అందులోనే ఆనందం చూసుకుంటున్నారా?

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పుట్టిన రోజు ఈసారి కూడా ఆన్ లైన్ లోనే సాగింది. నిజానికి కరోనా వేళ [more]

Update: 2021-06-05 13:30 GMT

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పుట్టిన రోజు ఈసారి కూడా ఆన్ లైన్ లోనే సాగింది. నిజానికి కరోనా వేళ ఆర్భాటంగా జరుపుకునే పరిస్థితులు అయితే లేవు. గత ఏడాది మొదటి దశ కరోనాతో ఎవరూ తనను కలవవద్దంటూ ధర్మాన విన్నవించుకున్నారు. ఈసారి కూడా సెకండ్ వేవ్ తో ధర్మన ఇంట్లోంచి అసలు బయటకు రాలేదు. అయితే మాత్రం అభిమానం ఊరుకుంటుందా. ఆన్ లైన్ లో ఆయన ఫోటోలు పెట్టి మరీ అనుచరులు విషెస్ చెప్పారు. ఇక మీడియాలో కూడా ధర్మాన ప్రసాదరావు ప్రకటనలతో హోరెత్తించారు. మొత్తానికి మాజీ మంత్రిని బాగా ఆనందమే కలిగించారు.

బిరుదులే పదవులు …

ఇక ధర్మాన ప్రసాదరావుని అభిమానులు ఒక్క లెక్కన పొగిడారు. శ్రికాకుళం జిల్లాకు నీటి ప్రాజెక్టులు తెప్పించిన అపర భగీరధుడు అన్నారు. చాణక్యుడు అని కితాబు ఇచ్చారు. సమర్ధ నేత, మంత్రిగా మచ్చలేని నాయకుడు అని కూడా కీర్తించారు. ఆయన ఒక్కడు చాలు సిక్కోలుకు ఆణిముత్యం అంటూ కవితలూ వల్లె వేశారు. నిజానికి ప్రసాదరావుకు ఇప్పటికీ అనుచర గణమే బలం. ఆయన దాదాపుగా ఎనిమిదేళ్ళుగా ఏ పదవీ లేకుండా ఉన్నా కూడా అనుచరులు మాత్రం అదే రకమైన ప్రేమను చూపించడం విశేషమే.

అర్ధమైందా …?

ఇప్పటిదాకా రాజకీయ సమీకరణలు మారుతాయని, ఏదో రోజున తమ నేతకు మంత్రి పదవి వస్తుంది అని అనుచరులలో ధీమా ఉండేది. అందుకే రాబోయే కాలానికి కాబోయే మంత్రి అంటూ అప్పట్లో ప్రకటనలు వచ్చేవి. కానీ ఇపుడు మాత్రం అలాంటివేవీ లేవు. భవిష్యత్తుని పక్కన పెట్టి ఆయన గతంలో సాధించిన విజయాలు, అలంకరించిన పదవులే పెద్ద జాబితాను తయారు చేసి ప్రకటనలు ఇచ్చేశారు. ఆయన లాంటి నిజాయతీపరుడు మరొకరు ఉండరు అంటూ కూడా అనుచరులు వీరాభిమానమే ఉప్పొగించారు. దీన్ని బట్టి చూస్తే ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి అందని పండు అన్న సంగతి క్యాడర్ కి కూడా అర్ధమైంది అంటున్నారు.

గత కాలం మేలు..?

ధర్మాన ప్రసాదరావుకూడా ఒకింత వేదాంతాన్ని వంటబట్టించుకున్నారట. ఇక తన క్రియాశీల రాజకీయ జీవితానికి స్వస్తి అంటున్నట్లుగా చెబుతున్నారు. తన వారసుడిగా రామ్మోహననాయుడుని జనం ముందు పెట్టారు. ఆయనకు ఉన్న ఆశ ఒక్కటే. తన శ్రీకాకుళం ఎమ్మెల్యే సీటుని కుమారుడిని జగన్ తప్పకుండా ఇస్తారని, ఆ విధంగా 2024 నాటికి కొడుకుని ఎమ్మెల్యేగా చూసుకుని రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడదామని ఉందిట. అందుకే ఆయన అసంతృప్తి వంటి వాటిని దాటి ఇపుడు స్థిమితంగా ఉంటున్నారు అని చెబుతున్నారు. జగన్ కచ్చితంగా సీనియర్లను, వయసు మీరిన వారిని పదవులలో తీసుకోరు. దాంతో యువ రక్తంగా ఉన్న కుమారుడిని ముందు పెట్టి తాను తప్పుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రతీ పుట్టిన రోజుకూ ఎవరికైనా వయసు పెరుగుతుంది. దాంతో పాటు ధర్మాన ప్రసాదరావుకు మరింతగా మేధస్సు కూడా పెరిగి తానేంటి అన్నది బాగా అర్ధమవుతోంది అంటున్నారు.

Tags:    

Similar News