వైరస్ పోయిందన్న ధోరణలోనే…?

కరోనా వైరస్ పోయిందా? అంటే లేదంటున్నారు వైద్యనిపుణులు. కానీ జనంలో మాత్రం కరోనా భయం పోయిందంటున్నారు. ఇప్పటికీ భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజూ [more]

Update: 2021-02-07 18:29 GMT

కరోనా వైరస్ పోయిందా? అంటే లేదంటున్నారు వైద్యనిపుణులు. కానీ జనంలో మాత్రం కరోనా భయం పోయిందంటున్నారు. ఇప్పటికీ భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజూ పదివేలకు పైగానే నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ సుమారు 1.55 లక్షల మంది కరోనాతో మరణించారు. నేటికీ కరోనాతో మరణించే వారి సంఖ్య దేశ వ్యాప్తంగా రోజుకు రెండు వందలకు పైగానే ఉంటుంది. అయినా దేశంలో సాధారణ పరిస్థితుుల నెలకొన్నాయి.

అన్నింటినీ పక్కన పెట్టేసి…..

జనం మాస్క్ లను పక్కన పెట్టేశారు. శానిటైజర్ల వినియోగం తగ్గింది. అందిన లెక్కల ప్రకారం గత డిసెంబరు నెల నుంచి శానిటైజర్ వినియోగం పూర్తిగా తగ్గిపోయిందని, వాటి అమ్మకాలు కూడా పడిపోయాయని తెలుస్తోంది. ఇప్పటికి భారత్ లో 1,10 కోట్ల మందికి కరోనా సోకినట్లు లెక్కలు చెబుతున్నాయి. కోలుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 1.03 కోట్ల మంది కరోనా సోకి కోలుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

దేశంలో ఉందని….

అయితే ఇప్పటికీ కరోనా వైరస్ ఉందని నిపుణులు చెబుతున్నారు. వైరస్ దేశాన్ని విడిచి వెళ్లలేదని, కనీస జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ప్రజలు పట్టించుకోవడం లేదు. నిబంధనలన్నింటికీ మినహాయింపులు ఇచ్చేశారు. లాక్ డౌన్ లో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలే పట్టించుకోవడం లేదు. సినిమాహాళ్లు తెరిచారు. సభలు, సమావేశాలు పెద్దయెత్తున జరగుతున్నాయి.

వ్యాక్సిన్ వేయించుకోవడానికి…..

ఇక కరోనా వ్యాక్సిన్ వచ్చిందని సంబరపడ్డారు. ఇప్పటికే దేశంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ ను తీసుకునేందుకు ప్రజలు సుముఖంగా లేరు. దీనికి కారణం కేవలం ఆరు నెలల్లోనే వ్యాక్సిన్ రావడం, దాని ఫలితాలు కొన్ని చోట్ల వికటించడం వంటి వాటితో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఇష్టపడటం లేదు. వ్యాక్సిన్ వేసుకోకున్నా పరవాలేదన్న ధోరణిలో ప్రజలు ఉన్నారు. కరోనా వైరస్ కు ప్రజలు భయపడటం లేదని, కనీస జాగ్రత్తలు పాటించడం లేదని, ఇది భవిష్యత్ లో ప్రమాదకరంగా మారే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News