కాంగ్రెస్ కెలుక్కుంటున్నట్లుందిగా?

అసలే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ డీలా పడిపోయింది. కర్ణాటక, మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను బీజేపీ ఆకర్ష్ తో దించేసి తాను గద్దెనెక్కింది. గుజరాత్ [more]

Update: 2020-06-16 17:30 GMT

అసలే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ డీలా పడిపోయింది. కర్ణాటక, మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను బీజేపీ ఆకర్ష్ తో దించేసి తాను గద్దెనెక్కింది. గుజరాత్ లో కాంగ్రెస్ శాసనసభ్యులను కాపాడుకోలేక అల్లాడిపోతుంది. ఇక రాజస్థాన్ లో కూడా బేరసారాలు మొదలయ్యాయని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ స్వయంగా చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ కెలుక్కుంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సంకీర్ణ ప్రభుత్వంలో….

మహారాష్ట్రలో శివసేన అధికారంలో ఉండటాన్ని కాంగ్రెస్ సహించలేక పోతుందంటున్నారు. అక్కడ అధికార మార్పిడి జరగాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఈ మేరకు ఉద్ధవ్ థాక్రే తో కాంగ్రెస్ నేతలు చర్చలు జరపనున్నారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఏర్పడటానికి కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతు ఇవ్వడమే కారణం. ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేసిన శివసేన ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడంతో బయటకు వచ్చింది.

ముగ్గురూ పంచుకోవాలనేనా?

ప్రస్తుత మహారాష‌్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీలు భాగస్వామ్యులుగా ఉన్నారు. అయితే గత కొద్ది నెలలుగా ప్రభుత్వంలో అసంతృప్తులు తలెత్తాయంటున్నారు. కీలక నిర్ణయాలను ఉద్ధవ్ థాక్రే ఏకపక్షంగా తీసుకుంటున్నారని, భాగస్వామ్య పక్షాలను సంప్రదించడం లేదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. నిజానికి శివసేన రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవిని బీజేపీని కోరింది. ఇప్పుడు అధికారంలో మూడు పార్టీలు ఉండటంతో మూడు పార్టీలూ ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

అంత అసంతృప్తి ఉందా?

ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటిని ఎన్సీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నా ఇటీవల గవర్నర్ ను శరద్ పవార్ ను కలవడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తమ అసంతృప్తిని నేరుగా ఉద్ధవ్ థాక్రే వద్ద వెళ్లగక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే ప్రతిపాదన ఉద్ధవ్ ముందుకు వస్తే దానికి ఆయన అంగీకరిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.

Tags:    

Similar News