కదిలిన న్యాయవ్యవస్థ … సాధ్యమయ్యేనా?

ఎన్నాళ్ళు దాక్కుని కూర్చుంటాం. ఇక తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ పై యుద్ధం చేయక తప్పదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు క్రియాశీలకం కావడానికి రంగం సిద్ధం [more]

Update: 2020-05-18 18:29 GMT

ఎన్నాళ్ళు దాక్కుని కూర్చుంటాం. ఇక తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ పై యుద్ధం చేయక తప్పదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు క్రియాశీలకం కావడానికి రంగం సిద్ధం చేసేస్తోంది. లాక్ డౌన్ కి కేంద్రం ఒక పక్క సడలింపులు ఇస్తున్న దశలో రెండు నెలలుగా దేశవ్యాప్తంగా న్యాయస్థానాలు స్తంభించి పోయాయి. సుప్రీం కోర్టు, హై కోర్టు లు మాత్రమే అత్యవసర కేసులను విచారిస్తున్నాయి. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని కొన్ని కేసులు విచారిస్తుండగా, మరికొన్ని తక్కువ మంది తో కేసులు విచారిస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పెండింగ్ కేసులు నిలిచి ఉన్నాయి. ఈ నేపథ్యంలో పని మొదలు పెట్టకపోతే ఈ సంఖ్య భవిష్యత్తులో మరింత పెరగడంతో పాటు న్యాయం మరింత ఆలస్యం అయ్యి కక్షిదారులు, న్యాయవాదులు చిక్కుల్లో పడతారని భావించి సుప్రీం కోర్టు తదుపరి కార్యాచరణకు కమిటీ నియమించింది.

డ్రెస్ కోడ్ తో బాటు …

సుప్రీం కోర్టు నియమించిన న్యాయమూర్తుల కమిటీ పలు సూచనలు చీఫ్ జస్టిస్ ముందు ఉంచింది. దేశవ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలు ఆధునిక సౌకర్యాలు సమకూర్చుకుని వీలైనంత వీడియో కాన్ఫెరెన్స్ పద్ధతి ద్వారా కేసుల పరిష్కారానికి పని ప్రారంభించాలని సూచించింది. అదే విధంగా నల్లకోటు ల స్థానంలో వైరస్ నుంచి రక్షణకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ను తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే గత రెండు నెలల కీలక సమయం వృధాగా అయిన నేపథ్యంలో వేసవి సెలవులను కుదించుకుని కోర్టు లను మొదలు పెట్టాలని కమిటీ పేర్కొంది. వాస్తవానికి వేసవి కి 50 రోజుల పాటు కోర్టులు సెలవులు తీసుకుంటాయి. అయితే కోవిడ్ ప్రభావంతో ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే రెండు నెలల విలువైన న్యాయస్థానాల సమయం వృధా అయిందని, దాంతో సమ్మర్ హాలిడేస్ ని కుదించుకోవాలన్న ఆలోచన చేస్తుంది దేశ అత్యున్నత న్యాయస్థానం.

అమలు ఎంతవరకు ..?

దేశంలో జనాభాకు కానీ, కేసుల సంఖ్యకు అనుగుణంగా న్యాయస్థానాలు లేవు. జడ్జీలు లేరు. సిబ్బంది కానీ సౌకర్యాలు అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో సుప్రీం ఇవ్వనున్న ఆదేశాలు అమలు ఏ స్థాయిలో జరుగుతుంది అన్నది న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశం అవ్వనుంది. దీనికి తోడు న్యాయవ్యవస్థకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు అరకొరగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అత్యాధునిక న్యాయవ్యస్థకు శ్రీకారం చుట్టడం కత్తిమీద సామే. వీడియో కెమెరాల ఏర్పాటు, కంప్యూటర్ లు సర్వర్ లు, ఇంటర్ నెట్ హై స్పీడ్ వంటివన్నీ తక్షణం ఏర్పాటు చేయాలిసి ఉంటుంది. దీనికి తోడు ఆధునిక రీతిలో కేసుల విచారణకు సంబంధించి న్యాయవాద వ్యవస్థలోని ప్రతిఒక్కరికి ముందుగా శిక్షణ కూడా అవసరం. దీనిపై దేశంలోని బార్ అసోసియేషన్ లు అన్నింటితో చర్చించి అవగాహన కల్పించి తదుపరి పని మొదలు పెట్టకపోతే అంతా గందరగోళం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే సుప్రీం చర్యలు ఎలా ఉండబోతాయన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News