సాహసానికి ..’సై ‘

నానాటికీ జాతీయ రాజకీయ తెరపై తన ప్రాదాన్యాన్ని కోల్పోతున్న కాంగ్రెసు సాహసం చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని చాటి చెబుతున్నాయి. [more]

Update: 2021-07-07 16:30 GMT

నానాటికీ జాతీయ రాజకీయ తెరపై తన ప్రాదాన్యాన్ని కోల్పోతున్న కాంగ్రెసు సాహసం చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని చాటి చెబుతున్నాయి. గడచిన ఒకటి రెండు సంవత్సరాలుగా వరస వైఫల్యాలతో పార్టీ అస్తిత్వానికే ముప్పు వచ్చి పడింది. గతంలో కాంగ్రెసు చుట్టూ చేరి బీజేపీపై పోరాటం చేయాలని విపక్షాలు కోరుతుండేవి. అసలు ఇప్పుడు పట్టించుకోవడం మానేశాయి. ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితమైన ప్రాంతీయ పార్టీలు తాము జాతీయ ప్రత్యామ్నాయమనే భ్రమల్లో మునిగి తేలుతున్నాయి. పర్యవసానంగా కాంగ్రెసు పార్టీ ప్రతిపక్షంగా కేంద్ర స్థానం నుంచి క్రమేపీ పడిపోతోంది. ఈ ప్రమాదానికి అనేక కారణాలున్నాయి. కాంగ్రెసు పార్టీలో పేరుకుపోయిన ముఠాతత్వం, రాష్టాలలో ముసలి నాయకత్వం , పదవీ లాలసత వెరసి పార్టీని భ్రష్టు పట్టించాయి. అనేక దశాబ్దాల పాటు పదవులను అనుభవించిన నాయకులు సైతం ఇంకా పార్టీని పీల్చిపిప్పి చేయాలని చూస్తున్నారు. వీరందరికీ చెక్ పెట్టక తప్పదని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పర్యవసానంగా తిరుగుబాట్లు, తీవ్రమైన అసమ్మతి తలెత్తినా తట్టుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఒకే మాట.. ఒకే బాట..

2019 ఎన్నికలలో ఓటమి తర్వాత కాంగ్రెసు పార్టీ వ్యవహారాల్లో తన జోరు తగ్గించారు రాహుల్ గాంధీ. ప్రియాంక గాంధీ ఎప్పుడూ యాక్టివ్ గా లేరు. తన తల్లి పోటీ చేసే నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలు మాత్రమే నిర్వహించేవారు. ఇదే తంతు కొనసాగితే పార్టీ మొత్తం నాశనమయిపోతుందని రాహుల్, ప్రియాంకలకు సన్నిహితులు చాలా కాలంగానే చెబుతూ వస్తున్నారు. అన్యమనస్కంగానే అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీలో మరెవరూ ఈ స్తానాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా లేరు. రాహుల్ కోసం మరోసారి అధ్యక్ష స్థానం రిజర్వ్ చేసి ఉంచారు. పార్టీలో వృద్ధతరం డిమాండ్లపై విసిగిపోయి ఆయన పదవికి దూరంగా ఉంటూ వస్తున్నారు. తనకు సన్నిహితంగా ఉండే జ్యోతిరాదిత్య సింధియా, జతిన ప్రసాద వంటి వారు కూడా దూరం కావడంతో పార్టీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను రాహుల్ గుర్తించారు. ఇదే సమయంలో ప్రియాంక సైతం అన్నకు అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. ఫలితంగా కాంగ్రెసులో రానున్న కాలంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో అన్నాచెల్లెళ్లు ఒకే మాట, ఒకే బాటగా నిలవాలని నిర్ణయించినట్లు పార్టీలోని అత్యున్నత వర్గాలు వెల్లడించాయి.

రిస్కు చేద్దాం..

పార్టీ ప్రక్షాళనకు సాహసోపేతమైన చర్యలకు దిగకపోతే పుట్టి మునగడం ఖాయమని అగ్రనాయకులు గ్రహించారు. అధ్యక్షురాలు సోనియా గాంధీకి సైతం ఈ విషయం అర్తమైంది. కానీ సీనియర్లను నిర్లక్ష్యం చేస్తున్నారనే సెంటిమెంటును ప్రజల్లోకి పంపడం ఆమెకు ఇష్టం లేదు. అందువల్ల తాను నేరుగా జోక్యం చేసుకోకుండా రాహుల్, ప్రియాంకలకు ప్రీ హ్యాండ్ నివ్వాలని సోనియా నిర్ణయించారు. పీసీసీ అధ్యక్షుల నియామకాలు, అసమ్మతి వాదులపై చర్యలు అన్నిటికీ అన్నాచెల్లెళ్లకు సోనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షునిగా రేవంత్ నియామకం సాహసోపేతమైన చర్య. పెద్ద తిరుగుబాటు వచ్చి బీజేపీ లోకి సీనియర్లంతా వెళ్లిపోతారని అసమ్మతి నాయకులు అధిష్టానాన్ని హెచ్చరించారు. అయినా రాహుల్ ఖాతరు చేయలేదు. ప్రజల్లో ఆకర్షణ ఉన్న వానికి పట్టం గట్టాల్సిందేనని అసమ్మతి వాదులకు స్పష్టమైన సంకేతాలు పంపించారు. ఇంకోవైపు ఎఫ్పుడూ నిరసనలతో అసంత్రుప్తి స్వరాలు వినిపించే వాళ్లు వెళ్లిపోవచ్చనే సందేశాన్ని సైతం పరోక్షంగా ఇచ్చేశారు. మరోవైపు పంజాబ్ లో ఏకచ్ఛత్రాధిపత్యం కింద నియంతృత్వం చెలాయిస్తున్న ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు చెక్ పెట్టడానికి సిద్దమయ్యారు. అసమ్మతి నాయకుడు నవజోత్ సింగ్ సిద్దూకు గంటల తరబడి సమయం కేటాయించి రాహుల్, ప్రియాంకలు సమావేశమయ్యారు. రెండు వారాల క్రితం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రికి కనీసం వారి దర్శనం కూడా దొరకలేదు. 80 వ పడిలో పడిన అమరీందర్ స్థానంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేయడంలో బాగమే ఇది. ఇప్పటికే సమస్యలలో ఉన్న రాష్ట్రాలను గుర్తించి నాయకత్వ మార్పులు, క్రమశిక్షణ చర్యలకు పూనుకోనున్నట్లు సమాచారం.

జాతీయ స్థాయిలోనూ..

అఖిల భారత స్థాయిలో పార్టీని సంస్కరించేందుకు , ప్రతిపక్షాలకు కేంద్ర స్థానంగా మార్చేందుకు సైతం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా లోక్ సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌధురిని మార్చేందుకు కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమబెంగాల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అదీర్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తీవ్రంగా వ్యతిరేకించే శక్తి. మమత కాంగ్రెసులో ఉన్నప్పటి నుంచే వారి మధ్య సత్సంబంధాలు లేవు. ఇటీవల ఘోరపరాజయం తర్వాత మమత ను సైతం కాంగ్రెసు కూటమిలోకి లాగాలనేది రాహుల్, ప్రియాంకల ఆలోచన. అందుకు అదీర్ అడ్గుగా ఉంటారని , ఆయన లోక్ సభ పక్ష నేతగా ఉంటే మమత సన్నిహితం కారని పార్టీలు వర్గాలు పేర్కొంటున్నాయి. అందువల్ల మమతను ప్రసన్నం చేసుకునేందుకు అదీర్ పై వేటు వేసేందుకు ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఈపదవిని కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శశిథరూర్ కు అప్పగించడం ద్వారా దక్షిణాది ప్రాధాన్యం పెంచాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల నాటికి ప్రక్షాళన పూర్తి చేయాలనేది అగ్రనాయకుల సంకల్పంగా పార్టీలో ప్రచారం సాగుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News