డీఎస్ వ్యూహం మార్చారా?

సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అంశం మరోసారి తెలంగాణలో చర్చనీయాంశమైంది. డి.శ్రీనివాస్ మొన్నటి వరకూ కాంగ్రెస్ లో చేరతారని భావించారు. ఆయన కొద్దికాలం క్రితం రాహుల్, సోనియాలను [more]

Update: 2020-12-21 11:00 GMT

సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అంశం మరోసారి తెలంగాణలో చర్చనీయాంశమైంది. డి.శ్రీనివాస్ మొన్నటి వరకూ కాంగ్రెస్ లో చేరతారని భావించారు. ఆయన కొద్దికాలం క్రితం రాహుల్, సోనియాలను కలవడంతో ఆయన కాంగ్రెస్ వైపు వెళతారని అందరూ భావించారు. అయితే రాజ్యసభ పదవి ఉండటంతో ఆయన చేరిక అధికారికంగా జరగలేదు. అయితే డీఎస్ తాజా రాజకీయ పరిణామాలతో డి.శ్రీనివాస్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా….

డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితిలోనే కొనసాగుతున్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత నుంచి కేసీఆర్ డి.శ్రీనివాస్ ను పూర్తిగా పక్కన పెట్టారు. తన కుమార్తె నిజామాబాద్ ఎంపీగా ఓటమి పాలు కావడం, డీఎస్ కుమారుడు అరవింద్ గెలవడం కూడా ఇందుకు కారణం. తన కుమారుడి కోసం కవిత ఓటమికి డి.శ్రీనివాస్ పరోక్షంగా సహకరించారని కేసీఆర్ భావించారు.

చర్యలు లేకపోవడంతో…

దీంతో పాటు డి.శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలందరూ ఏకంగా తీర్మానం చేసి కేసీఆర్ కు పంపారు. అయినా డి.శ్రీనివాస్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయనను సస్పెండ్ చేస్తే రాజ్యసభ పదవితో అధికారికంగా పార్టీ మారతారని కేసీఆర్ ఆయన విషయంలో చూసీ చూడనట్లు వదిలేశారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సానుకూలత లేదు. వరస ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ చెక్ పెట్టింది. బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి.

కాషాయ కండువా కప్పుకోవాలని….

ఈ నేపథ్యంలో డి.శ్రీనివాస్ బీజేపీలో చేరతారన్న ప్రచారం మళ్లీ జరుగుతుంది. ఆయన తన కుమారుడు ఉన్న పార్టీలోనే చేరాలని నిర్ణయించుకున్నారట. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎదగడానికి స్కోప్ ఎక్కువగా ఉండటంతో డి.శ్రీనివాస్ కాషాయం కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారని చెబుతున్నారు. బీజేపీలో చేరితే తన రాజ్యసభ పదవికి కూడా ఎలాంటి ముప్పు ఉండదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద డి.శ్రీనివాస్ తన మనసు మార్చుకుని బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News