అది చేస్తే మరో ఆర్థిక భారం కాదా?

ఆంధ్రప్రదేశ్ ను ఆర్థిక ఇబ్బందులు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పట్లో ఈ సమస్యకు తెరపడే అవకాశమే లేదు. సంక్షేమ పథకాలను చెప్పినట్లు అమలు పర్చడం కోసం అయిన కాడికి [more]

Update: 2021-09-08 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ ను ఆర్థిక ఇబ్బందులు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పట్లో ఈ సమస్యకు తెరపడే అవకాశమే లేదు. సంక్షేమ పథకాలను చెప్పినట్లు అమలు పర్చడం కోసం అయిన కాడికి అప్పులు చేస్తున్నారు. దీంతో ప్రధాన హామీలు కొన్నింటికి బ్రేక్ పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ఈ కోవలోకి చెందిందే. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తులు చేస్తూనే ఉన్నారు. దీనిపై చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని కూడా నియమించారు.

జనగణన జరగక…

అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకు కరోనా సమస్యగా మారింది. ఈ ఏడాది సెన్సెస్ జరగాల్సి ఉంది. కరోనా కారణంగా జనగణను వాయిదా వేశారు. థర్డ్ వేవ్ ముప్పు కూడా ఉందంటున్నారు. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జనగణనకు ఇప్పట్లో అనుమతిచ్చే అవకాశం కన్పించండం లేదు. జనాభా లెక్కలు తేలకుండా జిల్లాల విభజన సాధ్యం కాదు. కొత్త పార్లమెంటు స్థానాలు కూడా ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి.

ఆర్థికంగా భారం….

దీంతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు ఆర్థికంగా కూడా భారమేనని అధికారులు చెబుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత ఆర్థిక భారం భారీగానే పడిందని అధికారులు లెక్కలు కట్టి మరీ చెబుతున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటుతో పాటు ఐఏఎస్ ల సంఖ్యను కూడా పెంచాల్సి ఉంటుంది. సిబ్బంది కూడా అదనంగా కావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి అదనపు భారమే అవుతుంది.

పక్కన పెట్టేసినట్లేనా?

దీంతో కొత్త జిల్లాల ప్రతిపాదనను జగన్ పక్కన పెట్టేసినట్లు తెలిసింది. జనగణన పూర్తయితేనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సి ఉండటంతో దీనికి మరింత సమయం పట్టే అవకాశముంది. ముందుగా రాజధాని తరలింపు పైనే జగన్ శ్రద్ధ పెట్టారని, కొత్త జిల్లాల ఏర్పాటు విషయాన్ని పట్టించుకోవడం లేదని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మొత్తం మీద ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News