ధర్మం దారి తప్పినట్లు కనపడుతుందే

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు అంటే ధర్మాత్ముడు అని అంతా అంటారు. ఆయన ఏది చెప్పిన్న ధర్మంగా ఉంటుందని నమ్మించేలా చెబుతారని సెటైర్లు ఉన్నాయి. కాంగ్రెస్ [more]

Update: 2020-03-08 03:30 GMT

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు అంటే ధర్మాత్ముడు అని అంతా అంటారు. ఆయన ఏది చెప్పిన్న ధర్మంగా ఉంటుందని నమ్మించేలా చెబుతారని సెటైర్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఏలుబడిలో తన పలుకుబడి పెంచుకుని పలుమార్లు ఎమ్మెల్యేగా, వివిధ మంత్రిత్వ శాఖలను చూసిన అమాత్యునిగా ధర్మాన ప్రసాదరావు పెద్ద కీర్తినే గడించారు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నపుడు జగన్ ని నానా మాటలూ అన్నారు. భవిష్యత్తు రాజకీయం అర్ధం చేసుకోలేక అలా చెలరేగిపోయారని అంటారు. ఆ తరువాత విభజన సమయంలో వైసీపీ గూటికి చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసినా క్యాడర్ సహకరించక ఓటమిపాలు అయ్యారు.

నాడు అలా…

ఆ ఎన్నికల్లో వైసీపీ కూడా గెలవలేదు కాబట్టి కొంత ఫరవాలేదనిపించి ఉంటుంది. ఇక జిల్లా రాజకీయాల్లో నాడు ధర్మాన ప్రసాదరావు తన వంతు పాత్రను సరిగ్గా పోషించలేదన్న విమర్శలూ ఉన్నాయి. ఆయన అన్న గారు క్రిష్ణ దాస్ కే జగన్ కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో మండిన ధర్మాన ప్రసాదరావు అడపా దడపా జగన్ మీదనే వ్యంగ్య బాణాలూ వేస్తూ వచ్చారు. ఒకసారి అయితే జగన్ పులివెందుల నుంచి గెలవడం కాదు, శ్రీకాకుళం వచ్చి గెలిచి చూడమంటూ పెద్ద సవాల్ కూడా చేశారు. అది జగన్ చెవిన పడి సీరియస్ యాక్షన్ దాకా కధ నడిచింది కానీ తరువాత ధర్మాన ప్రసాదరావు వివరణ ఏదో ఇచ్చుకోవడంతో అంతటితో వ్యవహారం సద్దుమణిగింది.

మాజీగానే…..?

ఇక వైసీపీ బంపర్ మెజారిటీతో గత ఏడాది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. నేనే రాజూ, నేనే మంత్రి అనుకుంటూ ధర్మాన ప్రసాదరావు మురిసిపోయినంతసేపూ పట్టలేదు అది ఆవిరి కావడానికి. అలా చూస్తుండగా అన్నగారు మంత్రి కుర్చీ ఎక్కేశారు. ధర్మాన ప్రసాదరావు మాజీగానే మిగిలారు. ఆ అసంతృప్తి అలా కట్టలు తెంచుకుంటూనే ఉంది. అయినా ఏం చేయలేని నిస్సహాయతో పెద్దాయన నిర్లిప్తంగా గడుపుతున్నారు. అక్కడికీ అసెంబ్లీలో జగన్ ని పొగిడి మరీ ఎంతగానో చేరువ కావాలని చూస్తున్నా అధికార పీఠం మాత్రం అక్కున చేర్చుకోవడంలేదు.

వారి గొంతుకగా……

ఇదిలా ఉండగా శ్రీకాకుళంలో వైసీపీ కార్యకర్తల మీటింగ్ ఈ మధ్య జరిగింది. ఈ మీటింగులో కొంతమంది కార్యకర్తలు తమకు వైసీపీ సర్కార్ లో ఏ పదవులూ దక్కలేదని అసంతృప్తిని వెళ్ళగక్కారు. దానికి మంత్రి క్రిష్ణదాస్ బదులిస్తూ ప్రభుత్వం సమర్ధంగా పనిచేస్తోందని, అనేక పధకాలు అమల్లో పెడుతోందేని అది గర్వకారణంగా తీసుకోవాలని సూచించారు. కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే అదే సభలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కార్యకర్తలకు తీరని అన్యాయం జరిగిందని ప్రకటించడం విశేషం. తాను దాన్ని అంగీకరిస్తున్నానని అనడం ద్వారా వారికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం పెద్ద చర్చకు దారితీస్తోంది. ధర్మాన ప్రసాదరావు సైతం అసంతృప్తిగా ఉన్నారు. ఆయన తన బాధ వారిలో చూసుకున్నారని అంటున్నారు. ఓ విధంగా జగన్ కి వ్యతిరేకంగానే ఈ వ్యాఖ్యలను చూస్తున్నారుట. మరి ధర్మాన ప్రసాదరావు దావాలనలం ఇలా పెల్లుబుకిందా అని కూడా అంటున్నారు. చూడాలి మరి పెద్దాయన‌ మరెంత దూరం వెళ్తారో.

Tags:    

Similar News