అసలు ప్లాన్ అదేనటగా

కర్ణాటకలో ఎప్పుడూ జనతాదళ్ ఎస్ సొంతంగా అధికారంలోకి రాలేదు. అది ఒక ప్రాంతానికే పరిమితమైన ప్రాంతీయ పార్టీగా చెప్పుకోవాల్సిందే. ఏదో ఒక పార్టీతో ఎన్నికల అనంతరం పొత్తు [more]

Update: 2019-08-25 18:29 GMT

కర్ణాటకలో ఎప్పుడూ జనతాదళ్ ఎస్ సొంతంగా అధికారంలోకి రాలేదు. అది ఒక ప్రాంతానికే పరిమితమైన ప్రాంతీయ పార్టీగా చెప్పుకోవాల్సిందే. ఏదో ఒక పార్టీతో ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిందే తప్ప సొంతంగా జనతాదళ్ ఎస్ గట్టెక్కలేదనే చెప్పాలి. కాంగ్రెస్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న దేవెగౌడ ఇప్పుడు మరొక పార్టీతో పొత్తు పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు. అయితే దేవెగౌడ ఆలోచన వేరే విధంగా ఉందంటున్నారు.

టార్గెట్ సిద్దూ…..

దేవెగౌడ టార్గెట్ అంతా సిద్ధరామయ్య మాత్రమే. తన పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకుని, తనకే ధమకీ ఇచ్చి కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య అంటే దేవెగౌడ కు తొలి నుంచి పడదు. సిద్ధరామయ్యకు 2004లో ముఖ్యమంత్రి పదవి దక్కాల్సి ఉన్నా దేవెగౌడ కావాలని తనకు ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టారని సిద్ధరామయ్య వ్యాఖ్యలు ఒకరకంగా నిజమనే చెప్పాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులను తప్పించి మరొకరిని దేవెగౌడ ఎదగనివ్వరన్నది మాత్రం కన్నడనాట అందరికీ తెలిసిందే.

పొత్తులతోనే కాలక్షేపం….

2008లోనూ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కుమారస్వామి తర్వాత మాట తప్పారు. రెండున్నరేళ్లు పదవీకాలం విషయంలో యడ్యూరప్ప కు ఝలక్ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ తో మరోసారి పొత్తు పెట్టుకుని ధరమ్ సింగ్ ను ముఖ్యమంత్రిని చేసి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఇలా కింగ్ మేకర్ అని భావిస్తూ దేవెగౌడ వరసగా పొత్తులతో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

యాక్షన్ తీసుకుంటే….

ఇక కర్ణాటకలో కాంగ్రెస్ మినహా దేవెగౌడకు వేరే దిక్కులేదు. అయితే కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర స్థాయి నేతలతో దేవెగౌడకు పెద్దగా ఇబ్బంది లేదు. కేవలం సిద్ధరామయ్యతోనే. సిద్ధరామయ్యకు పార్టీలో చెక్ పెట్టాలన్నది దేవెగౌడ వ్యూహంగా కన్పిస్తుందంటున్నారు. అందుకోసమే సిద్ధరామయ్యను టార్గెట్ చేశారని చెబుతున్నారు. సిద్ధరామయ్య పై హైకమాండ్ యాక్షన్ తీసుకుంటే కాంగ్రెస్ పై మళ్లీ దేవెగౌడ ప్రేమ ఒలకబోసే అవకాశముంది. మల్లికార్జున ఖర్గే, వీరప్పమొయిలీ లాంటి నేతలతో దేవెగౌడ టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద దేవెగౌడ మెయిన్ టార్గెట్ సిద్ధరామయ్య మాత్రమేనని చెబుతున్నారు.

Tags:    

Similar News