ఏపీలో కాంగ్రెస్ టార్గెట్స్ ఇవే..!

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఈసారైనా ఖాతా తెరిచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు [more]

Update: 2019-03-14 06:30 GMT

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఈసారైనా ఖాతా తెరిచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని, పొత్తుతో పోటీ చేస్తే బలమైన నేతలు ఉన్న స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు పెట్టుకున్న ఆశలపై చంద్రబాబు నాయుడు నీళ్లు చల్లారు. పొత్తు తెలంగాణకే పరిమితమని, జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తాము కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పొత్తు ఉండదని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. బాబు సిగ్నల్స్ తో ఒంటరి పోరుకు సిద్ధం కావాలని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా నేతలకు దిశానిర్దేశం చేసింది. దీంతో కాంగ్రెస్ నుంచి గెలుస్తామని నమ్మకం లేని నేతలు విజయావకాశాలు ఉన్న టీడీపీ, వైసీపీలోకి చేరిపోతున్నారు. మిగతా వారు మాత్రం మళ్లీ కాంగ్రెస్ నుంచే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు…

దీంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఆ పార్టీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. టిక్కెట్ల కోసం ఏమాత్రం పోటీ లేకపోవడంతో అభ్యర్థులను వేగంగా ఖరారు చేస్తూ వెళుతున్నారు. ప్రధానంగా నియోజకవర్గాల వారీగా సామాజకవర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బదిలీ అయిన నేపథ్యంలో మళ్లీ వైసీపీ ఓటు బ్యాంకును చీల్చి కొంతైనా తమవైపు మలుపుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తోంది. అభ్యర్థుల ఎంపిక కూడా ఈ దిశగానే సాగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి ఊమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపికపై రహస్యంగా కసరత్తు చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాలకు పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది పార్టీ.

వైసీపీ విజయావకాశాలను దెబ్బతీస్తుందా..?

రాష్ట్రంపై ఎలాగూ ఆశలు పెట్టుకోని ఆ పార్టీ కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చి, రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామనే నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రాహుల్ గాంధీతో హోదా భరోసా సభ కూడా ఏర్పాటు చేసింది. ప్రత్యేక హోదా భరోసానే తమ ఓట్ల శాతాన్ని పెంచుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అన్ని స్థానాలకూ పోటీ చేసినా బలమైన నేతలు ఉన్న కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని వాటిపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అయితే, కాంగ్రెస్ లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎవరిని విమర్శించాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. జాతీయ స్థాయిలో అవగాహన ఉన్న నేపథ్యంలో అధికార టీడీపీ వైఫల్యాలను విమర్శించే అవకాశం ఆ పార్టీకి లేదు. ఇక, విమర్శింల్సింది కేవలం వైసీపీనే. ఎలాగైనా వైసీపీని అధికారంలోకి రాకుండా నిలువరించాలనే టార్గెట్ నే కాంగ్రెస్ పెట్టుకుంది. టీడీపీకి ఎక్కువ పార్లమెంటు స్థానాలు వచ్చి, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎలాగూ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో బలమైన నేతలు ఉన్న కొన్ని స్థానాలను గెలుచుకుని అసెంబ్లీలో ఖాతా తెరవాలనేది ఒక టార్గెట్ అయితే, వైసీపీ ఓటు బ్యాంకును చీల్చి టీడీపీ విజయావకాశాలను మెరుగుపర్చడం రెండో టార్గెట్ గా కాంగ్రెస్ పెట్టుకొని ఎన్నికలకు సిద్ధమవుతోంది.

Tags:    

Similar News