వైసీపీ మైండ్ గేమా.. లేక నిజమేనా… ?

తెలుగుదేశం పార్టీ అన్నది చరిత్రలో మిగిలిపోతుందా. ప్రజారాజ్యం బాటన నడచి అది కూడా మరో జాతీయ పార్టీ అయిన బీజేపీలో విలీనం అయిపోతుందా అంటే సమాధానం వెంటనే [more]

Update: 2021-07-20 13:30 GMT

తెలుగుదేశం పార్టీ అన్నది చరిత్రలో మిగిలిపోతుందా. ప్రజారాజ్యం బాటన నడచి అది కూడా మరో జాతీయ పార్టీ అయిన బీజేపీలో విలీనం అయిపోతుందా అంటే సమాధానం వెంటనే చెప్పడం కష్టమే. పరిస్థితులు చూస్తే మాత్రం అలాగే కనిపిస్తున్నాయి. బీజేపీ తెలివిగానే జనసేనను తన వెంట తెచ్చేసుకుంది. చంద్రబాబుని ఏపీ రాజకీయాల్లో ఒంటరిని చేసింది. పొత్తులు ఎత్తులు జాంతా నై అని కూడా ఖరాఖండీగా చెప్పేసింది. దాంతో మరో మూడేళ్ళలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే టీడీపీ పోటీ చేయాల్సిన అగత్యం ఏర్పడుతోంది. అదే కనుక జరిగితే ఆత్మహత్యా సదృశ్యమే అన్న సంగతి చంద్రబాబు కంటే తెలిసిన వారు ఎవరూ లేరు.

విలీనమేనట …?

సరిగ్గా ఇదే పాయింట్ ని పట్టుకుని వైసీపీ మంత్రి కొడాలి నాని చంద్రబాబుని టార్గెట్ చేశారు. ఏపీలో వైసీపీని ఒంటరిగా ఎదుర్కోలేని టీడీపీ బీజేపీతో విలీనం అవుతోందని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద ఉందని బాంబు కూడా పేల్చారు. ఢిల్లీ స్థాయిలో ఏం జరుగుతోందో, ఎవరెవరి దగ్గర రాయబేరాలు సాగుతున్నాయో కూడా తనకు తెలుసు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలే చేశారు. అంతకంటే కూడా చంద్రబాబుకు వేరే ఆప్షన్ కూడా లేదంటూ ఎకసెక్కమాడారు కూడా. లోకేష్ ఎటూ పనికిరాడని, పొత్తుకు బీజేపీ జనసేన ఒప్పుకోవని అందుకే చంద్రబాబు ఇలా విలీనం బాట పట్టారని అంటున్నారు.

నిజమవుతుందా…?

తెలుగుదేశం పార్టీ నాతోనే పుట్టింది, నాతోనే పోతుంది అని ఎన్టీయార్ ఆనాడు చెప్పారు. కానీ అల్లుడు చంద్రబాబు కావడంతో దాన్ని ఇంతకాలం దాకా నెట్టుకువచ్చారు. తనకు వారసుడు బాలయ్యే అని ఎన్టీయార్ అన్నా, మరో దశలో లక్ష్మీపార్వతి వైపు మొగ్గు చూపినా కూడా అన్న గారి వారసుడు చంద్రబాబే అని టీడీపీ రాజకీయ చరిత్ర నిరూపించింది. ఇక మామకు తానుంటే తనకు ఎవరున్నారని చంద్రబాబు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యమే కనిపిస్తోంది. దానికి కారణాలు చంద్రబాబు ఎవరినీ నమ్మకపోవడం, నందమూరి కుటుంబాన్ని పక్కన పెట్టడం వంటివెన్నో ఉన్నాయి. ఇక లోకేష్ కి అంత సత్తా లేదని బాబుకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు అన్నింటికీ మించి రాజకీయ చరమాంకంలో ఉన్న‌బాబుకు 2024 ఎన్నికలు అత్యంత కీలకం. అందుకే ఆయన ఆలోచనలు ఎలా అయినా సాగవచ్చు అన్న విశ్లేషణలు అయితే ఉన్నాయి.

అదే భాగ్యమా…?

అప్పట్లో ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఒక మాట తరచూ అనేవారు. టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు. ఒకవేళ వారు తమతో కలసి రావాలి అనుకుంటే మాత్రం ఆ పార్టీని విలీనం చేయాల్సిందే అని కూడా గట్టిగా చెప్పేవారు. బహుశా బీజేపీ పెద్దల మదిలో ఉన్న మాటనే ఆయన అలా పలికి ఉండవచ్చు అంటున్నారు. ఇంకో వైపు ఈ విలీనం వల్ల టీడీపీకి లాభం ఏంటి అంటే అధికారం కొంతకాలమైనా చేతిలో ఉంటుంది. చంద్రబాబు మీద కేసులు లాంటి భయాలు అసలు ఉండవు. జీవితంలో ఒకసారి అయినా లోకేష్ ని సీఎంగా చూసుకునే వీలు కూడా కలగవచ్చు. బీజేపీకి కూడా ఇది లాభదాయకమే అంటున్నారు. ఒకవేళ టీడీపీ కాదన్నా 2024 తరువాత మళ్ళీ ఓటమి ఎదురైతే ఆ పార్టీ ఉంటుందో ఉండదో కాబట్టి విలీనమే బెటర్ అన్న మాట అయితే ఉంది అంటున్నారు. మరి ఈ సీక్రెట్ ని కొడాలి నాని ఎలా లాగారో కానీ ఇది నిజమైన వార్త అయితే మాత్రం టీడీపీ చరిత్ర పుటలలోనే ఇక చూసుకోవాలేమో

Tags:    

Similar News