ఉద్ధవ్ కు ఆ రాత లేదా?

దాదాపు 35 ఏళ్ల తర్వాత అందినట్లే అంది చేజారిపోతుండటం శివసేనలో ఆందోళన కల్గిస్తోంది. శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని శివసేన వ్యవస్థాపక నేత బాల్ థాక్రే [more]

Update: 2019-11-19 17:30 GMT

దాదాపు 35 ఏళ్ల తర్వాత అందినట్లే అంది చేజారిపోతుండటం శివసేనలో ఆందోళన కల్గిస్తోంది. శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని శివసేన వ్యవస్థాపక నేత బాల్ థాక్రే కోరిక. తండ్రి కోరిక తీర్చాలన్న తపనతో ఉద్దవ్ థాక్రే అన్నింటినీ వదలేసుకున్నారు. తండ్రి ఘాటుగా విమర్శించిన కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టేందుకు రెడీ అయ్యారు. కేవలం 56 స్థానాలు వచ్చిన శివసేన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలనుకోవడం అత్యాశే అవుతుందని బీజేపీ గట్టిగా చెబుతోంది.

షరతులతో మొదలై….

ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేసిన శివసేన తమకు సీఎం పదవి ఇవ్వాల్సిందేనంటూ షరతు పెట్టింది. 50: 50 ఫార్ములాను ఖచ్చితంగా అమలు చేయాలని గట్టిగా కోరింది. ముఖ్యమంత్రి పదవితో పాటు మంత్రి పదవులనూ సగానికి పంచాలని డిమాండ్ చేసింది. తాము కొత్తగా చేస్తున్న డిమాండ్ కాదని, పొత్తు కుదుర్చుకునేటప్పడే బీజేపీ, శివసేనల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే తాము కోరుతున్నామని శివసేన వాదించింది. దీనికి బీజేపీ అంగీకరించకపోవడంతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది.

అంతా సజావుగా….

ఉద్ధవ్ థాక్రే ఎన్సీపీ, కాంగ్రెస్ లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. సోనియాగాంధీకి ఫోన్ చేసి మరీ మద్దతును కోరారు. శరద్ పవార్ తో సమావేశమై అన్ని విషయాలూ చర్చించారు. అంతా సజావుగా జరుగుతుందని ఉద్దవ్ థాక్రే భావించారు. కానీ పులి మీద సవారీ చేయడానికి ఎన్సీపీ, కాంగ్రెస్ లు వెనకడుగు వేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శివసేనతో కలసి నడించేందుకు కొంత వెనుకంజ వేస్తున్నారు.

కలిసి నడిస్తే కష‌్టమేనని….

హిందుత్వ పార్టీ అయిన శివసేనతో కలసి నడిస్తే దీర్ఘకాలంలో పార్టీ మహారాష్ట్రలో దెబ్బతినే అవకాశాలున్నాయని ఇటు శరద్ పవార్ అటు కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీకి అడ్వాంటేజీ అవుతుందని దూరాలోచన చేస్తున్నాయి. అందుకే ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించాయి. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుని రిస్క్ లో పడటం రెండు పార్టీలకూ ఇష్టం లేదు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలని భావించి అన్ని విషయాలూ ముందే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఉద్దవ్ థాక్రే ఆశలపై నీళ్లు చల్లాయి. మరోవైపు బీజేపీ ఎప్పటికైనా శివసేన తమతో కలసి వస్తుందన్న నమ్మకంతో ఉంది. మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయానికి ఇప్పట్లో తెరపడేలా కన్పించడం లేదు.

Tags:    

Similar News