దడ పుడుతున్నట్లుందే…!!

దళపతి దేవెగౌడకు దడపుట్టుకుంది. ఏడు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఎన్నింటిలో గెలుస్తామన్న క్లారిటీ లేదు. ముఖ్యంగా తమ కుటుంబం పోటీ చేసిన నియోజకవర్గాల్లో సయితం [more]

Update: 2019-04-27 18:29 GMT

దళపతి దేవెగౌడకు దడపుట్టుకుంది. ఏడు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఎన్నింటిలో గెలుస్తామన్న క్లారిటీ లేదు. ముఖ్యంగా తమ కుటుంబం పోటీ చేసిన నియోజకవర్గాల్లో సయితం ఎదురుగాలి వీచినట్లు పోలింగ్ అనంతరం అంచనాకు వచ్చారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలను అటుంచితే… ఫలితాల తర్వాత జరగబోయే రాజకీయ పరిణామాలు పెద్దాయనకు ఊపిరి సలపనివ్వడం లేదు. భారతీయ జనతా పార్టీ కాచుక్కూర్చుని ఉంది. ఫలితాలు వచ్చిన వెంటనే సంకీర్ణ సర్కార్ ను సాగనంపుదామని బీజేపీ నేతలు ఇప్పటికే భీషణ ప్రతిజ్ఞలు చేసిపారేస్తున్నారు. దీంతో దేవెగౌడ పార్టీ నేతలు, ముఖ్యలతో సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఫిర్యాదులతో…

కర్ణాటకలో ఎన్నికలు ముగిశాయి. కొన్ని చోట్ల పోలింగ్ శాతం భారీగా పెరిగింది. జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలసి పోటీ చేయడంతో ఈసారి కర్ణాటకలో క్లీన్ స్వీప్ చేసి పారేయొచ్చనుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రెండు పార్టీల నేతలు అనుకున్నట్లు జరగలేదన్నది పోలింగ్ తర్వాత కూడా స్పష్టంగా తెలుస్తోంది. అనేక నియోజకవర్గాల నుంచి రెండు పార్టీల అధిష్టానానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా మాండ్య, తుముకూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తమకు సహకరించలేదన్నది జేడీఎస్ ఆరోపణగా విన్పిస్తుంది. సహకరించకపోయినా ఎటువంటి చర్యతీసుకోకపోవడంపై దేవెగౌడ గుర్రుగా ఉన్నారు.

తమ స్థానాల్లోనూ….

మాండ్యలో తన మనవడు నిఖిల్ గౌడ గెలుస్తారని భావిస్తున్నాలోలోపల అనుమానం అయితే దేవెగౌడకు లేకపోలేదు. అందుకే మాండ్య లో పార్టీ బాధ్యులందరితో దేవెగౌడ ప్రత్యేకంగా సమావేశమై పోలింగ్ సరళిపై చర్చించారు. వారంతా నిఖిల్ గౌడ గెలుపు పై ధీమా వ్యక్తం చేయడంతో కొంత శాంతించారు. ఇక తుముకూరులో తాను స్వయంగా పోటీ చేసినా కొందరు కాంగ్రెస్ నేతలు సహకరించలేదన్నది ఆయన స్వయంగా గుర్తించారు. దీనిపై రాహుల్ గాంధీతో చర్చించాలని నిర్ణయించారు. పార్టీపై కొద్దికాలంలోనే వచ్చిన వ్యతిరేకతపై దేవెగౌడ ఆందోళనగాఉన్నట్లుకన్పిస్తోంది.

సర్కార్ కు సమస్య వస్తే…?

ఇక లోక్ సభ ఎన్నికల అనంతరం బీజేపీ ఖచ్చితంగా ఆపరేషన్ కమల్ కు తెరతీస్తుంది. గతంలోనే జేడీఎస్ నేతలు కొందరు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ముఖ్యమంత్రి కుమారస్వామి సేకరించారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా లోపాయికారీగా తమ కుటుంబ సభ్యుల ఓటమికి కృషి చేసినట్లు దేవెగౌడ అనుమానిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతే ఏం చేయాలన్న దానిపైనా ఆదివారం జరగనున్న జనతాదళ్ ఎస్ సమావేశంలో చర్చించనున్నారు. మొత్తం మీద దేవెగౌడ మాత్రం సంకీర్ణ సర్కార్ సక్రమంగా కొనసాగే అవకాశాలు లేవని మాత్రం బలంగానే నమ్ముతున్నట్లుంది.

Tags:    

Similar News