావించారు.

అనర్హత వేటు పడిన….

కానీ తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటు పడింది. వారిలో నమ్మకం కల్గించడంలోనూ దినకరన్ ఫెయిలయ్యారు. తర్వాత శశికళ సూచన మేరకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని స్థాపించారు. శశికళ ఆశీస్సులతోనే ఈ పార్టీని స్థాపించడంతో కొందరు నేతలు ఉత్సాహంగా చేరారు. అయితే ఈ పార్టీలోనూ పదవుల పంపకంపై శశికళ కుటుంబంలోనే విభేదాలు తలెత్తాయి. వాటిని నెమ్మదిగా పరిష్కరించుకోగలిగినా ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ దినకరన్ పార్టీ గెలవక పోవడం, డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడంతో నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లింది.

ఏ ఎన్నికల్లోనూ గెలవలేక….

ఉప ఎన్నికల్లోనూ వారిని గెలిపించుకోలేకపోయారు. తమిళనాడులో ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరిగిన తర్వాత లోక్ సభ, శాసనసభ ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించలేదు. దీంతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంనుంచి ముఖ్య నేతలే ఇతర పార్టీల వైపు వెళుతున్నారు. పార్టీలోని ముఖ్యనేతలైన సెంథిల్ బాలాజీ, తంగ తమిళ్ సెల్వన్ వంటి నేతలు ప్రతిపక్ష డీఎంకే లోకి వెళ్లిపోయారు. మరికొందరు కూడా అదే బాటలో ఉన్నారు. అన్నాడీఎంకేలోకూడా ఇదే సమస్య ఉండటంతో వారు డీఎంకేను ఎంచుకుంటున్నారు.

టార్గెట్ చేసిన స్టాలిన్…..

డీఎంకే అధినేత స్టాలిన్ సయితం చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా బలపడాలన్న ఉద్దేశ్యంతో పేరున్న నేత ఎవరు వచ్చినా స్టాలిన్ చేర్చుకోవాలని ముఖ్యనేతలను ఆదేశించారు. వీరికి దినకరన్ పార్టీయే టార్గెట్ గా మారింది. అన్నాడీఎంకే అధికారంలో ఉండటంతో ఇటువైపు వచ్చేందుకు అవకాశం లేదు. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ నుంచి వచ్చేందుకు నేతలెవరూ ఆసక్తి చూపడం లేదు. ఇక మిగిలింది దినకరన్ పార్టీ మాత్రమేకావడంతో దానిని ఖాళీ చేసే ఆలోచనలో ఉన్నారు స్టాలిన్. మొత్తం మీద మరో రెండు, మూడు నెలల్లో దినకరన్ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News