సీజన్ లో ఫ్యాన్ స్పీడ్ గా తిరగాల్సి ఉన్నా..?

ఫ్యాన్ పార్టీ గత ఏడాదితో పోలిస్తే స్పీడ్ బాగా తగ్గింది. నిజానికి ఇపుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది. అందువల్ల ఫ్యాన్ స్పీడ్ గా తిరగాలి. అది చాలా [more]

Update: 2020-04-09 14:30 GMT

ఫ్యాన్ పార్టీ గత ఏడాదితో పోలిస్తే స్పీడ్ బాగా తగ్గింది. నిజానికి ఇపుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది. అందువల్ల ఫ్యాన్ స్పీడ్ గా తిరగాలి. అది చాలా అవసరం. అధికార వైసీపీకి ఎన్నో పరీక్షలు ఎదురుగా ఉన్నాయి. మరోవైపు ఉక్కబోత అలా ఇలా లేదు. అయితే ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. విజయవంతంగా పదేళ్ళు పనిచేసి జగన్ ని ముఖ్యమంత్రిని చేసిన క్యాడర్ మాత్రం గత కొన్ని నెలలుగా నిస్తేజంగా పడి ఉంటోంది. వారిని కదిపితే మాకేంటి అంటోంది. ఎందుకంటే వారు ఎప్పటిలాగానే అలాగే ఉన్నారు కాబట్టి.

అసలైన సవాల్…..

నిజానికి ఇపుడు జగన్ సర్కార్ చాలా ఇబ్బందులో ఉంది. ప్రభుత్వంగా ఇంకా సర్దుకోకుండానే ప్రపంచ విపత్తు కరోనా రూపంలో దూసుకువచ్చింది. కరోనా వైరస్ నియంత్రణ ఇపుడు అందరి బాధ్యతగా ఉంది. ముఖ్యనగా అతి చాలా పెద్ద క్రైసిస్. అగ్ర రాజ్యం అమెరికా సైతం తట్టుకోలేక విలవిలాడుతోంది. అటువంటిది భారత్ లాంటి దేశంలో కరోనా వీర విహారం చేయకుండా ఆపాల్సిన బాధ్యత అందరిలో ఉంది. ముఖ్యంగా అధికార పార్టీ మీద ఇంకా ఎక్కువగా ఉంది.

పదవులేవీ..?

అయితే వైసీపీ కార్యకర్తలు ఈ విషయంలో మాకు సంబంధం లేదని చెప్పేస్తున్నారు. తమకు పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఏమీ ఒరిగింది లేదని, త్యాగాలు అన్నీ తామే చేస్తూ పోతున్నామని గుస్సా అవుతున్నారు. ఇక నామినేటెడ్ పదవులు ఎటూ ఇవ్వలేదు, దానికి స్థానిక ఎన్నికలను ముడిపెట్టారు. ఇపుడు అవి కూడా వాయిదా పడ్డాయి. దాంతో ఫ్యాన్ పార్టీ కార్యకర్త వేసవి ఎండలా మండిపోతున్నాడు. నిజానికి ఇలాంటి విపత్తు వచ్చినపుడు గతంలో చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ కూడా గట్టిగా హడావుడి చేసేది. ఇపుడు చూస్తే వైసీపీ సర్కార్ కి పార్టీ సహకారం మాత్రం పెద్దగా దక్కడంలేదు.

అది తప్పేనా…?

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీని పట్టించుకోని తీరు వల్లనే ఇపుడు ఇలా పరిస్థితి తయారైందని అంటున్నారు. జగన్ కేవలం ముఖ్యమంత్రిగానే ఉంటూ వచ్చారు. ఆయన తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి పార్టీ జిల్లాల ఆధ్యక్షులు ఎక్కడ ఉన్నారు. ఇతర కార్యవర్గాలు ఏవీ, వాటి సంగతేంటి, అప్పట్లో ప్రతీ వారినీ రాష్ట్ర స్థాయిలో తీసుకున్నారు. మీరే పెద్ద నాయకులు అన్నారు. ఇపుడు వారంతా ఎందుకొచ్చిన పార్టీ పదవులు అంటూ కాడె వదిలేశారు. దాంతో కేవలం అధికారుల మీదనే ఆధారపడి వైసీపీ సర్కార్ కరోనా పైన పోరాటం చేస్తోంది. పార్టీ కూడా సహకరిస్తే కేరళలో, తెలంగాణాలో మాదిరిగా మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. కానీ మండిపోతున్న క్యాడర్ మాట వింటారా?

Tags:    

Similar News