అంత వైరాగ్యం ఎందుకో?

మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ దేవెగౌడకు రాజకీయ వైరాగ్యం పట్టుకున్నట్లుంది. ఆయన ఇక ప్రత్యక్ష్య, పరోక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుంది. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఇక [more]

Update: 2020-01-14 18:29 GMT

మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ దేవెగౌడకు రాజకీయ వైరాగ్యం పట్టుకున్నట్లుంది. ఆయన ఇక ప్రత్యక్ష్య, పరోక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుంది. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఇక రాజకీయంగా ఏ పదవులను ఆయన తీసుకోరన్నదే ఖాయంగా కన్పిస్తుంది. దేవెగౌడ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు కూడా లేకపోలేదు. కర్ణాటకలో జేడీఎస్ ఇటీవల కాలంలో కష్టాలను ఎదుర్కొంటోంది.

క్యాడర్ చెల్లా చెదురు….

పార్టీ క్యాడర్ చెల్లాచెదురయింది. ఓటు బ్యాంకు కూడా అనేక చోట్ల దెబ్బతినింది. ఇది కాంగ్రెస్ తో పొత్తువల్లనేనని దేవెగౌడ భావిస్తున్నారు. ఆయన ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తుముకూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన మనవడు నిఖిల్ గౌడ కూడా మాండ్య నుంచి బరిలోకి దిగి దెబ్బతిన్నారు. దేవెగౌడ కుటుంబానికి, పార్టీకి పట్టున్న ప్రాంతంలోనే ఓటమి పాలు కావడంతో ఆయన తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని గతంలో ప్రకటించారు.

కుటుంబ పార్టీగా….

ప్రధానంగా కుటుంబ పార్టీగా ముద్రపడటం, అధికారంలో ఉన్న పార్టీ వైపు నమ్మకంగా ఉన్న నేతలే వెళ్లిపోవడం దేవెగౌడకు బాధ కల్గించిందంటున్నారు. మరోసారి పోటీ చేసి భంగపడేకంటే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి దేవెగౌడ వచ్చారు. అందుకోసమే ఆయన ఇటీవల జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ తాను ఇకపై ఏ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ముందు క్యాడర్ ను, ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసమే దేవెగౌడ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతోంది.

రాజ్యసభకు నో….

నిజానికి దేవెగౌడ రాజ్యసభకు వెళ్లమని కుటుంబం నుంచి పార్టీ నుంచి వత్తిడి వస్తుంది. త్వరలో కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఖాళీ అయ్యే స్థానంలో జేడీఎస్ రాజ్యసభ పదవి కూడా ఉంది. దీంతో దేవెగౌడ పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ తనకు రాజ్యసభ పదవి వద్దని దేవెగౌడ స్పష్టం చేశారు. తాను పార్టీ కోసమే పనిచేస్తానని ఎలాంటి పదవులు అవసరం లేదని ఆయన స్పష్టం చేయడంతో ఇక దేవెగౌడ ప్రత్యక్ష్య, పరోక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లే. వయసు కూడా మీద పడటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుంది.

Tags:    

Similar News