డిఎస్ రిటైర్మెంట్ ప్రకటించినట్లేనా?

ధర్మపురి శ్రీనివాస్ ప్రస్తుతం అధికారికంగా టీఆర్ఎస్ లోనే ఉన్నారు. డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పార్టీ ఆయనను పట్టించుకోవడం ఎప్పుడో మానేసింది. అలాగే డి.శ్రీనివాస్ కూడా [more]

Update: 2021-03-31 11:00 GMT

ధర్మపురి శ్రీనివాస్ ప్రస్తుతం అధికారికంగా టీఆర్ఎస్ లోనే ఉన్నారు. డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పార్టీ ఆయనను పట్టించుకోవడం ఎప్పుడో మానేసింది. అలాగే డి.శ్రీనివాస్ కూడా పార్టీని పట్టించుకోవడం మానేసి చాలా కాలం అయింది. అయితే డి.శ్రీనివాస్ తొలుత తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని భావించారు. కాంగ్రెస్ ను వీడి తప్పు చేశానని డి.శ్రీనివాస్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది.

వరస ఓటములతో…..

అయితే వరస ఓటములతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ లోకి వెళ్లి డి.శ్రీనివాస్ చేయగలిగింది ఏమీ లేదు. వయసుతో పాటు పార్టీ నేతలు కూడా సహకరించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఇక తెలంగాణలో కోలుకోవడం కష్టంగానే ఉంది. ఈ వయసులో కాంగ్రెస్ లోకి వెళ్లి చేయగలిగింది ఏమీ లేదన్న భావనకు డీఎస్ వచ్చారట. ఆ మధ్య డి.శ్రీనివాస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలవడంతో ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమనుకున్నారు.

బీజేపీలో చేరాలని….

కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీయే బెటర్ అని డి.శ్రీనివాస్ భావిస్తున్నారు. తాను ఇక రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుని తనయుడు ధర్మపురి అరవింద్ భవిష్యత్ ను తీర్చిదిద్దాలన్నది డి.శ్రీనివాస్ లక్ష్యంగా కన్పిస్తుంది. ఇప్పటికే అరవింద్ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. తెలంగాణలో కరీంనగర్ తర్వాత నిజామాబాద్ లో బీజేపీ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీలో ఎలాంటి పదవులు చేపట్టకున్నా ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు డి.శ్రీనివాస్ సిద్ధమయ్యారని చెబుతున్నారు.

పదవీకాలం పూర్తయిన తర్వాత…

రాజ్యసభ పదవికాలం పూర్తయిన తర్వాతనే బీజేపీలో చేరాలన్నది డి.శ్రీనివాస్ ఆలోచనగా ఉంది. బీజేపీలో ఉంటేనే తనను అవమానించిన టీఆర్ఎస్ ను కొంత కట్టడి చేయవచ్చన్నది ఆయన భావనగా ఉంది. నిజామాబాద్ లోని తన వర్గం వారినందరినీ ఇప్పటికే డి.శ్రీనివాస్ బీజేపీలోకి పంపారు. ఆయన ప్రస్తుతం చేరినా, చేరకపోయినా ఒక్కటే. ఈ నేపథ్యంలో డి.శ్రీనివాస్ ను టీఆర్ఎస్ కాదనుకున్నా కాషాయపార్టీ రా రమ్మంటుందట. మరి రాజ్యసభ పదవీ కాలం పూర్తయిన తర్వాతనే పెద్దాయన కండువా మార్చేస్తారట.

Tags:    

Similar News