పెద్దాయన పేచీ పెడితే…??

కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ ల సీట్లు తకరారు లేకుండా ఖరారవుతాయా? లోక్ సభ ఎన్నికలు మళ్లీ ఆ పార్టీల మధ్య చిచ్చురేపుతాయా? అన్నది సందేహంగా మారింది. ముఖ్యంగా [more]

Update: 2019-02-20 17:30 GMT

కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ ల సీట్లు తకరారు లేకుండా ఖరారవుతాయా? లోక్ సభ ఎన్నికలు మళ్లీ ఆ పార్టీల మధ్య చిచ్చురేపుతాయా? అన్నది సందేహంగా మారింది. ముఖ్యంగా జనతాదళ్ అధినేత దేవెగౌడ పేచీల మీద పేచీలు పెడుతున్నారు. ఆయన హస్తినలో తిష్టవేసి జాతీయ రాజీకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలనుకుంటున్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలోనూ అత్యధిక స్థానాలను జేడీఎస్ తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే దేవెగౌడ కాంగ్రెస్ అధిష్టానాన్ని కలసి సీట్ల విషయంలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేసినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి సీట్ల సర్దుబాటు అంశాన్ని పెద్దాయనకే వదిలేశారు.దేవెగౌడ స్థాయి లాంటి వ్యక్తి సీట్ల పంపకంలో నేరుగా జోక్యం చేసుకుంటుడటంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు టెన్షన్ పడుతున్నారు.

అత్యధిక స్థానాలను కోరుతూ….

కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ స్థానాలున్నాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రెండు పార్టీలూ కలసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించాయి. అయితే సీట్ల పంపకం దగ్గరకు వచ్చేసరికి తేడా కొడుతుంది. దేవెగైడ తన పార్టీకి పన్నెండు స్థానాలను కోరుకుంటున్నారు. ఆరింటికి మించి ఇచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ నేతలు కుండబద్దలు కొడుతున్నారు. దేవెగౌడ ఈసారి తాను ప్రాతినిధ్యం వహించిన హాసన్ నియోజకవర్గం నుంచి కాకుండా బెంగళూరు ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. హాసన్ నుంచి మనవడు ప్రజ్వల్ ను పోటీ చేయించాలని భావిస్తున్నారు. అయితే దేవెగౌడ ఇక్కడి నుంచి పోటీ చేస్తే అంగీకరిస్తాము కాని, వేరొకరు నిలబడితే తాము బరిలో ఉంటామని కాంగ్రెస్ నేత ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

కుదరదంటున్న లోకల్ నేతలు….

ఇప్పటికే తమకు అత్యధిక స్థానాలు వచ్చినా తక్కువ స్థానాలు వచ్చిన జేడీఎస్ కు పట్టం కట్టామన్న ఆవేదనతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు ఉన్నారు. ఉప ఎన్నికల్లో కలసి పోటీ చేయడం వల్ల సత్ఫలితాలు రావడంతో ఈసారికూడా అదే ఫార్ములాతో వెళ్లాలని హస్తం పార్టీ అధిష్టానం గట్టిగా హెచ్చరించింది. దీంతో కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. హాసన్, మైసూరు, మాండ్య, రామనగర, చామరాజనగర, తుమకూరు స్థానాలను మాత్రమే జనతాదళ్ ఎస్ కు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత చూపుతోంది. ఇదే విషయాన్ని అధిష్టానానికి నివేదిక రూపంలో పంపంది.

బుజ్జగింపుల్లో సిద్ధూ….

మిగిలిన నియోజవకర్గాల నేతలతో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశమవుతున్నారు. సీట్ల విషయంలో తేడా వచ్చినా సర్దుకుపోవాలని వారికి సూచిస్తున్నారు. అయితే చాలా మంది నేతలు తమ అసంతృప్తిని సమావేశాల్లోనే వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల విషయంలనూ అన్యాయం జరిగిందని, లోక్ సభ ఎన్నికల్లో అలా చేస్తే సహకరించమని తెగేసి చెప్పేస్తున్నారు. 28 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు కలసి కనీసం 20 స్థానాలను గెలిచే లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే పొత్తుల్లో తేడా వస్తే రెండు పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి తక్కువేనని చెప్పాలి. మొత్తం మీద కర్ణాటకలో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు మరో సమస్యగా మారింది.

Tags:    

Similar News