పెద్దోళ్లకు బాగానే ఫిట్టింగ్ పెట్టారుగా…!!!

దేవెగౌడ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదా? కుటుంబ పార్టీగా ముద్రపడిన జనతాదళ్ ఎస్ ను మరింతగా అదే తరహా చూపించేందుకు సిద్ధపడిన దళపతికి ఈసారి కన్నడ [more]

Update: 2019-03-26 17:30 GMT

దేవెగౌడ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదా? కుటుంబ పార్టీగా ముద్రపడిన జనతాదళ్ ఎస్ ను మరింతగా అదే తరహా చూపించేందుకు సిద్ధపడిన దళపతికి ఈసారి కన్నడ ప్రజలు షాకిస్తారా? ఒకవేళ అనుకోనిదేదైనా జరిగితే జనతాదళ్ ఎస్ పరిస్థితి ఏంటి? కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి పదవికే ఈ ఎన్నికలు ఎసరు పెడతాయా? అనుకున్నట్లు అంతా జరిగితే ఓకే. కానీ బొమ్మ తిరగబడితేనే ప్రమాదం. ఇదీ జనతాదళ్ ఎస్ నేతలకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. కన్నడ నాట లోక్ సభ ఎన్నికలు జేడీఎస్ నేతలకు బీపీని పెంచుతున్నాయి.

ఇద్దరికీ సవాలే…..

కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు కలసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే వారికే ఎడ్జ్ ఉంటుంది. రెండు పార్టీలకూ బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉండటమే దీనికి కారణం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. బీజేపీ కూడా బలంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థి పార్టీల బలం, బలగం చూసి బీజేపీకి నిన్న మొన్నటి వరకూ కొన్ని అనుమానాలు అయితే లేకపోలేదు. గత ఎన్నికల్లో సాధించిన 17 సీట్లు సాధిస్తే చాలన్నది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప లక్ష్యం. యడ్యూరప్ప కు కూడా ఈ ఎన్నికలు సవాల్ గా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధిస్తేనే ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. నాయకత్వ పగ్గాలు కూడా ఆయన చేతిలోనే ఉంటాయి.

ఇక్కడ గెలవకుంటే…?

తాజాగా జరుగుతున్న పరిణామాలు దేవెగౌడ పార్టీకి కొంత ఇబ్బందిగా మారగా, బీజేపీకి సానుకూలత పెరుగుతోందంటున్నారు. ముఖ్యంగా దేవెగౌడ కుటుంబ సభ్యులను ఓడిస్తే చాలు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరినట్లేనన్నది యడ్యూరప్ప భావన. ఇందుకోసం అన్ని రకాల వ్యూహాలు పన్ను తున్నారు. మాండ్య నియోజకవర్గంలో దేవెగౌడ మనవడు, కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడకు స్వతంత్ర అభ్యర్థి సుమలత గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక్కడ బీజేపీ సుమలతకే మద్దతివ్వాలని నిర్ణయించి తన వ్యూహాన్ని బయటపెట్టింది. కాంగ్రెస్ క్యాడర్ కూడా నిఖిల్ కు సహకరించే పరిస్థితి లేదు. ఇప్పుడు మాండ్య నుంచి మనవడిని గెలిపించుకోవాల్సిన పరిస్థితి దేవెగౌడకు ఉంది.

ఇది కూడా గట్టి పోటీనా..??

అలాగే హాసన్ నియోజకవర్గం దేెవెగౌడకు పట్టున్న ప్రాంతం. అయినా ఇక్కడా ఎదురుగాలులు వీస్తున్నాయంటన్నారు. హాసన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎ. మంజు పార్టీకి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. హాసన్ కు పట్టున్న దేవెగౌడ కాకపోవడంతో కొంత ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్లి బీజేపీ తరుపున బరిలోకి దిగిన మంజుకు కాంగ్రెస్ క్యాడర్ సహకరించే అవకాశముంది. దీంతో రెండు స్థానాల్లో దేవెగౌడకు దబిడి దబిడి తప్పేలా లేదు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం పరోక్షంగా దేవెగౌడ కుటుంబ సభ్యుల ఓటమికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు జేడీఎస్ లో లేకపోలేదు. మొత్తం కర్ణాటక లో లోక్ సభ ఎన్నికలు ఇటు దేవెగౌడ, అటు యడ్యూరప్ప రాజకీయ భవిష్యత్తుకు సవాల్ గా మారాయి.

Tags:    

Similar News