కలిసొచ్చే కాలం…కొంచెం కష్టపడితే?

వందేళ్లకు పైగా చరిత్రగల హస్తం పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరవాత పార్టీ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. [more]

Update: 2020-12-19 16:30 GMT

వందేళ్లకు పైగా చరిత్రగల హస్తం పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరవాత పార్టీ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న అయిదు రాష్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియక పార్టీ ఆందోళన చెందుతోంది. 2021 ఏప్రిల్, మే నెలల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్రాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి , ముందుచూపుతో బరిలోకి దిగితే గౌరవ ప్రదమైన ఫలితాలు సాధించవచ్చని, అన్నీ బాగుంటే ఒకటి రెండు రాష్రాల్లో అధికారాన్ని అందుకోవడం అంత కష్టం కాదన్న అభిప్రాయాన్ని సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే వారి వాదనను పూర్తిగా తోసిపుచ్చడం కష్టమే అవుతుంది.

కేరళలో బలంగా….

ముందుగా కేరళ విషయానికి వస్తే అక్కడ సీపీఎం నాయత్వంలోని ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) అధికారంలో ఉంది. కేరళలో అయిదేళ్లకోసారి అధికార పార్టీని గద్దె దించే సంప్రదాయ ముంది. యూడీఎఫ్ కూటమిలో లుకలుకలున్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ పైనే అనేక ఆరోపణలు ఉన్నాయి. శబరిమల ఆలయానికి సంబంధించి వివాదంలో వామపక్ష సర్కారు అవలంబించిన విధానంపై ప్రజల్లో అసమ్మతి ఉంది. గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 20కి కాంగ్రెస్ 16 స్థానాలను కైవసం చేసుకుంది. పార్టీ అగ్రనేత రాజీవ్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈ పరిస్థితుల్లో సమన్వయంతో ముందుకు సాగితే కేరళను కైవసం చేసుకోవడం అంత కష్టం కాదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం ఉమెన్ చాందీ, సీఎల్పీ నాయకుడు రమేష్ చెన్నితాల, పీసీసీ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్ కలసికట్టుగా పనిచేస్తున్నారు. 2016 నాటి ఎన్నికల్లో సీపీఎంకు 58, సీపీ ఐకి 19 లభించాయి. హస్తం పార్టీకి 22, దాని మిత్రపక్షం ఐయూఎంఎల్ (ఇండియన్
యూనియన్ ఆఫ్ ముస్లిలీగ్) 18 సీట్లు సాధించాయి.

గట్టిగా పోరాడితే…..

కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్న మరో రాష్రం అసోం అని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. 126 స్థానాలు గల ఈ ఈశాన్య రాష్ర్టంలో 2016లో భాజపా నాయకత్వంలోని ఎన్డీఏ గెలిచింది. భాజపా 60కి పైగా స్థానాలు సాధించగా, దాని మిత్రపక్షం అసోం గణపరిషత్ 14, బోడో పీపుల్స్ ఫ్రంట్ 12 సీట్లు సాధించాయి. హస్తం పార్టీ పాతిక సీట్లకే పరిమితమైంది. గత ఏడాది సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం), జాతీయ పౌర పట్టిక (ఎన్ ఆర్ సీ) కారణంగా భాజపా సర్కారు చెడ్డపేరు మూటగట్టకుంది. అక్రమ వలసదారులను ఏరివేసే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ చట్టాలు ప్రతికూల ప్రభావం చూపడంతో కమలం పార్టీ కంగుతిన్నది. దీంతో గట్టిగా పోరాడితే విజయం తమదేనన్న ధీమాను పీసీసీ చీఫ్ రిపున్ బోరా వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 14 సీట్లకు భాజపా 9, హస్తం పార్టీ 3 గెలుచుకున్నాయి.

తమిళనాడు, పుదుచ్చేరిలో…..

దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డీఎంకే కూటమిలో ఉండటం కలిసొచ్చే అంశం. స్టాలిన్ నాయత్వంలోని డీఎంకే గత ఎన్నికల్లో మొత్తం 236 సీట్లకు 89 సాధించి విజయానికి చేరువైంది. గతేడాది పార్లమెంటు మొత్తం 38కి గాను డీఎంకే కూటమి 37 సీట్లు సాధించి సత్తా చాటింది. కూటమిలోని హస్తం పార్టీ 8 గెలుచుకుంది. రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపు తథ్యమన్న రాజకీయ విశ్లేషణలతో కాంగ్రెస్ పార్టీలో ఆనందం వ్యక్త మవుతోంది. అదే జరిగితే సంకీర్ణ సర్కారులో కీలక భాగస్వామిగా సచివుల పదవులను పొందే అవకావం ఉంది. పక్కనే ఉన్న పుదుచ్చేరిలో వి.నారాయణ స్వామి నాయత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతేడాది ఇక్కడి ఏకైక పార్లమెంటు సీటును కాంగ్రెసే గెలుచుకుంది. 32 సీట్లుగల రాష్రంలో డీఎంకే మద్దతుతో హస్తం పార్టీ మళ్లీ గెలిచే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో సీపీఎంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అధికారం సాధించలేనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మెరుగైన సీట్లు గెలుచుకోవచ్చని అంచనా.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News